లోకేష్…శవ రాజకీయాలు మానుకో

– నరసరావుపేట పర్యటన దేనికోసం?
– మీ హయాంలో మహిళలపై అఘాయిత్యాలు జరిగితే పంచాయితీలు చేసింది నిజం కాదా?
– మీ రాజకీయం కోసం బాధితులను రోడ్ల మీదకు తెస్తారా..?
– ఇంతవేగంగా బాధితులకు న్యాయం చేసిన ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదు.
– నరసరావుపేట వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఏమన్నారంటే..
నారా లోకేష్ నరసరావుపేటకు ఎందుకోసం వస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న నరసరావుపేటలో శవ రాజకీయాలు చేయటానికి వస్తున్నారా.. లేక మీ రాజకీయ లబ్ది కోసమా..?లోకేష్ కు మహిళల పట్ల అంత గౌరవమే ఉంటే.. టీడీపీ హయాంలో ఒక రిషితేశ్వరి, తహసీల్దార్ వనజాక్షి, పెందుర్తి-జెర్రిపోతులపాలెంలో దుర్గమ్మ.. ఇలా ఎంతో మంది మహిళలు, యువతుల ఘటనల్లో మీరు ఏం న్యాయం చేశారు?. ఆనాడు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న మీ నాన్న పంచాయితీలు చేశారు తప్పితే.. ఏ ఒక్కరికీ న్యాయం చేయలేదు. మీ హయాంలో మహిళలపై జరిగిన నేరాలు-ఘోరాలకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పిన తర్వాతే నరసరావుపేటలో అడుగు పెట్టాలి.
గుంటూరులో రమ్య హత్యకు గురైతే… ఆ రోజు శవాన్ని అడ్డుపెట్టుకుని ఎంతగా నీచ రాజకీయాలు చేశారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. ప్రభుత్వాసుపత్రి నుంచి మృతదేహాన్ని తరలిస్తుంటే అడ్డుపడి, తెలుగుదేశం పార్టీ చేసిన రచ్చ అతి నీచమైనది.
నరసరావుపేటలో అనూష ఘటనలో మా ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. బాధిత కుటుంబీకులకు ప్రభుత్వం రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అనివిధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అదే తెలుగుదేశం పార్టీ హయంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. కానీ, ఏ ఒక్కరికైనా సాయం చేశారా..?
– దేశంలో మరెక్కడా సంఘటన జరిగిన వెంటనే ఇంత త్వరగా స్పందించిన ప్రభుత్వం మరొకటి లేదు.
టీడీపీ హయాంలో రిషితేశ్వరి చనిపోతే.. ఏ విధమైన న్యాయం అందలేదు. రిషితేశ్వరి, వైద్య విద్యార్థిని సంధ్యారాణి హత్య కేసులలో అప్పుడు ఇదే లోకేష్ ఎందుకు స్పందించలేదు?.
ఆనాడు రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో డైరీలో క్షుణ్ణంగా కారణాలు రాసింది, ప్రిన్సిపాల్ బాబురావుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. అప్పుడు ఏం చేసింది టీడీపీ ప్రభుత్వం?. నాడు ఒక్క రూపాయి అయినా ఎక్స్ గ్రేషియా ఇచ్చారా?. అలానే గుంటూరులో వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో సైకో ప్రొఫెసర్ పై బహిరంగ ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో మీరు ఏ విదంగా శిక్షించారు.?
కేవలం శవ రాజకీయాల కోసం టీడీపీ అమాయక ప్రజల మాన, మర్యాదలను మంట కలుపుతుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ పేరుతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులే అరాచకలు చేస్తుంటే.. మీరు ఏం చేశారు..?దిశ చట్టం పై రాష్ట్ర ప్రభుత్వనికి పూర్తి నిబద్ధత, చిత్తశుద్ధి ఉంది. కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం మేము ఎదురు చూస్తున్నాం, దిశ చట్టం అయితే.. దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. దిశ స్ఫూర్తితో దిశ పోలీస్ స్టేషన్లు, యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం. మీలా చేతులు ముడుచుకుని కూర్చోలేదు. దిశ చట్టం ఆమోదించాలని.. మీరు కూడా కేంద్రాన్ని అడగండి. ఎందుకు అడగటం లేదు. అంటే మహిళలపై మీకు ఉన్న చిత్తశుద్ధి ఇదేనా.. ?
ఆదుకోవాల్సిన కుటుంబాలను ఈరోజు టీడీపీ రోడ్డుపైకి తీసుకొని వస్తున్నారు. మీ రాజకీయ లబ్ధి కోసం బాధితులను అడ్డం పెట్టుకుని ప్రజలను మభ్యపెడితే.. సహించేది లేదు.నరసరావుపేట తెలుగుదేశం పార్టీలో మూడు గ్రూప్ లు ఉన్నాయి. ఇన్ని గ్రూపుల మధ్య టీడీపీ పార్టీ ఉందో లేదో కూడా ప్రజలకు అర్ధం కావట్లేదు. ఈ పరిస్థితుల్లో మీ పార్టీ మనుగడ, గుర్తింపు కోసం నరసరావుపేట పర్యటన కు వస్తున్నావా లోకేష్?. మీ రాజకీయ మనుగడ కోసం నరసరావుపేట లో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని పాడు చేస్తామని అంటే చూస్తూ ఊరుకోము.

Leave a Reply