మనం కాదా.. దొంగలం?

కొడుకు యూఎస్ లో ఉంటాడు,
కూతురు ఆస్ట్రేలియాలో ఉంటది,
నెలకు 50 వేలొచ్చే ఉద్యోగముంటది,
నెలకు 60 వేల రెంటొచ్చే అపార్టుమెంట్లు
ఓ రెండుంటాయి.
అయినా …
సర్పంచ్ మనోడేనని తెల్లకార్డు తీసుకుంటిమి,
రేషన్ సరుకులు నెలనెలా టంచన్ గా తీసుకోబడితిమి,
ఆ రేషన్ బియ్యం పదికి కిలో బ్లాక్ లో అమ్ముకోబడితిమి,
MLA తెలిసినోడేనని గవర్నమెంట్ ఇల్లు కూడా రాయించుకుంటిమి,
ఆరోగ్య శ్రీ కార్డు మీద ఆపరేషన్ లు చేయించుకోబడితిమి,
ఇంకా సాలదన్నట్టు ఓ గవర్నమెంట్ స్థలం కూడా రాయించుకోబడితిమి
ఇక ….
నీరవ్ మోడీ ముచ్చట టీవీలో వినబడగానే…..
శివమెత్తి ఊగిపోతూ లుంగీ చేతపట్టి వీళ్లంతా దొంగలండి అంటూ ముచ్చట చెప్పబడితిమి.
పక్కింటి వెంకట్రావ్ కొడుకు కొండలరావు మునిసిపల్ ఆపీసులో పనిచేసి వంద కోట్లు ఆస్తులు కూడబెట్టింది తెలుసు..
ఇంటెనుక ప్రసాద్ టీచర్ గా ఏ రోజు బడికెళ్ళకుండా చిట్టీల వ్యాపారం పెట్టుకుని బిల్డింగుల మీద బిల్డింగ్లు కట్టుకున్నది తెలుసు…..
మూల మీద ఏశన్న కరెంట్ ఆపీసులో పనిచేస్తూ 50 కోట్లు ఎనుకేసుకున్నదీ తెలుసు …..
మేనల్లుడు కుమార్ బ్యాంకులో పనిచేస్తూ దొంగలోన్లిప్పిచ్చి కమిషన్లతో లెక్కలేనన్ని ప్లాట్లు సంపాదించింది తెలుసు…….
సందు దొరికితే చాలు ఎనకముందు చూడకుండా నొక్కెయ్యడం.. ఎం ఎరగనట్టు గురువింద గింజలా సుద్దులు చెప్పటం ప్రతోడికి కామన్ అయిపోయింది బాబాయ్…
అవినీతి నీ ఇంట్లో నా ఇంట్లో పక్కింట్లో ఏరులై పారుతూనే ఉంది..
ఎదుటోడికి కనపడకుండా తుడుచుకుని కొందరు ..
చూస్తే చూసార్లే ఎం చేస్తారని ఇంకొందరు…
ఆ మనకేడుందిరా నీతి అని ముడ్డికంటిదాన్ని మూతికి తుడుసుకుని ఇంకొందరు..
ఇలా భూమిపై అడుగంటి పోయింది నీటిచుక్కొక్కటే కాదు నీతి నిజాయితీలు కూడా బాబాయ్…
బ్యాంకు కుంభకోణమైనా …
బంతాట కుంభకోణమైనా…..
గడ్డి మోపుల కుంభకోణమైనా….
పెన్నుల కంపిని అవినీతైనా ….
నువ్వో నేనో వాడో వీడో చెయ్యందిస్తేనే అయింది……
పైనున్న దేవుడు నిజం చెబితే
పై నుండి కింది దాకా మనవే పేర్లుంటాయి..
మొన్న ఒక మిత్రుడు ఓ పేద్ద లెక్కేశాడు
విజయ్ మాల్యా + నీరవ్ మోడీ
చేసిన మోసం /120 కోట్లమంది= 185 రూపాయలని, ఇది కచ్చితంగా తప్పే. నియమాలను కఠినం చెయ్యాల్సిందే తప్పులను అరికట్టాల్సిందే.
ఇపుడు నేనో లెక్క చెప్తాను…
ఒక ఇంట్లోంచి ఒక సంవత్సరానికి 1000 రూపాయల అవినీతి జరిగితే
1000 రూపాయలు X 125 కోట్ల జనాభా = ఎన్ని వేల కోట్లు మరి దీనిని ఆపటం ఎలా..?
ముందు మారాల్సింది మనం, వందకో, 500 వందలకో, అమ్ముడుపోయి ఓటేసి, తీరా చాతగాని దద్దమ్మగాన్ని కోట్లకు కోట్లు మాయం చేసే లుచ్చగాన్ని గెలిపిస్తే, వాడు తిరిగి నీకే ఎసరు పెట్టి, నీ అవసరాన్నే అవినీతికి అడ్డాగా మార్చుకుని ఇలా నీరవ్ , మాల్యా , లలిత్ లను మించిపోక మానడు ..
అసలు అవినీతి నీ ఇంట్లో పెట్టుకుని నీతులు చెప్పడం ఆపనంత వరకు ఈ దేశం కుంభకోణాలకు పుట్టినిల్లే, అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికీ అభివృద్ది చెందుతున్న భారతమే. ..

Leave a Reply