ప్రజలకు, ప్రభుత్వానికి సంధానకర్తలుగా పనిచేయండి

– భీమవరంలోని జిల్లా సమాచార శాఖ కార్యాలయాన్ని సందర్శించిన రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి..

భీమవరం:కొత్త జిల్లాలో ప్రభుత్వ పథకాల సమాచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాన్ని సమాచార శాఖ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనరు టి.విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయాన్ని సమాచార శాఖ కమీషనరు టి.విజయ్ కుమార్ రెడ్డి సందర్శించారు.

ఈ సందర్బంగా ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహనకు సమాచార సిబ్బంది పాత్ర, తదితర అంశాలపై ఆయన సిబ్బందితో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను పేద,
ipr2 బలహీన వర్గాల ప్రజల కొరకు అమలు చేస్తోందన్నారు. పథకాలపై అవగాహన లోపంతో అర్హులైన ఏ ఒక్కరూ ప్రభుత్వం అందించే లబ్ధికి దూరం కాకూడదని, చిట్ట చివరి లబ్ధిదారుని వరకు సమాచారం చేరవేయడంలో సమాచార శాఖ సిబ్బంది కీలకపాత్ర వహించాలన్నారు.

పరిపాలన సౌలభ్యం కొరకు ప్రభుత్వం నూతన జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇదే వరవడితో ప్రజలకు సమాచారాన్ని చేరవేసే అన్ని మాధ్యమాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల సంక్షేమ ఫలాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందినపుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సహకారం, ప్రజోపయోగకరమైన అంశాలకు అభిప్రాయసేకరణ తెలుసుకొని, వాటిపై విస్తృత అవగాహన కల్పించేలా ప్రకటన జారీ చేయాలన్నారు.

మీడియాతో సత్సంబంధాలు పెంచుకుంటూ వారిని సమన్వయం చేసుకుంటూ మరింత సమర్ధవంతంగా పనిచేయాలన్నారు. మన వృత్తిని సరైన విధానంతో నిర్వర్తిస్తూ ముందుకు వెళ్తే ప్రజలకు చాలామేలు చేసినవారమౌతామని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సమాచార శాఖ ప్రతిష్టతను పెంచేందుకు మరింత సమర్ధవంతంగా పనిచేసేందుకు రోజు రోజుకు కొత్తగా పెరుగుతున్న డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వంటివి దృష్టిలో ఉంచుకుని మారుతున్న సాంకేతికతను వినియోగించుకోవలన్నారు. జిల్లాల పునర్విభజన నేపధ్యంలో సమాచార శాఖను కూడా బలోపేతం చేసేందుకు శాఖలోని రెండు విభాగాలను ఒకే గొడుగుకిందకు తీసుకురావడం జరిగిందన్నారు. సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చాన్నారు.

ఈ సమావేశంలో అడిషనల్ డైరెక్టరు ఎల్. స్వర్ణలత, డిప్యూటీ డైరెక్టరు పి. తిమ్మప్ప, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి.నాగార్జన్, అడిషనల్ పిఆర్వో టి. నాగేశ్వరరావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ సిహెచ్. బాబురావు, సీనియర్ అసిస్టెంట్ కెటిఏంకెఎన్ఎస్ రాజు, పబ్లిసిటీ అసిస్టెంట్ సిహెచ్ శ్రీనివాస నెహ్రు , కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply