Suryaa.co.in

Andhra Pradesh

బ్రాహ్మణులంటే టీడీపీకి ఎందుకంత కక్ష?

– బాబు బ్రాహ్మణద్వేషి
– బ్రాహ్మణ సామాజికవర్గంపై ప్రభుత్వ దాష్టీకం
పీఎస్ఆర్ ఆంజనేయులుపై కక్ష
– ఐవైఆర్ కృష్ణారావును బాబు తొలగించారు
– శారదా పీఠంపై ఎందుకంత కక్ష?
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు

చంద్ర బాబు బ్రాహ్మణద్వేషి. బ్రాహ్మణులంటే టీడీపీకి ఎందుకంత కక్ష? చంద్రబాబు హయాంలో టీటీడీ ఈఓ, జేఈఒలుగా ఎప్పుడూ బ్రాహ్మణ అధికారులను నియమించలేదు. బాబు సీఎం-పార్టీ అధ్యక్షుడయిన తర్వాత చట్టసభల్లో ఒక్క బ్రాహ్మణుడికి కూడా ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీ బీ ఫారంపై సంతకం చేయలేదు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ సామాజికవర్గంపై దాష్టీకాలు అధికమయ్యాయని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. అటు అధికారుల నుంచి ఇటు అర్చక, పురోహితుల వరకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు.

కూటమి ప్రభుత్వం రాగానే సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై కక్ష పూరితంగా వ్యవహరించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గతంలో ఇచ్చిన ఫిర్యాదులో పీఎస్ఆర్ ఆంజనేయులును ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు.

అసలు ఆయనకు సీఐడీతో సంబంధం లేదని.. ఆ సమయంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా కూడా లేరన్నారు. అయినా సరే పీఎస్ఆర్ ను ఆ కేసులో నిందితుడిగా చేర్చటం విస్మయాన్ని కలిగిస్తోందన్నారు. కావాలనే రాజకీయ కక్ష సాధింపులతో కుట్రపూరితంగా వ్యవహరిస్తూ.. ఆయన సంధ్య వందనం చేసుకోవటానికి కూడా సామాన్లు అందించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.

ఐవైఆర్ పై కక్ష సాధింపులు
గత టీడీపీ ప్రభుత్వంలోనూ బాగా పనిచేసిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఆత్మగౌరవంపైనా.. అప్పటి ప్రభుత్వం దాడి చేసిందని మల్లాది విష్ణు గుర్తు చేశారు. ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్‌ కృష్ణారావును ఏ విధంగా అవమానపర్చారో చూశామన్నారు. అవశేష ఆంధ్రప్రదేశ్‌ కు ఆయన మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారని.. పదవీ విరమణ తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌ గా ఉచితంగా పనిచేసేందుకు ముందుకొచ్చారని చెప్పారు.

కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించారనే నెపంతో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ నుండి ఐవైఆర్ కృష్ణారావును బాబు తొలగించారని ఆరోపించారు. అమరావతి నిర్మాణంతో సహా ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న కొన్ని నిర్ణయాలను సైతం తప్పుబడుతూ మీడియా ముందుకొచ్చిన ఆయనను.. అప్పటి టీడీపీ ప్రభుత్వం నానా ఇబ్బందులకు గురి చేసిందన్నారు.

శారదా పీఠంపై ఎందుకంత కక్ష?
విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం కొత్తవలసలో శారదా పీఠంకి గత వైసీపీ సర్కార్ కేటాయించిన 15 ఎకరాలను.. కూటమి ప్రభుత్వం వచ్చాక రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. వేద పాఠశాల ఏర్పాటుకు భూమి ఇవ్వాలని శారదాపీఠం గత వైసీపీ ప్రభుత్వాన్ని కోరగా.. అప్పటి ప్రభుత్వం స్పందించి కొత్తవలసలో భూమి కేటాయించిందని చెప్పారు.

కానీ ప్రభుత్వం మారిన వెంటనే కేటాయింపులను రద్దు చేయటంతో పాటు.. వేరే కంపెనీకీ ఎకరా కేవలం రూపాయికే కేటాయించటం గమనార్హమన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడే శారదా పీఠం పైన, స్వరూపానంద స్వామి పైన.. ప్రభుత్వానికి ఎందుకంత కక్ష సాధింపు అని ప్రశ్నించారు. అలాగే తిరుమలలో విశాఖ శారదా పీఠం భవనాన్ని ఖాళీ చేసి తమకి అప్పగించాలని.. టీటీడీ అధికారులు మఠానికి నోటీసులు జారీ చేయటంపై భక్తులు మండిపడుతున్నారన్నారు.

అర్చకులపై దాడులు హేయం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్చకులు, పురోహితులపై దాడులు అధికమయ్యాయని మల్లాది విష్ణు ఆరోపించారు. కాకినాడ జిల్లా సింగారమ్మ ఆలయంలో అర్చకురాలిపై దాడిని ఆయన తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వం హిందువుల మనోభావాలతో ఆడుకుంటోందని విష్ణు అన్నారు. ఓ వైపు దేవాలయాలపై దాడులు, మరోవైపు దేవుడి సేవకు అంకితమైన అర్చకులపై దౌర్జన్యాలు ఈ ప్రభుత్వంలో నిత్యకృత్యమయ్యాయని ఆరోపించారు.

కాకినాడలో అర్చకురాలి ఇంటిని కూటమి నాయకులు కూల్చివేయటంతో పాటు దాడికి యత్నించటం అమానుషమన్నారు. అర్చకుడంటే దేవుడికి, భక్తుడికి మధ్య అనుసంధాన కర్తగా భావిస్తామని, అర్చకుల కాళ్లకు మొక్కే సంప్రదాయం మనదని పేర్కొన్నారు. కానీ కాకినాడ ఘటన కూటమి నేతల అధికార మదానికి, హిందూ ధర్మం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిన్న చూపునకు అద్దం పడుతోందన్నారు. సమాజం బాగుండాలని నిత్యం కైంకర్యాలు, పూజలు నిర్వహించి దైవ దూతలుగా భావించే అర్చకులపై వరుస దాడులు కలచివేస్తున్నాయన్నారు.

గత ఏడాది జూలై 28 న చిత్తూరు చెంగల్రాయకొండపై వెలసిన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయ అర్చకుడి కుటుంబంపై టీడీపీ నేత లోకేష్ దాడి చేసినట్లు గుర్తు చేశారు. సెప్టెంబర్ 28 న తెనాలి నాజరుపేటలో కృష్ణ మందిరం నిర్వాహకులపై టీడీపీ నేతలు విచక్షణారహితంగా కర్రలతో దాడి చేసినట్లు పేర్కొన్నారు.

తాజాగా బాపట్ల జిల్లా మోదుకూరులోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ అర్చకులపై ఓ విలేకరి దాడి సభ్యసమాజం తలడించుకునేలా చేసిందన్నారు. అటు బ్రాహ్మణ సామాజికవర్గం, ఇటు హిందుత్వంపై ఈ ప్రభుత్వం పగబట్టిందని.. సనాతన ధర్మ రక్షకులుగా గప్పాలు కొట్టుకునే నాయకులు వీటిపై ఎందుకు స్పందించరని ప్రశ్నించారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక వరుసగా దేవతా విగ్రహాలపై దాడులు జరిగాయని, ఒక్క కేసులోనూ నిందితులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని మండిపడ్డారు. సింగారమ్మ ఆలయ అర్చకురాలిపై దాడికి తెగబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అర్చకులకు సరైన రక్షణ కల్పించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినమైన చట్టాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

LEAVE A RESPONSE