Suryaa.co.in

Andhra Pradesh

అధికారంలోకి రాగానే అమరావతి పనులు

-అబద్దాలు చెప్పడంలో జగన్ అండ్ కో మాస్టర్ డిగ్రీ చేశారు
-నేను చేసిన సంక్షేమంలో 10శాతమైనా గెలిచినోళ్లు చేశారా?
-మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్

మంగళగిరి: అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని పనులను యుద్ధప్రాతిపదికన చేపడతామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం కృష్ణాయపాలెం వాసులతో యువనేత సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వం అమరావతి పనులు కొనసాగించి ఉంటే లక్షమందికి ఉపాధి అవకాశాలు లభించేవి. 2014లో జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ… విద్వేషాలు పెంచడం ఇష్టంలేదు, అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ముక్కలాట ఆడారు. కర్నూలు,విశాఖలో ఒక్క ఇటుక వేయలేదు. రాజధాని ఇక్కడే ఉంటుంది, జగన్ ని ఒప్పిస్తానని చెప్పిన ఆర్కే మూడు రాజధానులకు మద్దతుగా ఓటేశారు.

మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కృష్ణాయపాలెం దళిత రైతులు ఆందోళనచేస్తే మాదిగ సోదరులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి బేడీలు వేసి జైలుకు పంపారు. ఆ రైతులకు టిడిపి అండగా నిలచింది. అమరావతిలో ఏర్పాటుచేసిన ఎస్ఆర్ఎం, విట్ లో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఆగిపోయిన అమరావతి పనులు ప్రారంభించి మన ప్రాంతంలోనే నిరుద్యోగ యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.

పాతికేళ్లు పాలించినోళ్లు పట్టించుకోలేదు!
మంగళగిరి నియోజకవర్గాన్ని పాతికేళ్లుగా గెలిచినోళ్లు పట్టించుకోలేదు. ఓడిపోయిన నేను ప్రజల మనస్సు గెలవాలని భావించి సొంతనిధులతో 29 అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టా. గత అయిదేళ్లుగా నేను చేసిన సంక్షేమంలో 10శాతమైనా వారు చేశారా? గుండెలమీద చేయ్యేసి ఆలోచించండి. అబద్దాలు చెప్పడంలో ముఖ్యమంత్రి జగన్ తో పాటు ఆర్కే లాంటి ఆయన సామంతులు మాస్టర్స్ డిగ్రీ చేశారు. వారు చెప్పేమాటలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

మంగళగిరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణంతో పాటు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తా. కృష్ణాయపాలెం నుంచి పెనుమాక వెళ్లే బ్రిడ్జికి కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేదు. ప్రజాప్రభుత్వం వచ్చాక ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపడతా. పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది, అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా చేసే బాధ్యత తీసుకుంటా. నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా లోకేష్ విజ్ఞప్తిచేశారు.

లోకేష్ దృష్టికి కృష్ణాయపాలెం వాసుల సమస్యలు
కృష్ణాయపాలెం వాసులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. మా గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది, దళితుల స్మశాన వాటిక వెళ్లే రోడ్డు, ప్రహరోడ నిర్మించాలి. ఇళ్లుమంజూరు చేయకపోవడంతో వాగులో డేరాలు వేసుకొని నివసించాల్సివస్తోంది, ఇళ్లులేని వారికి ఇళ్లపట్టాలు, ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. జాతీయ రహదారికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలి. పూర్తయిన టిడ్కో ఇళ్లు అప్పగించకపోవడంతో రుణంపై వడ్డీభారం పడుతోంది.

కమ్యూనిటీ హాలు నిర్మాణం చేపట్టాలి. టిడ్కో సముదాయంలో తాగునీటి సమస్య పరిష్కరించాలి. మద్యం ధరలు తగ్గించాలి. లారీలపై గ్రీన్ ట్యాక్స్, పన్నుల భారం తగ్గించాలి. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలతో ఇబ్బందులు పడుతున్నాం. పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని అమలుచేయాలి. గ్రామంలో చదువుకున్న వారికి ఉద్యోగాలు కల్పించాలి. బి.టెక్ వంటి ఉన్నతవిద్యతోపాటు ఇంటర్, డిగ్రీ చదివినవారికి కూడా ఉద్యోగావకాశాలు కల్పించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ.. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. దామాషా ప్రకారం స్మశానాలకు స్థలాలు కేటాయిస్తాం. నిరుపేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడంతో పాటు ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి శాశ్వత పట్టాలిస్తాం. నేషనల్ హైవే సంస్థతో మాట్లాడి రైతుల సమస్యను పరిష్కరిస్తాం. టిడ్కో ఇంటి రుణంపై వడ్డీ భారం తగ్గించేలా చూస్తామని హామీ ఇచ్చారు.

మద్యం ధరలు, షాపులు తగ్గించి మద్యాన్ని నియంత్రిస్తాం. లారీలపై గ్రీన్ ట్యాక్స్ భారం తగ్గిస్తామని, దేశంలోనే తక్కువ పన్నులు ఉండేలా చర్యలు తీసుకుంటాం. పాత ఫీజు రీయింబర్స్ మెంట్ విధానం అమలుచేస్తాం. చదువుకున్న వారికి అర్హతలను బట్టి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE