Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ ఓ పెద్ద కళంకిత!

– ఓటమి భయంతోనే విపక్షంపై నిందల కుట్రలు
– పాత ప్రతిపాదనలకు కొత్త నిర్వచనాలు చెప్తున్నారు
– జగన్‌ గుట్టు జనానికి తెలిసిపోయింది…
-అర్థరహిత ఆరోపణలను జనం నమ్మేస్థితిలో లేరు
– టిడిపి అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి

తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేయడంలో వైకాపా నేతలు సిద్ధహస్తులు. ఐదేళ్లు అధికారం చెలాయించి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన జగన్‌ అండ్‌ కో.. వైసీపీ ఏలుబడిలో రాష్ట్రం వెలిగిపోతున్నట్టు నమ్మిస్తున్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న వైనాలు, కుంభకోణాలు రోజుకొక్కటిగా బయటపడుతుంటే తట్టుకోలేక `ప్రతిపక్షంపై బుదరజల్లే ప్రయత్నాలకు ఒడిగడుతోంది.

ఎప్పుడో రెండున్నర దశాబ్దాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలోని తెలుగుదేశం పాలనలో క్రీడాభివృద్ధికి రూపొందించిన ఒక ప్రతిపాదనకు మసిపూసి.. అదేదో అంతర్జాతీయ కుంభకోణమన్నట్టు నీలి మీడియాలో ప్రచారానికి దిగడం వైసీపీ చిల్లర చేష్టలకు అద్దం పడుతుంది.

ఉదాత్తమైన ఆ క్రీడా ప్రతిపాదనా సారాంశం వైసీపీ మట్టిబుర్రలకు అర్థంకాకపోవడంతో `కుట్రలు, కుతంత్రాలతో నిండిన వాళ్ల మానసిక స్థితిని విపక్షానికి అంటగట్టే ప్రయత్నం చేయడం విడ్డూరం. ‘20 ఏళ్ల క్రితమే చంద్రబాబు మహా దోపిడీకి పాల్పడ్డారంటూ..’ నీలిమీడియాలో అర్థంపర్థంలేని ఆరోపణలు చేస్తోంది.

జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు, ప్రపంచశ్రేణి స్టేడియంల నిర్మాణ ఉద్దేశంతో రెండున్నర దశాబ్దాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికకు తప్పుడు నిర్వచనాలు, కల్పితాలతో.. చంద్రబాబుకు కళంకం అంటగట్టాలని చూస్తోంది. కోడిగుడ్డుమీద ఈకలు పీకుతూ నీలిమీడియా లేవనెత్తుతున్న అనుమానాలకు ఇవీ సమాధానాలు..

ఆరోపణ: క్రీడా ప్రణాళికపై అడ్రస్‌ లేని కంపెనీతో సంప్రదింపులు జరిపారు..
వాస్తవం: అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్‌ ఇనిస్టిట్యూట్‌ను హైదరాబాద్‌కు తీసుకురావాలన్నదే ఆనాటి ప్రభుత్వ లక్ష్యం. ఐఎంజీ సంస్థను అడ్రస్‌లేని కంపెనీ అని చెప్పడం.. మీ మట్టిబుర్ర తెలివి తేటలు బయటపెట్టుకున్నట్టే. ఐఎంజీ ఒక అంతర్జాతీయ సంస్థ. ప్రపంచస్థాయిలో నిర్వహించే క్రీడా పోటీలకు ఐయంజి ఒక పర్యాయపదం.

దీనికి ప్రపంచవ్యాప్తంగా కార్యాలయాలు, స్పోర్ట్స్‌ అకాడమీలు, విహార కేంద్రాలు ఉన్నాయి. 33 దేశాలలో 85 కార్యాలయాలు సంస్థ పరిధిలో పనిచేస్తున్నాయి. హైదరాబాద్‌లో క్రీడలకు ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనకు 400 ఎకరాలలో విశాలమైన భవన సముదాయాన్ని నిర్మించాలని ఐయంజి భారతీయ సంకల్పించింది. ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన ఆర్థిక వనరులను ఈస్ట్‌ ఈక్విటీ రుణ సదుపాయం ద్వారా సమీకరించనున్నట్టు `రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

దాదాపు రూ.700 కోట్లు పెట్టుబడి పెట్టేందుకూ సంస్థ అంగీకరించింది. పైగా అంత పెద్ద సంస్థకూ భూములను అభివృద్ధిపర్చే హక్కు మాత్రమే కల్పించారు తప్ప, విక్రయించే అధికారం బదలాయించ లేదు. భూములు ధారదత్తమైపోయినట్టు కపట కథనంలో పేర్కొనడం సిగ్గుచేటు. ఇందులో ఏదో ప్రయోజనం ఉందని చేసే ఆరోపణలు.. మీ దురుద్దేశం, కుటిల బుద్ధిని బయటపెట్టేవే.

ఆరోపణ: నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు.
వాస్తవం: నిబంధనల ఉల్లంఘన అన్నది అక్కసుతో చేసిన ఆరోపణ. 2004లో ప్రభుత్వం మారిన తరువాత ప్రాజెక్టులో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ కాంగ్రెస్‌ నేత పాల్వాయి గోవర్థన్‌రెడ్డి ఏసీబీ కోర్టులో కేసు వేశారు.

‘ఈ కేసులో అవినీతి జరిగిందనడానికి ఆధారాలు లేవు. ఇక ఒప్పందం రద్దు మా పరిధిలోకి రాదు’ అంటూ ఏసిబి కోర్టు కేసు డిస్మిస్‌ చేసింది. తరువాత పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి హైకోర్టులో కేసు వేస్తే 2004లో తీర్పు చెప్పి డిస్మిస్‌ చేసింది . ‘ఒలింపిక్‌ స్ధాయి క్రీడా సదుపాయాల కోసం భూమి కేటాయించడంలో పబ్లిక్‌ ఇంటరెస్ట్‌ లేదని చెప్పడం సరికాదు. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టి స్టేడియంలు కట్టవలసిన బాధ్యత ఐఎంజిపై ఉంది. ఈ కేసులో అవినీతి, కుట్ర, మోసం అనేవాటికి ఎలాంటి ఆధారాలు లేవు’’ అని హైకోర్టు విస్పష్టంగా పేర్కొంది.

ఆరోపణ: నాలుగు రోజుల్లో పని కానిచ్చేశారు?
వాస్తవం: పూర్తిగా సత్యదూరం. ఐఎంజీతో 2003 జూలైలో సంప్రదింపులు మొదలయ్యాయి. అందులో భాగంగా ఐఎంజీ ప్రతినిధులు హైదరాబాద్‌లో పర్యటించారు. అప్పటి సీఎస్‌, ప్రభుత్వ ఉన్నతాధికార్లతో పలుదఫాలు చర్చలు జరిపారు. రాష్ట్రానికి ఎంతో మేలు చేకూర్చి, క్రీడా ప్రావీణ్యానికి మెరుగులు దిద్దగల ప్రాజెకుపై అప్పటి సీఎస్‌, న్యాయశాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఉన్నతస్థాయి క్రీడాధికారులు పలుదఫాలు లోతైన చర్చలే జరిపారు. ప్రభుత్వంతో చర్చలు ఫలప్రదం కావడంతో రూ.700 కోట్లమేర పెట్టుబడిపెట్టి క్రీడాభివృద్ధికి అంగీకారం తెలిపింది ఐఎంజి. ఒప్పందంపై 2004 ఫిబ్రవరి 9న ఉత్తర్వులు జారీ అయ్యాయి. నాలుగు రోజుల్లోనే వందల ఎకరాలు ఇచ్చారంటూ నోటికొచ్చిన కూతలు, తప్పుడు ప్రచారాలు చేయడం వైకాపా కుహానా మేధావితనానికి పరాకాష్ట.

ఆరోపణ: తక్కువ ధరకు విలువైన భూములిచ్చేశారు..
వాస్తవం: ఇదొక తెలివి తక్కువ ఆరోపణ. ఐఎంజీ సంస్థకు కేటాయించిన భూమికి అతి సమీపంలోనే అంతర్జాతీయ బిజినెస్‌ స్కూలుకు ఎకరా రూ.25000 వేల ధరతో భూకేటాయింపు జరిగింది. అక్కడే మైక్రోసాఫ్ట్‌ సంస్థకూ ఎకరా రూ.50 వేలు చొప్పున ప్రభుత్వం భూములు మంజూరు చేసింది. అదే రేటుకు ఐఎంజీకి కేటాయించడం తప్పా? నేడు మైక్రోస్టాఫ్‌, బిజినెజ్‌ స్కూల్స్‌ హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఐఎంజీ ప్రాజెక్టు కూడా పూర్తైవుంటే.. అదీ మరొక ఆయిముత్యమై ఉండేది.

ఆరోపణ: అనుభవం లేని సంస్థ ఐఎంజీ..?
వాస్తవం: ప్రపంచ ప్రసిద్ధ క్రీడాకారులు ఆండ్రీ ఆగస్సీ, మోనికా సెలెస్‌, పీట్‌ సంప్రాస్‌, మార్టినా హింగిస్‌, బోరిస్‌ బెకర్‌, విలియం సిస్టర్స్‌, టైగర్‌ వుడ్స్‌ (గోల్ఫ్‌), షూ మేకర్‌ (ఫార్ములా వన్‌ రేసర్‌) .. వంటి క్రీడా దిగ్గజాలు ఐఎంజిలో శిక్షణ పొందిన వారే. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన స్ఫూర్తి కారణంగా భారతదేశమే గర్వపడే రీతిలో ప్రపంచశ్రేణి క్రీడాకారులు /క్రీడాకారిణులు ఆంధ్రప్రదేశ్‌ నుంచి తయారయ్యారు. ఈనాటి కోనేరు హంపి, సానియా మీర్జా, పుల్లెల గోపీచంద్‌, కరణం మల్లీశ్వరి వంటి వారు మన రాష్ట్రానికి, దేశానికి వన్నె తెచ్చారు. అంతటి ఘనతనూ నీలి మీడియా వక్రీకరించడం సిగ్గుచేటు.

ప్రభుత్వానికి ఆదాయ వనరులు ఎలా లభిస్తాయి?
మన దేశంలో క్రీడాభివృద్ధికి స్టేడియంలు వంటి సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తుంటాయి. ఈ క్రీడా ప్రాంగణాలలో అంతర్జాతీయస్థాయి క్రీడా పోటీలు నిర్వహించాలంటే ఆమేరకు నిర్వహణ, ప్రపంచస్థాయి సౌకర్యాల కల్పన చేయవలసి ఉంటుంది. దీనివల్ల క్రీడా కార్యకలాపాలను వాణిజ్య ప్రయోజనపరంగా నిర్వహించే సౌలభ్యం కలుగుతుంది.

ఈరకంగా వచ్చే ఆదాయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక క్రీడాకారులను ప్రోత్సహించి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణా సౌకర్యం కల్పించే అవకాశం కలుగుతుంది. ఐయంజి భారతీయ ప్రతి 2 నెలలకోసారి అంతర్జాతీయ క్రీడా పోటీలను నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తపరిచింది. అలా లభించే ఆదాయంలో వాటా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికీ లభిస్తుంది. ప్రాజెక్టుకు సంబంధించిన కనీసంగా రూ.700 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. సర్వీసు సెక్టార్‌లో భారతదేశంలోనే ఇది ఎక్కువ పెట్టుబడి. ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్రానికి చెందిన వేలాదిమంది యువకులకు ఉపాధి అవకాశం కలిగేదే.

ఆరోపణ: అమరావతిలోనూ బోగస్‌ కంపెనీలకు భూములు కట్టబెట్టారు..
వాస్తవం: రాజధాని అమరావతిపై మీ పగ చల్లారినట్టు లేదు. రైతుల త్యాగాలను కించపర్చేలా.. దుర్మార్గపు ఆరోపణలు తప్ప ఇంకేం చేయగలరు? రూపాయి పెట్టుబడి పెట్టకుండా, ప్రభుత్వంపై నమ్మకంతో త్యాగాలకు సిద్ధమై రైతాంగం లైనులో నిలబడి భూములు అప్పగించిన విషయం మీకు తెలీంది కాదు. అద్భుతమైన రూపకల్పనపై బురదచల్లడం `రాజధాని అమరావతిపై మీ పగలో భాగమే.

ఆరోపణ: జగన్‌ అధికారంలోకి రాకపోతే చంద్రబాబు రాష్ట్రాన్ని అమ్మేసేవారు..
వాస్తవం: ఎవరు అమ్మేసుకున్నారో ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజానీకం చూస్తూనే ఉంది. రాజధానిని మూడు ముక్కలు చేసి.. ప్రతి ముక్కలోని భూములనూ దిగమింగిన ఘనత వైసీపీది. మాట తప్పను, మడప తిప్పనంటూనే.. రాష్ట్రం గొంతు మెలితిప్పిన మీరు.. రాష్ట్రాభివృద్ధికి అహరహం శ్రమించే చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తారా?

LEAVE A RESPONSE