ఎస్సీలపై వైసీపీ ప్రభుత్వానిది మొసలి కన్నీరు

-సమస్యలు సృష్టించడమే ప్రభుత్వ ఎజెండా
-నెపం విపక్షాల మీద రుద్ది సానుభూతి పొందాలనేది ప్రభుత్వ ప్రయత్నం
– జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ

ఏదైనా సమస్య వస్తే పరిష్కరించాల్సిన ప్రభుత్వమే సమస్య సృష్టించాలని చూస్తోందని, దీనికి ప్రత్యక్ష ఉదాహరణే అమలాపురం అల్లర్లు అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. కోనసీమలో జరుగుతున్న అల్లర్ల విషయాన్ని ఖండిస్తూ ఆయన గురువారం విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘అమలాపురంలో చేపట్టిన నిరసన వ్యక్తం చేస్తే దానికి రాజకీయ రంగు పులమడం అధికార పార్టీ కుట్రలో భాగం. శాంతియుత మార్గంలో సమస్యకు పరిష్కారం చూపించాల్సిన ప్రభుత్వం కావాలనే దీనిని పెంచి పెద్దది చేయాలని చూస్తోంది. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తే వెంటనే సమస్యకు పరిష్కారం వస్తుంది. దానిని పూర్తిగా పక్కన పెట్టేసి, ప్రాథమిక విచారణ కూడా పూర్తి కాక ముందే ప్రభుత్వంలోని పెద్దలు అల్లర్లను ప్రతిపక్షాల మీదకు తోసేసే ప్రయత్నం చేయడం అత్యంత దారుణం. అందరినీ కూర్చొబెట్టి మాట్లాడితే నిమిషాల్లో సమస్య పరిష్కారం అవుతుంది. కాని అది ఈ ప్రభుత్వానికి అక్కర్లేదు. వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్సీ మీద పడిన హత్య కేసు మరకను, గడపగడపకు ఎదురవుతున్న పరాభవాన్ని తప్పించుకోవడానికే ప్రభుత్వం ఈ కుట్రకు తెరలేపింది.అంబేద్కర్ మీద ఈ ప్రభుత్వానికి నిజమైన ప్రేమ ఉంటే కచ్చితంగా అంబేద్కర్ పేరును మొదటే పెట్టేది. అలాకాకుండా ఇప్పటికిప్పడు దీనిని ఓ ప్రణాళిక ప్రకారమే ఈ ప్రభుత్వం తెరమీదకు తెచ్చిందని అర్థం అవుతుంది.

* 28 అంశాల్లో ఎస్సీలను మోసం చేశారు
ఎస్సీల మీద ఎంతో ప్రేమ ఉందని చెప్పుకునే ఈ ప్రభుత్వం… ఎస్సీలకు సంబంధించిన 28 పథకాలను రద్దు చేసింది. 11 వేల ఎకరాల భూమిని ఎస్సీల వద్ద నుంచి బలవంతంగా లాక్కుంది. ఈ రోజు విజయనగరంలో ఎస్సీ సంఘాల సమావేశాన్ని అడ్డుకుంది. అంబేద్కర్ విదేశీ విద్యా పథకం, బుక్ బ్యాంకు స్కీం, ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన, ఎస్సీ, ఎస్టీలకు స్టార్టప్ ఇండియా లోన్లు నిలిపివేత, జీవో నంబరు 172తో ఎస్సీ, ఎస్టీ పిల్లలకు చదువు దూరం, కార్పొరేషన్లు నిర్వీర్యం, ఎస్సీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను దూరం చేసి దళితులకు ద్రోహం చేస్తూ, ఎస్సీలకు సంక్షేమం చేస్తున్నామని మొసలికన్నీరు కారుస్తోంది. ప్రతి విషయంలో ఎస్సీల ను చిన్నచూపు చూస్తున్న ప్రభుత్వం.. కులాల కుంపటి రాజేసి దళితుల్ని సమిధలు చేసి ఓట్ల రాజకీయం చేస్తోంది. ఎస్సీ, బీసీలు వైఎస్సాఆర్సీపీకి దూరమవుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం వారిలో విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. ప్రజలంతా దీన్ని గమనించాలి. వెంటనే ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, వెంటనే అన్ని పార్టీల తో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి.. కోనసీమలో ఎలాంటి అలజడులు లేకుండా చూడాలి’’ అని డిమాండు చేశారు.

Leave a Reply