భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్

– 32 రోజులపాటు నియోజకవర్గంలో పాదయాత్ర
– పీపుల్స్ మార్చ్ కు అడుగడుగునా భారీగా ఏర్పాట్లు
– జమలాపురంలో ఘనంగా ముగింపు సభ
– రూట్ మ్యాప్ సిద్ధం చేసిన పార్టీ నాయకులు

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క ప్రజా సమస్యల పరిష్కారానికి పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర)కు ఆదివారం శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్న బిజెపి, టిఆర్ఎస్ సర్కార్ లను ప్రజా క్షేత్రంలో నిలదీసేందుకు సిద్ధం అయ్యారు.

ప్రజలను సంఘటితం చేసి సర్కారు మెడలు వంచడానికి విక్రమార్కుడు చేపడుతున్న సమర(పాద)యాత్ర గులాబీ పాలకుల గుండెల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మధిర నియోజకవర్గంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ప్రతి గడపను తట్టేందుకు 32రోజుల పాటు 506 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి పల్లెను చుట్టేస్తారు. భట్టి విక్రమార్క చేపట్టే ఈ పాదయాత్ర రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చనుందన్న కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు.

రాజీవ్ వైయస్సార్ స్ఫూర్తితో
స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డిలను ఆదర్శంగా తీసుకొని భట్టి విక్రమార్క రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవకు అంకితం అయ్యారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో మధిర నియోజకవర్గంలో ప్రగతి యాత్ర చేపట్టి ప్రజా సమస్యల పైన అధ్యయనం చేశారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మధుర నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రభుత్వ చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేశారు. దాదాపుగా రూ.2200 కోట్లు నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలో ప్రజలకు కావలసిన అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి అమరవీరుల ఆకాంక్షను నెరవేర్చడానికి సోనియమ్మ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది. ఈ క్రమంలో 2014లో శాసనసభ్యుడిగా గెలుపొందిన భట్టి విక్రమార్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించిన అభివృద్ధి పనులను పూర్తి చేయడంతోపాటు కాంగ్రెస్ నేతగా రాష్ట్రానికి సేవలందించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా కేసీఆర్ సర్కార్ వ్యవహరించిన తీరును పల్లెనిద్ర కార్యక్రమంతో ఎండగట్టారు.

ఇప్పుడు మరో మారు దివంగత సీఎం వైఎస్ఆర్ బాటలో పయనించేందుకు సిద్ధమైయ్యారు. కాలినడకన ప్రజల్లోకి వెళ్లీ టిఆర్ఎస్ పాలనలో క్షేత్ర స్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవాలని భావించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆయన స్వంత నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మహా పాదయాత్ర చేపడుతున్నారు. కొద్ది రోజుల క్రితమే ఈ పాదయాత్రను నిర్వహించాల్సి ఉండగా, కోవిడ్ నిబంధనల్లో భాగంగా పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా పడింది.

నేటి నుంచి ప్రారంభం..
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర.. మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలం, యడవల్లి గ్రామంలో శ్రీలక్ష్మినర్సింహాస్వామి దేవాలయంలో పూజలు చేసిన అనంతరం, సర్కారుపై సమర (పాద)యాత్ర ప్రారంభం అవుతుంది. సుమారు 32 రోజుల పాటు పాదయాత్ర 506 కిలోమీటర్ల మేర
bhatti కొనసాగనుంది. ముదిగొండలో 7 రోజుల పాటు మహాపాదయాత్ర కొనసాగిన తరువాత చింతకాని మండలంలో ప్రవేశించనుంది. ఆ మండలంలో ఏడు రోజులు పాదయాత్ర చేసిన తర్వాత బోనకల్లు కు చేరుకుంటుంది. ఆ తర్వాత మధిర, ఎర్రుపాలెం మండలాల్లో భట్టి పాదయాత్ర కొనసాగుతుంది. 32రోజుల తరువాత జమలాపురంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పీపుల్స్ మార్చ్ ను ముగింపు చేస్తారు.

పాదయాత్ర కు సర్వం సిద్ధం
సుమారు 32 రోజుల పాటు జరిగే ఈ పాదయాత్రకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు హాజరైయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భట్టి తో పాటు ఈ పాదయాత్రలో ప్రతి రోజు వందల మంది నాయకులు కార్యకర్తలు పాల్గొనే విధంగా కార్యాచరణను సిద్ధం చేశారు. హోరెత్తించే కార్యకర్తలు నినాదాలు, మోగనున్న డప్పుల వాయిద్యాలు,కళాకారుల ఆట- పాట ఈ పాదయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.

పాదయాత్రకు భారీ ఏర్పాట్లు చేశారు. దారిపొడవునా భారీ ఫ్లెక్సిలు, కాంగ్రెస్ జెండాలతో ప్రత్యేక అలంకరణ చేస్తున్నారు. ప్రతి గ్రామంలో పాదయాత్ర కు ఘనంగా స్వాగతం పలికేందుకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంగళ హారతులతో మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి భట్టి పాదయాత్ర అడుగులో అడుగులు వేయనున్నారు. పాదయాత్ర చేస్తున్న దారుల్లో ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడానికి, అందుకు సంబంధించిన కమిటీలను కూడా భట్టి విక్రమార్క ఏర్పాటు చేశారు.

రాత్రి సమయంలో హాల్టింగ్, విశ్రాంతి, భోజనాల ఏర్పాట్లు చేసే పనిలో క్షేత్రస్థాయిలో క్యాడర్ నిమగ్నమైయ్యారు. అక్కడక్కడ బహిరంగ సభలను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ముగింపు రోజున బారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మొత్తంగా 32 రోజులపాటు కొనసాగే పాదయాత్ర విజయవంతం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పని చేస్తున్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడమే ద్యేయంగా భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నట్టు ఆ పార్టీ నేతలు వెల్లడించారు.

Leave a Reply