– రైతులను ఆదుకోవాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదు
– అన్యాయంగా జోగి రమేష్ పేరు ఇరికించారు
వైయస్సార్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి
కడప: చంద్రబాబు ఏడాదిన్నర పాలన గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ‘పబ్లిసిటీ పీక్.. పర్ఫార్మెన్స్ వీక్’ అన్నట్లుగా ఉందని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వ్యవస్థలు ధ్వంసం అయ్యాయని, ఎన్నికల హమీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను దారుణంగా వంచించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెన్షన్ పంపిణీకి ప్రతి నెలా హంగామాతో డ్రామా చేస్తున్న సీఎం చంద్రబాబు, కొత్తగా ఒక్క పెన్షన్ ఇవ్వకపోగా, దాదాపు 5 లక్షల పెన్షన్లకు కోత పెట్టారని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్న ఆయన, రైతులను ఆదుకోవాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏనాడూ ఉండదని అన్నారు.
గూగుల్ డేటా సెంటర్కు రూ.22 వేల కోట్లు రాయితీలు ప్రకటించిన కూటమి ప్రభుత్వం, ఆ పేరుతో వివపరీతంగా మార్కెటింగ్ చేస్తోందని గుర్తు చేశారు.
డేటా సెంటర్ వల్ల ఎంత మందికి ఉద్యోగావకాశాలు వస్తాయన్న దానిపై స్పష్టంగా చెప్పడం లేదని ఆక్షేపించారు. నకిలీ మద్యం తయారుచేస్తూ, టీడీపీ నాయకులు రెడ్ హ్యాండెడ్గా దొరికినా, ఆ బురదను వైయస్సార్సీపీకి అంటగట్టే విధంగా, మాజీ మంత్రి జోగి రమేష్ పేరు ఇరికించి ఆయన్ను అరెస్టు చేశారు. సెల్ఫోన్ పోగొట్టుకున్నానని చెప్పిన జనార్దన్రావు ఫోన్ నుంచి తీసుకున్న వీడియో రికార్డింగ్లు, వాట్సాప్ స్క్రీన్షాట్లే ఆధారాలుగా చెప్పడం ఇంకా విడ్డూరంగా ఉంది.
అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవినీతిలో నిండా మునిగిపోయారు. ఆలయ భూములు, పోర్టులు, ఆస్పత్రులను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తున్నారు. మొంథా తుపాన్లో సహాయ కార్యక్రమాల్లో వైఫల్యం, కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటన నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేశ్ను అక్రమంగా అరెస్ట్ చేశారు.
ఒక గిగా వాట్ గూగుల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారని నమ్మబలికిన చంద్రబాబు, ఎంతమంది యువతకు ఉద్యోగాలిస్తున్నారో చెప్పమంటే మాత్రం చెప్పలేకపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ఇన్డైరెక్ట్ ఉద్యోగాలిస్తామని చెప్పడం మరో వింత. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయి.
దీంతో రాష్ట్ర సరిహద్దుల్లోని పెట్రోల్ బంక్ల్లో వ్యాపారాలు అస్సలు నడవడం లేదు. ఎన్నికలప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని ప్రచారం చేసుకున్న తండ్రీకొడుకులు, వాటిని ఎందుకు తగ్గించడం లేదో చెప్పాలి. సీఎం చంద్రబాబుకు నిజంగా పేదల మీద ప్రేమే ఉంటే తక్షణమే డీజిల్ ధరలు తగ్గించాలని ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.