ఆక్వా బడా వ్యాపారుల నుంచి తన వాటా పోతుందన్నదే బాబు ఆక్రోశం

– ఆక్వా రంగంలో ఒడిదుడుకులు ఉన్నా.. బాబు సృష్టించిన కృత్రిమ సంక్షోభమే ఇది
– పదెకరాల లోపు ఆక్వా రైతులకు రూ. 1.50కే విద్యుత్ ఇస్తున్నాం
రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు

“చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన నాలుగున్నర సంవత్సరాలపాటు ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ఎంతకిచ్చాడు అంటే రూ. 3.86 పైసలకు ఇచ్చాడు. తన పాదయాత్రలో జగన్ రూపాయిన్నరకే సబ్సిడీతో విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చాక, అధికారం నుంచి దిగిపోయే చివరి ఆరు నెలల ముందు మాత్రమే రూ. 2కు తగ్గిస్తున్నట్టు చంద్రబాబు చెప్పాడు. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ధర తగ్గించినా, డిస్కమ్ లకు కట్టాల్సింది మాత్రం కట్టకుండా దిగిపోయాడు. దాంతో, ఆ భారం కూడా మళ్ళీ ప్రభుత్వం మీదనే పడింది. అంటే, చంద్రబాబు హయాంలో ఐదేళ్ళూ ఆక్వా రైతులకు ఎటువంటి సబ్సిడీ అందలేదు. దాంతో రూ. 3.86 పైసలే పడినట్టైంది..” ఈ విషయాన్ని చెప్పకుండా, ఆక్వా రైతాంగాన్ని తాను మోసం చేసి, ఇప్పుడేదో నష్టం జరిగిపోతుందంటూ చంద్రబాబు సదస్సులు పెట్టి మాట్లాడటం విడ్డూరంగా ఉందని రాష్ట్ర పశుసంవర్థక, మత్య్స శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు.

పది ఎకరాల లోపు ఆక్వా రైతులకు మా ప్రభుత్వం రూపాయిన్నరకే సబ్సిడీ కింద విద్యుత్ ఇస్తోందని మంత్రి తెలిపారు. ప్రపంచ మార్కెట్ లో ఉన్న ఒడిదుడుకులు కారణంగానే ఆక్వా రంగంలో తాత్కాలిక సంక్షోభం ఏర్పడిందని, అయితే, చంద్రబాబు సృష్టించిన కృత్రిమ సంక్షోభం మాత్రం శాశ్వతం అని ఎద్దేవా చేశారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా ఆర్బీకే వ్యవస్థను ప్రవేశపెట్టి, విత్తనం నుంచి అమ్మకం వరకూ అన్నీ చూస్తున్న ప్రభుత్వం ఇది. ఆక్వా రైతులకు కూడా ఇదే పద్ధతిలో గిట్టుబాటు ధర ఇవ్వడానికి, అవసరమైతే కొనుగోలు చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడమని ముఖ్యమంత్రి జగన్ చెప్పిన విషయాన్ని మంత్రి అప్పలరాజు గుర్తు చేశారు. ఆక్వా రైతులకు సీడ్, ఫీడ్ కు సంబంధించిన ఆధిపత్యం అంతా సంపూర్ణంగా చంద్రబాబు మద్దతుదారుల కంపెనీలకే ఉంది. అంతేకాకుండా, ఎన్నికల సమయంలో ఆ ప్రాంతంలో, చంద్రబాబు నాయుడికి మనీ స్పాన్సర్ చేసిన వ్యక్తులు ఎవరయ్యా అంటే, ఆక్వా రైతుల ఉత్పత్తులకు ధరలు తగ్గించి, తద్వారా సంపాదించిన డబ్బుని ఫండింగ్ గా ఇచ్చిన బడా కంపెనీల యజమానులే. ఆ కంపెనీలు కూడా చంద్రబాబు మిత్రులు, బంధువులవేనని మంత్రి చెప్పారు.

కాబట్టే, ఆక్వా అసోసియేషన్ తరఫున ప్రభుత్వం చెప్పిన గిట్టుబాటు ధరకు కట్టుబడతాం, ప్రభుత్వం మాకు మేలే చేస్తుందని చెప్పినందుకు వారిని బెదిరించామంటూ చంద్రబాబు మా ప్రభుత్వంపై ఆరోపణలు చేశాడు. చంద్రబాబు ఆక్వా రైతుల తరఫున కాకుండా, ఆక్వా కంపెనీల తరఫున ఎందుకు మాట్లాడుతున్నాడనే దాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారన్నారు. ఎందుకంటే, బాబు అధికారంలో ఉండగా రైతులకు తక్కువ ధర ఇచ్చి, వాళ్ళను మోసం చేసి, తద్వారా వచ్చిన లాభాల్లో కొంత వాటాను చంద్రబాబుకి ఇచ్చేవారు కాబట్టే. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎవరూ ఆక్వా రైతులకు మేలు చేశారో, ఎవరు ఆక్వా రైతులకు ద్రోహం చేశారో అందరికీ తెలిసినా, మరోసారి రూపాయిన్నరకే ఇస్తానంటూ చంద్రబాబు చెల్లని హామీ ఇవ్వడం మరింత హాస్యాస్పదం అని మంత్రి ధ్వజమెత్తారు.మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…

బాబు సృష్టించిన కృత్రిమమైన సంక్షోభమే ఇది
ఆక్వా ఎగుమతిరంగంలో, ఫీడ్‌ ప్రొడక్షన్‌ రంగంలో కొన్ని దశాబ్ధాలుగా స్థిరపడి ఉన్న చంద్రబాబు తాబేదారులు, పెట్టుబడిదారులు కలిసి ఆక్వారంగంలో ఒక కృత్రిమమైన సంక్షోభాన్ని క్రియేట్‌ చేసేందుకు కుట్ర పన్నుతున్నారనేది సుస్పష్టం. టీడీపీ నేతలే ఆక్వారంగంలో బడా ఎగుమతిదారులుగా ఉన్నందున.. వారిని అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలకు బాబు పాల్పడుతున్నాడు. వాళ్లతో బలవంతంగా అడ్వరై్టజ్‌మెంట్‌ ఇప్పించామని.. పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు, జీఎస్టీ వాళ్లతో దాడులు చేయిస్తున్నామని బాబు కార్చే మొసలి కన్నీరును రైతులు గమనించారు. బాబు సామాజికవర్గం, ఆయనకు ఎన్నికల్లో పెట్టుబడి పెట్టేవాళ్లే ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లేకుంటే ఈ రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ఆక్వారంగం సంక్షోభంలో కూరుకుపోయేది. ఇది పచ్చి నిజం.

యూనిట్‌ రూ.2కు ఇస్తానని మాటతప్పింది బాబే
ఆనాడు ప్రతిపక్షంలో ఉండి జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తూ ఉభయగోదావరి జిల్లాలకు వచ్చినప్పుడు ఆక్వారైతులకు కరెంట్‌ సబ్సిడీపై ఒక ప్రకటన చేశారు. అప్పటికి యూనిట్‌ కు రూ.3.86 పైసలు బాబు ప్రభుత్వం ఆక్వారంగం నుంచి వసూలు చేస్తుంటే.. అధికారంలోకి వచ్చాక యూనిట్‌ రూ.1.50 పైసలకే ఇస్తానని జగనన్న ప్రకటించిన సంగతి అందరూ గుర్తెరగాలి. దాంతో వెంటనే స్పందించిన చంద్రబాబు తానూ యూనిట్‌ రూ.2కే సరఫరా ఇస్తానని హామీ ఇచ్చి, కనీసం చెప్పిన మాటను కూడా నిలబెట్టుకోలేకపోవడం రైతులు మరిచిపోలేరు. ‘ఆనాడు కూడా జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటనతోనే బాబు స్పందించాడు తప్ప.. ఆరోజునగానీ, ఈరోజునగానీ నీకు రైతుల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదు’.

బాబు ఎగ్గొట్టిన సబ్సిడీతో కలిపి రూ.2,647 కోట్లు ఇచ్చాం
ఆక్వా రైతుల పట్ల చంద్రబాబుకు ఏమాత్రం ప్రేమ లేదు. ఆయన అధికారంలో ఉన్నన్నాళ్లు ఏరోజైనా ఆక్వా రంగానికి విద్యుత్ సబ్సిడీ కింద ఒక్క రూపాయి కేటాయించిన దాఖలా లేదు. విద్యుత్‌ సబ్సిడీ రూ.2కే యూనిట్‌ ఇస్తానని చెప్పి.. ఒక్క రూపాయి కూడా రిలీజ్‌ చేయలేదు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే బ్యాక్‌ ఎండ్‌ సబ్సిడీతో కలిపి 2019–20లో సుమారు రూ.330 కోట్లు సబ్సిడీ బకాయిలను మా ప్రభుత్వమే తీర్చింది. అదేవిధంగా మా ప్రభుత్వ హయాంలో మూడేళ్ల సబ్సిడీతో పాటు, టీడీపీ హయాంలో పెట్టిన బకాయిలు కలిపి ఇప్పటికి సుమారుగా రూ.2,647 కోట్లు ఆక్వా పవర్‌ సబ్సిడీ కింద మేం రైతులకు ఇచ్చాం.

బాబు హయాంలో ఆక్వాకు కేటాయింపులు సున్నా
చంద్రబాబుకు సిగ్గు, లజ్జ ఉంటే టీడీపీ హయాంలో ఆక్వాకు కేటాయింపులు ఏమిచేశారో చెప్పగలరా..?. అధికారంలో ఉండగా ఏమీ చేయకుండా, ఇప్పుడొచ్చి మళ్ళీ హామీలు ఇస్తే, మాయమాటలు చెబితే, నాటకాలాడితే, అబద్ధాలు చెబితే.. నమ్మే పరిస్థితిల్లో రైతులు లేరు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, విద్యుత్ సబ్సిడీ, ఇన్‌పుట్ సబ్సిడీ, ఫీడ్‌ కోసం ఏ ఒక్క రూపాయి కూడా కేటాయించిన దాఖలాలు లేవు. ఆక్వా సదస్సులో గొంతు చించుకున్న చంద్రబాబు.. తన హయాంలో ఖర్చు పెట్టినది ఎంత అని ఎందుకు చెప్పలేదు..? ఎందుకంటే, చంద్రబాబు హయాంలో అసలు కేటాయింపులేమీ లేవు. కేవలం, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పై దుగ్ధతోనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడు.

ఆక్వాజోన్‌ రైతులకు రూ.1.50కే విద్యుత్ అందిస్తున్నాం
ఆక్వా రంగానికి సంబంధించి, ప్రభుత్వం ఒక రివైజ్డ్‌ జీవో ఇచ్చింది. పదెకరాలలోపు ఆక్వాజోన్‌ రైతులకు రూ.1.50కే సబ్సిడీ కింద విద్యుత్‌ ఇస్తామని చెప్పాము. ఆమేరకే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఆక్వాజోన్‌లో ఉన్న రైతుల అవసరాన్ని గుర్తించి తీసుకున్న నిర్ణయమిది. ఈ ఆక్వా జోన్ లను నిర్ణయించింది కూడా గత చంద్రబాబు ప్రభుత్వమే కదా..

పదెకరాలకు పైబడిన ఆక్వా రైతులు కేవలం 2.8 శాతమే
పదెకరాలకు పైబడి రాష్ట్రంలో కేవలం 2.8 శాతం మంది రైతులు ఉన్నారు. వారంతా బిగ్గెస్ట్‌ ఎంటర్‌పెన్యూర్స్‌.. వారికి కూడా రూ.3.80 పైసలకు కరెంట్‌ ఇస్తున్నాము. ఈ రోజు పవర్‌ ప్రొడక్షన్‌ కాస్ట్‌ చాలా ఎక్కువ పెరిగింది. గతంతో పోలిస్తే రూ.6.80 పైసలు ఒక యూనిట్‌ ఖర్చు అవుతుంది. గతంలో ఇదే ప్రొడక్షన్‌ కాస్ట్‌ సుమారు 3.88 పైసలు ఉండేది. ఇంత ప్రొడక్షన్‌ కాస్ట్‌ పెరిగినా.. పదెకరాల పైన ఉన్న రైతులకు 3.80 రూపాయలకే ప్రభుత్వం కరెంట్‌ అందించడం అందరూ గుర్తించాల్సిన విషయం. ఈ సంగతిని దాచిపెట్టి చంద్రబాబు మాయ మాటలు ప్రచారం చేస్తే రైతులు నమ్మేందుకు సిద్ధంగా లేరు.

ఆక్వా రంగంలో సమస్యల్ని అధిగమిస్తాం..
అంతర్జాతీయంగా ఎగుమతుల విషయం, ధరల విషయంలో సమస్యలున్నాయి. చైనీస్‌ మార్కెట్‌ ఒకపక్కన షట్‌డౌన్‌ అయ్యింది. అమెరికన్‌ మార్కెట్‌కు పక్కన ఉన్న ఈక్విడార్‌ వంటి దేశాల్లో ఆక్వాప్రొడక్షన్‌ పెంచి .. మన దేశానికి పోటీగా తయారయ్యాయి. అక్కడ ఫ్లైట్‌ ఛార్జిలు తక్కువ, ప్రొడక్షన్‌ వినియోగ ధరలు చాలా తక్కువగా ఉన్నందున ఆయా దేశాల ఆక్వారంగం మనకు పోటీగా నిలిచింది. ఆయినా సరే, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడింది.

ఆక్వా డెవలప్‌మెంట్‌ అథారిటీతో విప్లవాత్మక మార్పు
ఆక్వా రైతుల పక్షాన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో గొప్ప విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేసి ఫీడ్‌యాక్ట్, సీడ్‌ యాక్ట్‌లు అమల్లోకి తీసుకొచ్చారు. మంత్రులతో ఒక ఎంపవరింగ్‌ కమిటీని నియమించి.. రైతుల్లో ఒక నమ్మకాన్ని కలిగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. చంద్రబాబు హయాంలో ఇలాంటి ఆలోచనల్ని అమలు చేయకపోవడంలో అంతర్యమేంటి..? ఈరోజు ఇలాంటి చట్టాలు లేకుంటే, ఆక్వారంగాన్ని రెగ్యులేట్‌ చేయడానికి.. ఎగుమతిదారులతో, హేచరీస్‌ యాజమాన్యాలతో మాట్లాడగలిగే పరిస్థితి ఉండేది కాదు. సంక్షోభంలో కూరుకుపోతున్న రైతులను వదిలిపెట్టకుండా.. వారిని ఆదుకునే ఏర్పాట్లలో భాగంగానే ఆక్వా డెవలప్‌మెంట్‌ అథారిటీని అమల్లోకి తెచ్చి ఈ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంది.

బాబు హయాంలో తిరోగమనంలో ఆక్వారంగం
చంద్రబాబు హయాంలో ఆక్వారంగంలోని స్టేక్‌ హోల్డర్స్‌ను పిలిపించి ఏ ఒక్కసారైనా మాట్లాడిన దాఖలాలు లేవు. ఆయన మంత్రివర్గంలోని ప్రతినిధులు ఏరోజైనా ఆక్వారైతులతో మాట్లాడిన పాపాన పోలేదు. టీడీపీలో ఉన్న బడా ఆక్వా ఎగుమతిదారులు ఏది చెబితే అదే వేదంగా నడిచిన మాట యదార్ధం. ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ఆక్వా విధానాల్ని చూసి మిగతా రాష్ట్రాలు కూడా వాటినే అనుసరించడం గొప్ప విషయం. ఇక్కడ అమలవుతున్న పవర్‌ సబ్సిడీ, ధరలు, చట్టాలను ఆయా రాష్ట్రాల్లో అమలు చేసే పరిస్థితి వచ్చింది. ఆక్వారంగం క్షీణదశకు చేరిందని చంద్రబాబు మాట్లాడటంలో అర్ధం లేదు. అధికారం కోసం ఆత్రంతో చంద్రబాబు ఎంతకైనా దిగజారతాడా అనిపిస్తుంది.

2018–19 సంవత్సరానికి చంద్రబాబు పవర్‌ సబ్సిడీ ఇస్తానని ప్రకటించిన రోజుకు రాష్ట్రంలో 51,900 విద్యుత్ కనెక్షన్లు ఉంటే .. ఈరోజు( 2022–2023) లో సుమారు 62 వేల కనెక్షన్లు ఉన్నాయి. దాని అర్ధం ఏంటి..? ఈ మూడేళ్ల కాలంలో రైతులు సుమారు 10వేల కనెక్షన్‌లు పెట్టించుకున్నారు. దీన్నిబట్టి ఆక్వారంగం పెరిగిందో తగ్గిందో.. బాబు సమాధానం చెప్పాలి. కోవిడ్‌ సమయంలో కూడా 20శాతం కనెక్షన్‌లు అదనంగా మూడేళ్లలో ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఇది ఈ ప్రభుత్వం ఆక్వారంగానికి ఇచ్చిన ప్రాధాన్యతగా గుర్తించాలి.

అబద్ధాలు సృష్టించి.. తాను మాట్లాడిందే నిజమని నమ్మించే బాబు కుట్రల్ని ప్రజలు ఏనాడో అర్ధం చేసుకున్నారు. టీడీపీ మాఫియా ముఠా, వారికి వత్తాసుపలికే ఎల్లో మీడియా పత్రికలు, చానళ్లు ఈ ప్రభుత్వ విధానాలపై ఎంతగా దుష్ప్రచారం చేస్తున్నారో.. రైతులంతా గమనిస్తూనే ఉన్నారు. ఆక్వా ప్రాసెసర్స్, ఫీడ్‌ మిల్లర్ల నుంచి ప్రభుత్వం బలవంతంగా డబ్బులు వసూలు చేస్తుందని చంద్రబాబు చెప్పే మాటలు శుద్ధ అబద్ధం. ‘ఇదేంద ఖర్మ చంద్రబాబూ.. మేం వసూళ్లుకు పాల్పడుతున్నామని నువ్వెక్కడైనా రుజువులు చూపుతావా.? ఒక్క ఫీడ్‌ మిల్లర్‌ నుంచి అయినా మేం డబ్బులు వసూలు చేస్తున్నామని చెప్పించగలవా.. ? ఎన్నికల్లో నీకు డబ్బులు పెట్టుబడులు పెట్టే వాళ్లు ఆక్వారంగంలో ప్రాసెసర్లుగా నీ పార్టీలోనే ఉన్నారు కదా..?’ ఈ విషయాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.

ఆక్వా రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్థిరమైన సంకల్పం వలనే ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వారంగం లాభాల బాటలో నడుస్తోంది. పక్క రాష్ట్రాలైన గుజరాత్, ఒరిస్సా, తమిళనాడు, కేరళలో అన్ని ఆక్వా ప్లాంట్స్ షట్‌డౌన్‌ అయ్యాయి. కేరళలో 70శాతానికి పైగా మూతపడ్డాయి. ఏపీలో మాత్రం ఆ పరిస్థితులు లేవు. తాము నష్టపోతున్నామని.. ఫీడ్‌ప్లాంట్‌లు, హేచరీస్‌ మూసేస్తున్నామని ఏ ఒక్కరైనా చెప్పారా..?. ఆక్వారంగాన్ని బతికించి రైతులకు లాభసాటి సాగు చూపెట్టడమే ఈ ప్రభుత్వం లక్ష్యం. .చిత్తశుద్ధి. చంద్రబాబు అధికారంలో ఉండగా చేయలేదని.. మళ్లీ తాను అధికారంలో వస్తానని కలలుకంటూ, వస్తే, రూ.1.50కే కరెంట్‌ ఇస్తానని చెబితే మాత్రం ఎవరు నమ్ముతారు..?. పదెకరాలలోపు ప్రతీ రైతుకూ సబ్సిడీ అందిస్తోంది. రైతుల్లో ఆందోళన అవసరం లేదు. జగన్‌ ముందుచూపు వలనే ఇది సాధ్యపడింది. ఎగుమతుల విషయంలోనూ సమస్యల్ని అధిగమించేందుకు కేంద్రంలోని కామర్స్‌ మినిస్ట్రీ, సెక్రటరీతో మాట్లాడుతున్నాము. ప్రాసెసర్స్, హేచరిస్, ఫీడ్‌ఫ్లాంట్‌ ప్రతినిధులను ఒకచోటికి చేర్చుతాం. వంద కౌంట్‌ రొయ్యలు రూ.210గా అమ్మాలని ధర కూడా నిర్ణయించాము. ఈ విషయంలో తక్కువ ధరకు అమ్ముకోవాలని బలవంతం చేసే దళారులను నమ్మొద్దు. ప్రపంచ ఎగుమతులలో ఉన్న ఇబ్బందులు అతిత్వరలో సమసిపోతాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడతాము. మనల్ని మాయ చేయడానికి .. ఆక్వారంగాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తే రైతులనుంచి వ్యతిరేకత తప్పదు. ప్రభుత్వ ప్రతిష్టతను దిగజార్చాలని కుట్రలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.

Leave a Reply