Suryaa.co.in

Telangana

అడవులు లేవని వాదిస్తే అక్కడే జైలు కట్టి అధికారులను పెట్టాల్సి ఉంటుంది

– చెట్ల నరికివేతపై రేవంత్‌ సర్కార్‌పై సుప్రీం ఆగ్రహం 
-2400 ఎకరాల్లో ఒక్క చెట్టు కూడా కొట్టకుండా ఆదేశాలివ్వాల్సి వస్తుంది
-మూడు రోజుల్లో చెట్లు కొట్టాల్సిన తొందర ఎందుకొచ్చిం ది ?
-చెట్లు కొట్టేసే ముందు అనుమతి ఉందా లేదా?
– పునరుద్ధరణ ఎలా చేస్తారు? ఎంతకాలంలో చేస్తారు?
-నాలుగు వారాల్లో ప్రణాళిక ఫైల్‌ చేయాలి
-సీఎస్‌ ను కాపాడాలని అనుకుంటే.. వంద ఎకరాలను ఎలా పునరుద్ధిస్తారో చెప్పా లి

ఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం రేవంత్‌రెడ్డి సర్కారుకు తలంటుపోసింది. చెట్ల నరికివేతకు అనుమతులు ఉన్నాయా? లేవా? అని ప్రభుత్వ న్యాయవాదిని పదే పదే నిలదీసింది. కొట్టేసిన వంద ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారు? ఎప్పుడు పునరుద్ధరిస్తారని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. ‘కంచ గచ్చిబౌలిలో అడవులు లేవని వాదిస్తే అక్కడే జైలు కట్టించి అధికారులను అందులో పెట్టించాల్సి ఉంటుంద’ంటూ ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. ఒక కేసు విచారణలో సుప్రీంకోర్టు ఈ విధంగా ఒక ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించడం ఇదే తొలిసారి. తాజా పరిణామాలు రేవంత్‌రెడ్డి సర్కారుకు శరాఘాతమే.

కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చెట్ల నరికివేతపై రేవంత్‌ సర్కార్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారో లేదో స్పష్టంగా చెప్పాలని జస్టిస్‌ బీఆర్‌ గవాయి నిలదీశారు. సీఎస్‌ను కాపాడాలని అనుకుంటే.. వంద ఎకరాలను ఎలా పునరుద్ధిస్తారో చెప్పాలన్నారు. దీనిపై నాలుగు వారాల్లో ప్రణాళిక సిద్ధం చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకు స్టేటస్‌ కోను విధించారు. కంచ గచ్చిబౌలి భూముల అంశంపై జస్టిస్‌ బీఆర్‌ గవాయి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా చెట్లు కొట్టివేసే ముందు అనుమతులు తీసుకున్నారో లేదో స్పష్టంగా చెప్పాలని జస్టిస్‌ బీఆర్‌ గవాయి ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వ తరఫున లాయర్‌ స్పందిస్తూ.. జామాయిల్‌ తరహా చెట్లు, పొదలను అనుమతి తీసుకునే తొలగించామని తెలిపారు. అందుకు.. చెట్ల నరికివేతపై సమర్థించుకోవద్దని జస్టిస్‌ బీఆర్‌ గవాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలన్నారు. వారంతపు సెలవుల్లో మూడు రోజుల్లో చెట్లు కొట్టాల్సిన తొందర ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. మీరు చెట్లు కొట్టడం వల్ల అక్కడ జంతువుల మీద కుక్కలు దాడి చేస్తున్నాయని.. ఆ వీడియోలను చూసి ఆందోళనకు గురయ్యామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అవసరమైతే 2400 ఎకరాల్లో ఒక్క చెట్టు కూడా కొట్టకుండా ఆదేశాలివ్వాల్సి వస్తుందని తెలిపారు.

సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఊరుకోమని జస్టిస్‌ గవాయి హెచ్చరించారు. భూముల మార్టిగేజ్‌తో తమకు సంబంధం లేదని.. చెట్ల నరికివేత గురించే తాము మాట్లాడుతున్నామని చెప్పారు. కంచ గచ్చిబౌలిలో అడవులు లేవని వాదిస్తే.. అదే ప్రాంతంలో జైలు కట్టి అందులోనే అధికారులను పెట్టాల్సి ఉంటుందని జస్టిస్‌ బీఆర్‌ గవాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్లు కొట్టేసే ముందు అనుమతి ఉందా లేదా అన్నదే ముఖ్యమని తెలిపారు.

అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్‌ సహా అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. సీఎస్‌ను కాపాడాలనుకుంటే.. వంద ఎకరాలను ఎలా పునరుద్ధిస్తారో చెప్పాలన్నారు. పునరుద్ధరణ ఎలా చేస్తారు? ఎంతకాలంలో చేస్తారు? జంతు జాలాన్ని ఎలా సంరక్షిస్తారో స్పష్టంగా చెప్పాలని ఆదేశించారు. దీనిపై నాలుగు వారాల్లో ప్రణాళిక ఫైల్‌ చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేశారు. అప్పటివరకు స్టేటస్‌ కో విధించారు.

LEAVE A RESPONSE