Suryaa.co.in

Andhra Pradesh

మళ్ళీ రంగులు…హైకోర్టు తీవ్ర ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొన్ని సంచలన ఆదేశాలు జారీ చేసింది. మరో తీర్పులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో చెత్త నుంచి సంపద తాయారు చేసే కేంద్రాలకు వైసీపీ రంగులు వేస్తున్నారు. దీంతో ఈ అంశం పై, హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అనుప్ కుమార్ గోస్వామి, జస్టిస్ జయసూర్య నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ పిటీషన్ విచారణకు వచ్చింది.
కృష్ణా జిల్లాలో చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలకు, వైసీపీ రంగులు వేస్తున్నారు అంటూ, జైభీమ్ యాక్సిస్ జస్టిస్ సంస్థ, కృష్ణా జిల్లా అధ్యక్షుడు సురేశ్ కుమార్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఈ రోజు హైకోర్టు ముందుకు విచారణకు వచ్చింది. ప్రభుత్వం డబ్బులతో ఏర్పాటు చేసిన ఈ భవనాలకు పార్టీ రంగులు వేయటం పట్ల, తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పిటీషనర్ తరుపు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ వాదనలతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించటమే కాకుండా, ఇటువంటి రంగులు వేయవద్దు అంటూ గతంలో హైకోర్టుతో పాటుగా, సుప్రీం కోర్టు కూడా ఇచ్చిన తీర్పులను కూడా ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం గుర్తు చేస్తూ, ప్రభుత్వ తీరుని ప్రశ్నిస్తూ, హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అదే విధంగా, కొన్ని సంచలన ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ విధంగా రంగులు వేసినందుకు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శితో పాటుగా, స్వచ్చాంధ్ర కార్పోరేషన్ మ్యనేజింగ్ డైరెక్టర్ కూడా, 16వ తేదీన వ్యక్తిగతంగా కోర్టు ముందుకు హాజరు కావాలని చెప్పి, కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ జోక్యం చేసుకుని, తాము వ్యక్తిగతంగా దీని పై వివరాలు తీసుకుని, సవివరంగా అఫిడవిట్ దాఖలు చేస్తామని, ఇరువురిని కోర్టుకు పిలవద్దు అని చెప్పినా కూడా హైకోర్టు ధర్మాసనం, ఆయన విజ్ఞప్తని ఖాతరు చేయలేదు.
ఇద్దరు అధికారులు తమ ముందు హాజరు కావాల్సిందే అంటూ ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పులు ఉన్నా కూడా, ఇది అతి పెద్ద చర్చకు దారి తీసిన అంశం అయినా కూడా, మళ్ళీ ఈ విధంగా ఎందుకు పార్టీ రంగులు వేసుకుంటున్నారు అనేది, వారి నుంచి తాము వివరణ కోరతామని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.మొత్తానికి ప్రభుత్వ అధికారులకు, కోర్టుల ఆదేశాలు అంటే లెక్క లేదా అనే అభిప్రాయం, ఈ సంఘటనతో మరోసారి కలుగుతుంది.

LEAVE A RESPONSE