Home » అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం కక్కిస్తాం

అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం కక్కిస్తాం

-తీర ప్రాంతంపై జ‘గన్‌’…
-గేట్‌ వే ఆఫ్‌ జగన్‌గా మార్చి దోపిడీకి కుట్ర

-కేఎస్పీసీఎల్‌ మీద దాడి…షేర్లు ఇవ్వాలని తుపాకీతో బెదిరింపు
-జైళ్లకు పోతారంటూ హెచ్చరికలు… అరబిందో సంస్థకు షేర్ల అమ్మకాలు
-రూ.200 కోట్ల ప్రాఫిట్‌లో ఉన్న కంపెనీ షేర్లు కొట్టేసిన జగన్‌ బినామీలు
-టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి

దోపిడీల జగన్‌ కళ్లు తీరప్రాంతంపై పడ్డాయని.. తీరప్రాంతాన్ని గేట్‌ వే ఆఫ్‌ జగన్‌గా మార్చి దోచుకు నేందుకు తెరలేపారని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి వ్యాఖ్యానించారు. మంగళగి రిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో 974 కిలో మీటర్ల మేర ఉన్న సువిశాలమైన సముద్ర తీరాన్ని రాష్ట్ర అభివృద్ధికి ఉప యోగించి ‘గేట్‌ వే ఆఫ్‌ ఇండియా’గా మార్చడానికి చంద్రబాబు కృషి చేస్తే జే గ్యాంగ్‌ దాన్ని ‘గేట్‌ వే ఆఫ్‌ జగన్‌’గా మార్చారన్నారు.

కేఎస్పీసీఎల్‌ మీద దాడి… షేర్ల కోసం తుపాకీలతో బెదిరింపులు
జగన్‌రెడ్డి దోపిడీక అదుపు లేకుండా పోయిందని ఆనం మండిపడ్డారు. తీర ప్రాంతాల అభివృద్ధిని గాలికి వదిలేసి దోపిడీకి ప్రణాళికలు రచించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు హయాంలో కాకినాడ పోర్టులో విస్తృతంగా అభివృద్ధి జరిగితే జగన్‌ కాకినాడ సీ పోర్టులో షేర్లు కొట్టేసేందుకు కుట్రలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డిని రంగంలోకి దింపి దోపిడీకి ప్రణాళికలు రచిం చారన్నారు. అత్యంత కీలకమైన పోర్టులను విజయసాయిరెడ్డికి.. అప్పగించడం దేశ రహస్యాలను 420ల చేతిలో పేట్టడమే అవుతుందని, ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయమన్నారు. కేఎస్పీ సీఎల్‌లో షేర్లు ఇవ్వాలని తుపాకీలతో బెదిరించారని వివరించారు. విజయసాయిరెడ్డి అల్లుడు శరత్‌ చంద్రారెడ్డికి చెందిన అరబిందో ఇన్‌ఫ్రా షేర్‌ కొనే నాటికి అప్పటి విలువ రూ.220 ఉంది. ఆ షేర్‌ ను ఎంత ప్రీమియం చెల్లించి కొన్నారు. ఏ రూపంలో చెల్లింపులు చెల్లించారో కూడా ఎందుకు బయట పెట్టడం లేదు. ఇప్పుడు ఆ షేర్‌ విలువ రూ.320కు చేరిందని వివరించారు.

జే గ్యాంగ్‌ ఆగడాలతోనే…
ప్రపంచంలో ఎక్కడైనా లాభాల్లో నడిచే కంపెనీనీ తక్కువ మొత్తానికి అమ్ముకోవడం జరగదు కానీ, జే గ్యాంగ్‌ ఆగడాలతో కాకినాడ సీ పోర్ట్స్‌ లాభాల్లో నడుస్తున్న తక్కువ మొత్తానికి షేర్లు అమ్ముకున్నారు. మొత్తం టర్నోవర్‌ 32 శాతం లాభం ఉన్న కంపెనీ కాకినాడ సీ పోర్ట్‌. ఇంత లాభాల్లో నడిచేవి రాష్ట్రంలో ఐదు కంపెనీలు కూడా లేవు. పోర్టు పే, 15 బెర్తులు పూర్తి చేసి మొత్తం నెట్‌ వర్త్‌ విలువ రూ.1780 కోట్లు ఉంది. అయినా పోర్టు యాజమాన్యం తన వాటాను తక్కువ మొత్తానికి అమ్మిందంటే జే గ్యాంగ్‌ బెదిరింపులు అర్థం పడుతున్నాయి. కాకినాడ సీ పోర్టుకు 2020లో రూ.170 కోట్లు 2021లో రూ.205 కోట్లు, 2022లో రూ.241 కోట్లు, 2023లో రూ.240 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ.. వరుసగా టర్నోవర్‌ చూసినట్లు అయితే 2020లో 458.36 కోట్లు, 2021లో 630.51 కోట్లు, 2022లో 640.59 కోట్లు, 2023లో 567.96 కోట్లకు పైగా ఉంది. అటువంటి కంపెనీని ఎవరైనా అమ్ముకుంటారా? అన్ని ప్రశ్నించారు. ఈ పోర్టు కొన్న ఆరో ఇన్‌ఫ్రా అనుభవం ఏంటి? ఈ కంపెనీ జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి అల్లుడు పెనాకా శరత్‌ చం ద్రారెడ్డికి కాదా? ఈ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం వాటాలా బదిలీకి ఏ విధంగా అనుమతి ఇచ్చింది. ఇంతకముందు ఆర్వో ఇన్‌ఫ్రా దేశంలో ఎక్కడైనా పోర్టుల్లో పనిచేసిన అనుభవం లేదు. పోర్టులు నిర్వహించే, నిర్మించే అర్హత లేని సంస్థకు కనీసం పోర్టు గోడలకు రంగు కూడా వేయలేదు. ఆర్వో ఇన్‌ఫ్రా ద్వారా పోర్టులో వాటాలు జగన్‌ రెడ్డికి వస్తాయి కాబట్టే వెంటనే బదిలీకి ఆమోదం తెలిపారు. రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన కాకినాడ సీ పోర్ట్‌ లిమిటెడ్‌లో ఎన్నడూ డైరెక్టర్లలో మార్పులు చేర్పులు జరగలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 10 ఫిబ్రవరి 21న ఒజిలి కోదండరామిరెడ్డి, గర్నెపూడి వెంకట రంగాలను 28 జూన్‌ 2021న శ్రీ చరణ్‌ మంగళపూరు ను, 16 మే 2023న జెట్టి శివరామప్రసాద్‌ను డైరెక్టర్లుగా చేర్చుకున్నారు. వీళ్లంతా ఎవరు? జగన్‌ మోహన్‌ రెడ్డికి వీళ్లతో సంబంధం లేదా? సీ పోర్టు యాజమాన్యం మార్పులు చేర్పులు వెనుక కర్త కర్మ క్రియ తోడు దొంగలు జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డిలేనని ఆరోపించారు.

జైలుకు పోతారంటూ షేర్లు కొట్టేసిన వైనం
జె గ్యాంగ్‌కు కేఎస్పీసీఎల్‌ యాజమాన్యం లొంగలేదన్నారు. లొంగకుంటే ఆడిట్‌ చేయించి 965.65 కోట్లు ఎగ్గొట్టినట్లు తప్పుడు రిపోర్టులు సృష్టించారు. ఆ నగదును ప్రభుత్వానికి కట్టేందుకు కేఎస్పీసీఎల్‌ యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. దాంతో విజయసాయిరెడ్డి పప్పులు ఉడకకా… మరోసారి 1999 నుంచి ఆడిట్‌కు ఆదేశించారని.. మరోవైపు అరబిందో సంస్థకు షేర్లు అమ్మకుంటే కాకినాడ సీ పోర్టు యాజమాన్యంతో పాటు వారి కుటుంబసభ్యులను, పిల్లలను సైతం జైళ్లకు పోతారని చెప్పి బెదిరించారన్నారు. ఒకవైపు విజయసాయిరెడ్డి మరోవైపు ప్రభుత్వం నుంచి వస్తున్న బెదిరింపులు వేధింపులు తట్టుకోలేక కాకినాడ సీ పోర్టు యాజమాన్యం దశాబ్ధాల పాటు శ్రమించి సృష్టించుకున్న వ్యాపార సామ్రాజ్యాన్ని వదులుకోవాల్సి వచ్చింది. వాటాల బదిలీలకు కంపెనీ యాజమాన్యం చేత 5-12-2020న బలవంతంగా లేఖ రాయించుకుని ఐదు రోజుల వ్యవధిలో 10-12-2020న ఆంధ్ర ప్రదేశ్‌ మారిటోరియం బోర్డ్‌ నుంచి అంగీకారం తీసుకుని 24-12-2020న జీవో నెంబర్‌ 17ను ఇచ్చి.. వాటాలు బదిలీ చేయించారు. ఈ జీవో వెనుక సీఎంఓ ఒత్తిళ్లు, జగన్‌రెడ్డి బెదిరింపులు ఉన్నాయి. ఏడాదికి దాదాపు రూ.200 కోట్లకు పైగా ప్రాఫిట్‌లో ఉన్న కంపెనీ షేర్లను తక్కువ మొత్తానికి కొట్టేసి విజయసాయిరెడ్డి గ్యాంగ్‌ కోట్లు దండుకున్నారని వివరించారు.

కట్టాల్సిన రూ.965.65 కోట్లు కాస్తా రూ.9 కోట్లుగా మారిన వైనం
జగన్‌ బినామీలకు కేఎస్సీసీఎస్‌ షేర్‌ అమ్మిన తరువాత జగన్‌ ప్రభుత్వం మరోసారి ఆడిట్‌ చేయించి కట్టాల్సిన రూ.965.65 కోట్లను కాస్త రూ.9 కోట్లుగా మార్చి మాయ చేశారు. ఈ రూ.965 కోట్లలో జగన్‌ రెడ్డి వాటా ఎంత? 24 డిసెంబర్‌, 2020న విజయసాయిరెడ్డి అల్లుడు సంస్థ ఆర్వో ఇన్‌ఫ్రా షేర్లు బదిలీ అయిన తరువాత ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను కూడా ఆపేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రూ.1780 కోట్ల విలువైన పోర్టును అత్యంత తక్కువకు చేజిక్కుంచు కోవడం వెనుక ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగం ఉందని.. టీడీపీ అధికారంలోకి రాగానే వడ్డీతో సహా వసూలు చేస్తామని ఆనం హెచ్చరించారు.

అభివృద్ధి అజెండాతో పనిచేసిన టీడీపీ… అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతిపై చర్యలు
అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా టీడీపీ పాలన సాగిందన్నారు. కాకినాడ పోర్టును విస్తరించిన ఘనత టీడీపీదే అన్నారు. పోర్టు విస్తరణతో వందల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. వందల కోట్లు ఆదాయాన్ని కొల్లగొట్టేందుకు జగన్‌ కుట్రలు చేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్‌ దోపిడీపై విచారణ చేపడతామన్నారు. జగన్‌ దోపిడీని బయటపెట్టి చర్యలు తీసుకుంటా మన్నారు. బినామీలను జైళ్లకు పంపిస్తామన్నారు. వైసీసీ అధికారంలోకి రాకపోతే జగన్‌, విజయసాయి దేశం వదిలి పరారు కావటం ఖాయమన్నారు.

Leave a Reply