Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు సీఎం అయితేనే భవిష్యత్తు

-రాష్ట్రానికి ఈ ఎన్నికలు అత్యంత కీలకం
-అరాచక పాలన నుంచి కాపాడుకుంటాం
-టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం నేతలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఈ ఎన్నికలు అత్యంత కీలకమని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు అని, ఆయనను గెలిపించుకునేందుకు టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం తరపున తమ వంతు కృషి చేస్తామని టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం నేతలు పేర్కొన్నారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో విజన్‌ ఫర్‌ విక్టరీ క్యాంపెయిన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ టీడీపీ అమెరికా అధ్యక్షుడు కోమటి జయరాం మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం మా వంతుగా సహకారం అందిస్తామని తెలిపారు. ఇప్పటికే అన్ని దేశాల నుంచి 2 వేల మంది ఎన్‌ఆర్‌ఐలు రాష్ట్రానికి వచ్చారు. త్వరలో మరో 2 వేల మంది అమెరికా నుంచి వస్తారు. వీళ్లంతా ప్రతి నియోజవర్గంలో సోషల్‌ మీడియా ప్రచారం, కూటమి అభ్యర్థులకు ఆర్థిక సహకారం అందిస్తామని వెల్లడిరచారు. తామంతా నేడు వివిధ దేశాల్లో ఉన్నామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడేనని, వైసీపీ ప్రభుత్వ వైఖరితో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. మళ్లీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.

టీడీపీ ఎన్‌ఆర్‌ఐ నేత వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ మాది రాయలసీమ వెనుకబడిన ప్రాంతం. ఐదేళ్లలో రాయలసీమకు జగన్‌ చేసింది శూన్యం. సీమ అభివృద్ధి కావాలంటే మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి. అందుకే ప్రతిరోజు ఒక నియోజకవర్గానికి వెళ్లి అధికారంలోకి వస్తే మేం ఏం చేస్తామో కూడా చెబుతాం. పార్టీ కోసం పాటుపడే వేలాది మంది ఎన్‌ఆర్‌ఐలకు ఈ కార్యక్రమం వారధిలా ఉపయోగపడుతుంది. జగన్‌ మోసాలను వివరించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి టీడీపీ విజయానికి కృషి చేస్తామని వివరించారు.

సతీష్‌ వేమన మాట్లాడుతూ అమెరికాలో 6 మిలియన్ల ప్రజలు ఉంటే అందులో 2 మిలియన్ల ప్రజలు తెలుగువారు ఉన్నారు. దీనికి కారణం చంద్రబాబే. జగన్‌ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ఎలా నష్టపోయిందో ప్రజలకు వివరిస్తాం. ఈ నెలరోజులు రాత్రింబవళ్లు కష్టపడి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు కృషిచేస్తామని తెలిపారు. చందు గురుపాటి మాట్లాడు తూ చంద్రబాబు విజన్‌కి ప్రతి రూపాలం మేము. ఆయన వల్ల మేం ప్రతిఫలం పొందాం. ఈ నెల రోజులు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేస్తాం. చట్టసభల్లో ఎన్‌ఆర్‌ఐలకు చంద్రబాబు అవకాశం కల్పించారు. అలాంటి నాయకుడికి మేం అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

LEAVE A RESPONSE