అధికారమనే మానసిక వ్యాధితో బాబు: స్పీకర్ తమ్మినేని

-బాబు పర్యటనలు.. అసమర్ధుడి అంతిమయాత్ర లాంటివి
– ‘జనంతో జగన్‌’ బంధం ఎప్పుడో ముడిపడింది
– సంక్షేమం–అభివృద్ధే ముఖ్యమంత్రి జగన్ గారి పాలనా నేత్రాలు…
– వచ్చే ఎన్నికల్లో మహిళలే బాబును ఇంటికి పంపిస్తారు
– తోకలు కత్తిరిస్తానన్నందుకు.. బాబు పిలకనే బీసీలు కట్ చేశారు
– ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం

‘జనం-జగన్‌’ బంధం
‘జనం-జగన్‌’ బంధం ఎప్పుడో ముడిపడిపోయింది… అది 2024 ఎన్నికల్లోనూ ప్రతిబింబిస్తుంది. జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం…ఈ సారి మహిళలే చంద్రబాబును తిరస్కరించి ఇంటికి పంపడం ఖాయం… బాబు రాజకీయ అంపశయ్యపై ఉన్నారు. జనం వెంటిలేటర్‌ తీసేస్తే ఇక ఆయన పని అయిపోయినట్లే… రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమి ఖాయం.. బాబు చేసే యాత్రలు… అసమర్థుడి అంతిమయాత్ర లాంటివి. గత మూడు రోజులుగా కర్నూలు జిల్లా పర్యటనలో బాబు పర్యటనలో మాట్లాడే మాటలు వింటుంటే రాబోయే ఎన్నికల్లో గెలుపుపై ఆయనకు నమ్మకం కోల్పోయినట్లు కనిపిస్తోంది.

అధికారమనే మానసిక వ్యాధితో బాబు
చంద్రబాబు అధికారమనే మానసిక వ్యాధితో బాధపడుతున్నారు…”నా కుర్చీ…నా కుర్చీ…”అంటూ కలవరిస్తూ…అలాగే కుప్పకూలిపోతారు. బాబుకు దమ్ముంటే.. గత ఎన్నికల్లో 612 వాగ్దానాలతో విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోను బయటకు తీసి మాట్లాడాలి. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని మేము అడుగుతుంటే … వెబ్‌సైట్‌ నుంచే మేనిఫెస్టోను తీసేశారు.

ఎన్టీఆర్ ఆత్మ బాబును వదలదు..
ఎన్నికల సమయంలోనే బాబుకు ఎన్టీఆర్‌ గురుకొస్తారు, ఆయన విగ్రహాలను, ఫ్లెక్సీలను ఆవిష్కరిస్తారు.
వెన్నుపోటు పొడిచి ఆయన్ని వైకుంఠానికి పంపేసినబాబూ…ఎన్టీఆర్‌ ఆత్మ నీ వెంటే పరిభ్రమిస్తోంది…ఏదో ఒకరోజున ఆయన ఆత్మ నీ కలలోకి వచ్చి నీ గుండెలపై కూర్చుని.. నీ పీక పిసికేయడం ఖాయం…’అని సీతారాం వ్యాఖ్యానించారు.

తోకలు కత్తిరిస్తానన్నందుకు.. బాబు పిలకనే బీసీలు కట్ చేశారు
ప్రజల ముందు మాట్లాడేటప్పుడు దిగజారిపోయి మాట్లాడరాదు.. ఎన్నికలు సమీపించే కొద్దీ బాబు ఇంకా దిగజారిపోతారు.బాబును దగ్గర్నుంచి చూసిన మనిషిని నేను… ఆయన ఎంత నీచానికి దిగజారుతారో సీతారాం ఉదహరిస్తూ… నాయీబ్రాహ్మణులు బాబును కలిస్తే మీ తోకలు కత్తిరిస్తానని వారితో దురుసుగా మాట్లాడినందుకు.. బీసీలు, బాబు పిలకనే కత్తిరించి పంపారు. మత్స్యకారులతోనూ ఇలాగే వ్యవహరించి, తన నైచ్యాన్ని ప్రదర్శించాడు, దానికి ఫలితం గత ఎన్నికల్లో అనుభవించారు.

సంక్షేమం–అభివృద్ధే ముఖ్యమంత్రి జగన్ పాలనా నేత్రాలు
సంక్షేమం, అభివృద్ధి తన పాలనా నేత్రాలుగా జగన్మోహనరెడ్డి గారు భావిస్తున్నారు కనుకే ఆయనే తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని సీతారాం పునరుద్ఘాటించారు. ఇటీవల ప్రధాని విశాఖ వచ్చిన సందర్భంగా ఆయన సమక్షంలోనే వేదికపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రయోజనాలే తప్ప తనకు రాజకీయ ప్రయోజనాలు లేవని కుండబద్దలు కొట్టారని చెప్పారు.

శివరామకృష్ణన్ కమిటీ సూచించిన మేరకే విశాఖను ఆయన పాలనా రాజధానిగా ప్రకటించారని, అన్ని సానుకూలతలు ఈ నగరానికి ఉన్నాయని సీతారాం తెలిపారు. రాజధానులపై ముఖ్యమంత్రికి దూరదృష్టి ఉందని …ఆ దిశగానే ఆయన ముందుకు వెళ్తున్నారని ప్రశంసించారు. కర్నూలు జిల్లా పర్యటనలో న్యాయవాదులు, విద్యార్థి సంఘాలకు చెప్పు చూపించాలని ఉందని బాబు మాట్లాడటం సిగ్గుచేటు. ఇదేం సంస్కారం అని సీతారాం ప్రశ్నించారు. ఆయన దత్తపుత్రుడైతే ఏకంగా చెప్పునే చూపించారని ఎద్దేవా చేశారు.

Leave a Reply