– ఇరిగేషన్, రోడ్లు.. అన్నిచోట్లా వాళ్ల దందాలే
– హైదరాబాద్లో జరిగే దందాలు వారివే
– మంచిగ మాట్లాడితే ఆంధ్రోళ్లు మన మాట వినరు
– ఆ కోవర్టులకు మొత్తం నల్లా కలెక్షన్లు కట్ చేయండి
– కరెంటు కనెక్షన్లు కట్ చేయండి
– కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోవర్టులున్నారని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఆరోపించారు. మనం మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రోళ్లు మాట వినరు అని చెప్పారు.
‘ఏపీ ప్రభుత్వం అక్రమంగా కడుతున్న బనకచర్ల ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమన్నకు ఓ సూచన చేస్తున్నా. లెటర్లు రాస్తున్నారు. లెటర్లు కాదు. చంద్రబాబు కోవర్టులు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టు కాంట్రాక్టులు వాళ్లే. రోడ్ల కాంట్రాక్టర్లు వాళ్లే.. హైదరాబాద్లో దందాలు వాళ్లవే. ఆ కోవర్టులకు మొత్తం నల్లా కలెక్షన్లు కట్ చేయండి. కరెంటు కనెక్షన్లు కట్ చేయండి.. ఇరిగేషన్ ప్రాజెక్టులలో ఒక్క రుపాయి వాళ్లకు పోకుండా ఆపండి.. అప్పుడు వాళ్లే వెళ్లి చంద్రబాబు కాళ్లు పట్టుకొని బనకచర్ల బంద్ చేపిస్తరు’ అని వ్యాఖ్యానించారు. బనకచర్ల ప్రాజెక్టు బంద్ కావాలంటే చంద్రబాబు కోవర్టులకు కల్పిస్తున్న సదుపాయాలను బంద్ చేయాలని.. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో వాళ్లే ఉన్నారని, రోడ్డు కాంట్రాక్టర్లు వారేనని, హైదరాబాద్లో జరిగే దందాలు వారివేనని ఆరోపించారు.
తెలంగాణకు శాపంగా మారనున్న బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపడానికి కేవలం లేఖలు రాస్తే సరిపోదని చెప్పారు.
హైదరాబాద్లో ఉండి కాంట్రాక్టులు.. పొందుతున్న వాళ్లంతా చంద్రబాబు నాయుడు శిష్యులేనని.. వాళ్లందరి భరతం పట్టాలని అధికార పార్టీ ఎమ్మెల్యేగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాను అంటేనే జడ్చర్లకు బ్రాండ్ ఇమేజ్ అని, గన్మెనుల లేకుండా హైదరాబాద్లోని అబిడ్స్లో తిరగగలనని అనిరుధ్రెడ్డి సవాల్ చేశారు.