మరో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం

-పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
-అబుదాబీకి చెందిన తబ్రీవ్ ఏసియా పరిశ్రమతో ఎంవోయూ
-వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు, శీతల గిడ్డంగులు (కోల్డ్ స్టోరేజ్ లు), వాతావరణ -ఉష్ణోగ్రతలను తగ్గించే టెక్నాలజీ రంగాలలో రెండు ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం
-అబుదాబిలోని డీపీ వరల్డ్ పరిశ్రమ, జెబెలి అలీ పోర్టులను సందర్శించిన మంత్రి మేకపాటి
-కొనరస్ కంపెనీని విజిట్ చేసిన పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి నేతృత్వంలోని బృందం
-అబుదాబీలోని భారత రాయబార కార్యాలయంలో పెట్టుబడుల రోడ్ షో

దుబాయ్, ఫిబ్రవరి, 16 : వరుస ఎంవోయూలతో పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి నేతృత్వంలోని పరిశ్రమల శాఖ బృందం దుబయ్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే రూ.3వేలకు కోట్లకు పైగా పెట్టుబడులతో మూడు ఎంవోయూలు కుదుర్చుకుంది. తాజాగా మంగళవారం అబుదాబీకి చెందిన తబ్రీవ్ ఏసియా పరిశ్రమతో మరో కీలక ఒప్పందానికి శ్రీకారం చుట్టింది. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు, గోడౌన్ల నిర్మాణం(గిడ్డంగులు), వాతావరణ ఉష్ణోగ్రతలను తగ్గించే టెక్నాలజీ రంగాలలో కలిసి పనిచేసేందుకు రెండు ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ప్రభుత్వ సలహాదారు జుల్ఫీ సమక్షంలో ఏపీఈడీబీ సీఈవో సుబ్రహ్మణ్యం జవ్వాది, తబ్రీద్ ఏసియా సీడీవో(చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్) ఫ్రాన్ కో-యిస్ జావియర్ బాల్ లు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.

పోర్టు ఆధారిత డీపీ వరల్డ్ పరిశ్రమ, జెబెలి అలీ పోర్టుల విజిట్
పోర్టు ఆధారిత డీపీ వరల్డ్ పరిశ్రమ, జెబెలి అలీ పోర్టులను మంత్రి గౌతమ్ రెడ్డి నేతృత్వంలోని బృందం సందర్శించింది. డీపీ వరల్డ్ పరిశ్రమ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో పర్యటించారు. అన్ని రకాల ఎగుమతులకు సంబంధించిన ప్రఖ్యాత కంపెనీలు జెబెలి అలీ పోర్టు ప్రత్యేకతలను మంత్రి మేకపాటి అడిగి తెలుసుకున్నారు. 10 లక్షల కార్లను స్టోరేజ్ చేసే సామర్థ్యం ఉన్న పోర్టు ఎగుమతులని, ఎలక్ట్రిక్, లాజిస్టిక్ , మానుఫాక్చరింగ్, షుగర్ ఫ్యాక్టరీ యూనిట్లను ఆసక్తిగా పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా పోర్టు ఆధారిత అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు డీపీ వరల్డ్ ఆసక్తి కనబరిచింది. జెబెలి అలీ పోర్టులో కార్యకలాపాలను పరిశీలించే విధంగా 40వేల సీసీ కెమెరాలున్నట్లు మంత్రికి డీపీవరల్డ్ మేనేజర్ అహ్మద్ వివరించారు. మల్టీ పార్కింగ్ స్టోరేజ్ సహా అలీ పోర్టులో అనేక ప్రత్యేకతలని, ఆంధ్రప్రదేశ్ లో పోర్టుల నిర్వహణకు ఏ విధంగా వినియోగించుకోవచ్చనే కోణంలో పోర్టు పర్యటన సాగింది. అనంతరం డీపీ వరల్డ్ పరిశ్రమకు సంబంధించిన యాజమాన్యంతో మంత్రి మేకపాటి భేటీ అయ్యారు. ఏపీలో మౌలిక వసతుల గురించి డీపీ వరల్డ్ ప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు. ఆ ముందు రోజు మంత్రి మేకపాటి తో తాజ్ బే హోటల్ లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తో సమావేశం సందర్భంగా ఆ సంస్థ సీఈఓ యువరాజ్ నారాయణ్ తో చర్చించిన అంశాలకు సంబంధించి చర్చల కొనసాగాయి. అనంతరం అబుదాబీలోని ఉక్కు రంగానికి చెందిన కొనరస్ కంపెనీని మంత్రి విజిట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కడపజిల్లాలో ఏర్పాటు చేస్తోన్న స్టీల్ ప్లాంట్ గురించి మంత్రి కొనరస్ ప్రతినిధులకు వివరించారు. గ్యాస్ సహా ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై ప్రధానంగా చర్చించారు.

అబుదాబీ గ్లోబల్ మార్కెట్ కార్యాలయంలో మంత్రి మేకపాటి చర్చలు
అబుదాబీలోని ఏఐ మార్యా ఐల్యాండ్ లో ఉన్న అబుదాబీ గ్లోబల్ మార్కెట్.ఫినాన్సియల్ మార్కెట్, వాణిజ్య, ఎగుమతుల్లో దిట్ట. ఆర్థిక పురోగతి సాధించేందుకు అవసరమైన నిధులు, నాలెడ్జ్ హబ్ సామర్థ్యాన్ని పెంచే దిశగా కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఏజీడీఎం పేర్కొంది. ఇంక్యుబేషన్ సెంటర్లు సహా వెబినార్, రోడ్ షోల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ కు సహకరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. యూఏఈ కంపెనీలతో అనుసంధానమైన ఏడీజీఎం పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను ఏపీకి తీసుకురావడంలోనూ కీలక పాత్ర పోషించేందుకు సూచనప్రాయంగా అంగీకారం తెలిపింది. అంతకు ముందు ‌కొనరస్ స్టీల్ కంపెనీ సీఈఓ భరత్ భాటియాతో మంత్రి మేకపాటి నేతృత్వంలోని బృందం సమావేశమైంది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యజమాని కూడా అయిన భాటీయా స్టీల్ ఉత్పత్తుల తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో గల అవకాశాలపై కరొనస్ స్టీల్ కార్యాలయంలో మంత్రి గౌతమ్ రెడ్డితో ప్రధానంగా చర్చించారు.

అబుదాబీలోని భారత రాయబార కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రోడ్ షో
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఏ విధంగా సానుకూలమో ఎలా ప్రచారం, మార్కెటింగ్ చేయాలనే అంశాలపై మంత్రి మేకపాటి అబుదాబీలో రోడ్ షో నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు ఎలాంటి విధానాలు అవలంభిస్తుందో మంత్రి మేకపాటి వెల్లడించారు. అబుదాబీలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ ను కలిశారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సాగుతున్న దుబాయ్ పర్యటన వెనుక గల ఎంబసీ సహకారంపై మంత్రి మేకపాటి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో గల అవకాశాల గురించి పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అబుదాబీలోని ఇండియా ఎంబసీలో ఆయన ప్రసంగించారు. అనంతరం ఏపీలో ఏఏ రంగాలలో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయో కూలంకషంగా ఏపీఈడీబీ సీఈవో ప్రజంటేషన్ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, మిడిల్ ఈస్ట్ అండ్ ఫార్ ఈస్ట్ ప్రత్యేక ప్రతినిధి జుల్ఫీ రావ్జీ, ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఐఐసీ ఎండి సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీ మారిటైమ్ డిప్యూటీ సీఈవో రవి, కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఏపీఐఐసీ ఈడీ సుదర్శన్ బాబు, పరిశ్రమల శాఖ,ఏపీఈడీబీ, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply