Suryaa.co.in

Andhra Pradesh

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియకు మరో వారం రోజుల గడువు

• జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తి మేరకు వివిధ కారణాలతో ఇళ్లస్థలాలకు దరఖాస్తు చేసుకోని అర్హులైన జర్నలిస్టులకు మరో అవకాశం
• నేటి నుండి 26 ఫిబ్రవరి, 2024 వరకు దరఖాస్తుల స్వీకరణ
• నిర్ణీత గడువులోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని జర్నలిస్టులకు సూచన
– సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి

వివిధ కారణాలతో ఇళ్లస్థలాలకు దరఖాస్తు చేసుకోని అర్హులైన జర్నలిస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు మరో వారం రోజుల గడువు కేటాయిస్తున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటి (19 ఫిబ్రవరి, 2024) నుండి 26 ఫిబ్రవరి, 2024 (సోమవారం) వరకు అర్హులైన జర్నలిస్టుల నుండి వెబ్ సైట్ లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇప్పటికే 6 జనవరి, 2024 వరకు అంటే నిర్ణీత గడువులోగా ఆన్ లైన్ లో తమ వివరాలను నమోదు చేసుకోని వారికి మరియు నమోదు చేసుకున్నప్పటికీ సబ్మిట్ కొట్టని వారికి ఆయా జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రంలో వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తూ అక్రిడిటేషన్ కార్డు కలిగిన అర్హులైన జర్నలిస్టులకు హౌసింగ్ స్కీమ్ క్రింద ఇంటి స్థలాలను అందించేందుకు ఇప్పటికే ప్రభుత్వం జీవో నంబర్ 535ను జారీ చేసిందని గుర్తుచేశారు. సంబంధిత జీవోలో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోని అర్హులైన జర్నలిస్టులు ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోయి ఉంటే వారంతా www.ipr.ap.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 26 ఫిబ్రవరి, 2024 వరకు నిర్ణీత గడువులోగా తమ వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. తద్వారా ప్రభుత్వం అందించే ఇళ్ల స్థలాలను ప్రతి ఒక్క జర్నలిస్టు పొందాలని తెలిపారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకునే జర్నలిస్టుల దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

అర్హులైన జర్నలిస్టులందరికీ సంతృప్తస్థాయిలో ఇళ్ల స్థలం కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

LEAVE A RESPONSE