Suryaa.co.in

Political News

నిరంకుశత్వంపై నిశ్శబ్ద విప్లవం

ఆంధ్ర ప్రజలకు నేడు నవోదయం. అభివృద్ధికి పట్టం కట్టిన ఆంధ్రా ప్రజానీకమా మీకు వందనాలు . రౌడీ ఇజాన్ని , గూండాయిజాన్ని తిప్పికొట్టిన ఆంధ్రా మహిళలారా అందుకోండి మా జేజేలు. మాకు గంజాయి వద్దు ఉద్యోగమే ముద్దు అన్న యువ ఆంధ్రులారా , అందుకోండి మా దీవెనలు. ఉచితాలు వద్దు జీవనోపాధి చూపించమన్న శ్రామిక , కర్షక సోదరులారా , అందుకోండి మా విప్లవ వందనాలు. మా భూములు మీద మాకే హక్కుండాలని నినదించిన ఆంధ్రా రైతాంగ ఓటర్లకు మీకివే మా అభివందనాలు.

అభివృద్ధికి ఆటంకం కలిగించిన అరాచక శక్తులకు బుద్ధి చెప్పి, కుల దురహంకారంతో కుల విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలను తిప్పికొట్టి, అసత్యాలతో – అర్ధ సత్యాలతో ప్రజలను ఏమార్చాలని చూసిన పాలకుల నడ్డివిరిచి , సత్యమేవ జయితే నానుడిని నిజం చేసినారు మన ఆంధ్రులు.

వర్తమాన , భవిష్య నాయకులకు ఆంధ్ర ప్రజల తీర్పు ఒక హెచ్చరిక. అన్ని వర్గాల జనుల ఆవేదన , ఆక్రందన , అసంతృప్తిని ఓట్ల రూపంలో ప్రకటించి, అడ్డమైన దోపిడీలు చేసి , అవి కప్పిపుచ్చు కునేందుకు అప్పులు చేసి , కొంత పప్పు బెల్లాలు పంచి మోసం చెయ్యాలని చూసిన పాలకులకు తగిన బుద్ధి చెప్పినారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కుతో అసుర సంహారం చేసి ఓటు విలువను చూపించిన ఆంధ్రులకు శత కోటి వందనములు.

పెల్లుబికిన ప్రజల ధర్మాగ్రహంలో మాడి మస్సయ్యింది బులుగు బాచ్. పైశాచిక ఆనందం పొందే పిశాచాల పీచమణచి , రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన వై.సి.పి పాలకులకు రాజకీయ సమాధి కట్టి , అన్యాయాన్ని ఎదిరించింది పల్నాటి పౌరుషం. అల్లూరి – పొట్టి శ్రీరాముల త్యాగాల ఈ ఆంధ్రావనిని చెరబట్టిన పాలకులను మట్టికరిపించి , అన్యాయాన్ని ఎదిరించి పోరాడిన అంజిరెడ్డి తాత, పల్నాటి పులిబిడ్డ మంజుల, పల్నాటి పౌరుష ప్రతీక శేషగిరి రావు లాంటి అనేక మంది ప్రాణాలకు తెగించి పోరాడిన ఆంధ్రా ప్రజానీకమా అందుకోండి మా జేజేలు. పార్టీ కోసం , ప్రజల కోసం వై.కా.పా దమనకాండకు ప్రాణాలొడ్డిన కుటుంబాలకు వందనాలు. విధ్వంసక, వినాశక, విచ్ఛిన్న శక్తులను చీల్చి చెండాడిన ఆంధ్రా ప్రజలారా..అందుకోండి మా లక్షలాది వందనాలు.

– వి . ఎల్. ప్రసాద్

LEAVE A RESPONSE