* మహిళా మంత్రులు అనిత, సంధ్యారాణి కూడా
* వారితో పలువురు మహిళా ఎమ్మెల్యేలు కూడా హస్తినకు పయనం
* పార్లమెంట్ లో మహిళా బిల్లుపై చర్చ తిలకించనున్న మంత్రులు
* మూడ్రోజులు ఢిల్లీలోనే మకాం
* ఈ నెల 18న ప్రధానికి కలిసి ధన్యవాదాలు తెలియజేస్తాం : మంత్రి సవిత
అమరావతి : ఈ నెల 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ లో మహిళా బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. బుధవారం సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్నారు. మంత్రి సవితతో పాటు మహిళా మంత్రులు వంగలపూడి అనిత, సంధ్యరాణి సహా పలువురు మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు.
ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిదగిన విషయం మహిళా బిల్లు ఆమోదమన్నారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పించడం ద్వారా భారత ప్రజాస్వామ్యం మరింత ధృడంగా మారుతుందన్నారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని నరేంద్రమోడి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
మహిళల అభివృద్దితోనే సమాజాభివృద్ధిని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళా బిల్లుతో రాజకీయాల్లో మహిళల పాత్ర పెరిగి, సాధికారతకు బలమైన పునాది పడుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోడికి, కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ బిల్లు ప్రవేశం సందర్భంగా జరిగే చర్చను వీక్షించనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఈ నెల 18న ప్రధానమంత్రి నరేంద్రమోడిని, ఇతర కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి ధన్యవాదాలు తెలియజేయనున్నట్లు తెలిపారు.
మహిళా బిల్లుకు ఏపీలోని సీఎ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తి మద్దతు తెలియజేస్తున్నట్లు తెలిపారు. తనతో పాటు మహిళా మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనిత, కూటమి ప్రభుత్వానికి చెందిన మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఢిల్లీ వెళ్తున్నట్లు మం త్రి సవిత ఆ ప్రకటనలో వెల్లడించారు.