ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే పులివెందుల కేంద్రంగా భీమ్ రావ్ జిల్లా ఏర్పాటు చేయాలి

• సీఎంను ఒప్పించే బాధ్యత సీనియర్ మంత్రులు తీసుకోవాలి
• బీసీ, ఎస్సీ, ఎస్టీల్ని ఏం ఉద్దరించారని బస్సు యాత్రలు చేస్తున్నారు
• మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుని వివాదాల్లోకి లాగి రాజకీయంగా వాడుకుంటూ ఆ మహనీయుని ఖ్యాతిని తగ్గించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి  పోతిన వెంకట మహేష్ స్పష్టం చేశారు. నిజంగా వైసీపీ ప్రభుత్వానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పట్ల చిత్తశుద్ధి ఉంటే కడప జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. వీలు కాని పక్షంలో 27వ జిల్లాను పులివెందుల కేంద్రంగా ఏర్పాటు చేసి భీమ్ రావ్ జిల్లాగా నామకరణం చేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గాన్ని ఈ విధంగా చేస్తే బాబాసాహెబ్ స్ఫూర్తి వెల్లడవుతుందన్నారు.

గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ “పచ్చటి కోనసీమలో అల్లర్లకు కారణమైన వైసీపీ నిర్ణయం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. కులాల మధ్య చిచ్చుపెట్టే ఉద్దేశ్యంతో, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని ఉద్దేశపూర్వకంగానే వైసీపీ నాయకులు ఇలాంటి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే వైసీపీ ప్రభుత్వం జిల్లాల పేరు అంశాన్ని తెర మీదకు తెచ్చింది. ఇంత అల్లర్లు జరుగుతుంటే బాధ్యతగా స్పందించాల్సిన మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లాల పేర్లు మార్చడం ఒక నిరంతర ప్రక్రియ అని చెప్పారు. పేర్లు మార్చడంతోపాటు కొత్త జిల్లాల ఏర్పాటు కూడ ఒక నిరంతర ప్రక్రియగా పెట్టుకోవాలని జనసేన పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కడపకు వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెట్టారు. వైద్య వృత్తిలో ఉన్న వైఎస్ఆర్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు అంటే అందుకు కారణం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ . ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే ఇవాళ కశ్మీర్ భారత భూభాగంలో ఉంది. అలాంటి గొప్ప వ్యక్తి పేరుని వివాదాల్లోకి లాగి రాజకీయంగా వాడుకుంటూ మహనీయుడి ఖ్యాతిని తగ్గించేందుకు వైసీపీ ప్రభుత్వం దుర్మార్గమైన పనులు చేస్తోంది. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కడపకు డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ పేరుని పెట్టి దాన్ని నిరూపించుకోవాలి. 27వ జిల్లాగా బీమ్ రావ్ జిల్లాను పులివెందుల కేంద్రంగా ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్ రెడ్డిని కోరుతున్నాం.

• జనసేనకు అమలాపురం అల్లర్లకు సంబంధం లేదు
మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే – పులివెందుల కేంద్రంగా భీమ్ రావు జిల్లా ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఒప్పించాలి. సీనియర్ మంత్రులయిన ఆ ముగ్గురూ బాధ్యత తీసుకోవాలి. వైసీపీ వాళ్ళు అమలాపురం ఘర్షణల మీద పదే పదే మాట్లాడుతున్నారు. జనసేన పార్టీకి అక్కడ జరిగిన అల్లర్లకు సంబంధం లేదు.సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి ఫోటోలో అల్లర్లకు కారణంగా చెబుతున్న వ్యక్తి వైసీపీలో ఉన్న మేధావి, ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో దిగిన ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. వైసీపీ నాయకులు ముందుగా దానికి సమాధానం చెప్పాలి.

• బీసీ, ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిన ఏకైక పార్టీ వైసీపీ
రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలను మోసం చేసిన ఏకైక పార్టీ వైసీపీ. కేవలం వారిని జెండాలు మోసే కూలీలుగా, ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే వాడుకుంటున్న మీకు ఏ అర్హత ఉందని ఈ రోజున సామాజిక భేరి పేరిట బస్సు యాత్ర చేపడతారు. మీరు ఏం సాధించారని, ఏ వర్గాలకు మంచి చేశారని యాత్ర చేస్తారు. మీరు బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ మంత్రుల్ని తోలు బొమ్మల్ని చేసి ఆ వర్గాలను మోసగించేలా బస్సు యాత్ర చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం బీసీ రిజర్వేషన్ రద్దు చేసి 18 వేల మంది బీసీలకు స్థానిక ఎన్నికల్లో పదవులకు దూరమైనందుకా ఈ బస్సు యాత్ర. ఎస్సీ ఎస్టీల మీదనే అట్రాసిటీ కేసులు పెట్టినందుకా ఈ బస్సు యాత్ర. ముస్లింలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సబ్ ప్లాన్ రద్దు చేసినందుకా ఈ యాత్ర. దుల్హన్ పథకం రద్దు చేసినందుకా, విదేశీ విద్యోన్నతి పథకం రద్దు చేసినందుకా, సబ్సిడీ రుణాలు రద్దు చేసి వెనుకబడిన వర్గాలను మోసం చేసినందుకా ఈ బస్సు యాత్ర. మీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు గడచిన మూడేళ్లలో కేటాయించిన సబ్ ప్లాన్ నిధులు ఎంత? అందులో ఆ వర్గాల అభివృద్ధికి ఖర్చు చేసింది ఎంత శ్వేతపత్రం విడుదల చేయాలి. వెనుకబడిన వర్గాలను మోసం చేసింది కాక బస్సు యాత్రకు బయలుదేరేందుకు మంత్రులకు సిగ్గుండాలి. వైసీపీ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలంతా గ్రహించారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నార”న్నారు.

Leave a Reply