చిన్న సన్నకారు రైతాంగానికి, పాడి పరిశ్రమకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర పాడి పరిశ్రమ సినిమా ఫోటోగ్రఫీ శాఖ మాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గం పరిధిలోని రావిర్యాల గ్రామ పరిధిలో 32 ఎకరాల విస్తీర్ణంలో 246 కోట్ల వ్యయంతో తెలంగాణ విజయ డైరీ ఆధ్వర్యంలో అత్యాధునిక మెగా డైరీ ప్రాజెక్ట్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో కలిసి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సహకార రంగానికి సంబంధించి దేశంలో పాడి పంట ఇబ్బంది వచ్చినప్పుడు పాడి పైన ఆధార పడే సన్నకారు చిన్నకారు రైతాంగానికి చేయూత నివ్వాలనే సంకల్పంతో విజయ డైరీ ప్రారంభమైనదని 2014 తెలంగాణ రాష్ట్రం రాకముందు విజయ డైరీ మూతపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అప్పట్లో ఒక లక్ష లీటర్ల పాలు సేకరించేవారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో రైతాంగాన్ని ప్రోత్సహించి ఆర్థికంగా తోడ్పాటు నందించి దేశంలో ఫ్రైవేట్ పోటీ రంగంలో విజయ డైరీ మొదటి స్థానంలో ఉందన్నారు.
2014 లో 300 కోట్ల టర్నోవర్ ఉండేదని నేడు 750 కోట్ల టర్నోవర్ తో విజయ తెలంగాణ ముందుకు వెళుతుందన్నారు. నాలుగున్నర లక్షల లీటర్ల వరకు పాల సేకరణ జరుగుతుందని అన్నారు. విజయ డైరీ ప్రాజెక్టును రెండు సంవత్సరాలలో పూర్తి చేయాలనే లక్ష్యం ఉండగా ఒకటిన్నర సంవత్సరంలో పూర్తి చేయాలనే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆలోచన అని అన్నారు. 8 లక్షల లీటర్ల వరకు ఈ ప్రాంతంలో కొత్త టెక్నాలజీ ఉత్పత్తులను నిర్వహిస్తున్నామని, విజయ డైరీ ఉత్పత్తులు 28 వరకు సంస్థలు ఉన్నాయని, మన రాష్ట్రంలో నే కాకుండా ఆంధ్రప్రదేశ్ ,ఢిల్లీ , ముంబయిలో డిమాండ్ ఉన్నాయని తెలిపారు.
![](https://www.suryaa.co.in/wp-content/uploads/2021/09/www.suryaa.co.in-62-300x210.jpg)
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుంచే భాగంగా పాడి పంటలు రెండు బాగుండాలని సంకల్పంతో విజయ మెగా డైరీ శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. పాడి పరిశ్రమ బాగా అభివృద్ధి చెందాలని గొల్ల కురుమల ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశ్యంతో గొర్రెలను ఇవ్వడం జరుగుతుందన్నారు. 11 వేల కోట్ల రూపాయలుతో గొర్రెలను ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇంతకు ముందు చేపలు కావాలంటే ఈస్ట్ గోదావరి నుంచి తీసుకు రావాలన్నారు. మన చెరువులు కుంటలలో తెలంగాణలో ఎక్కడ
వెళ్లిన చేపలు దొరుకుతున్నాయని అన్నారు. వృత్తి ఏదైనా ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ సమీపాన ఉన్నదని హైదరాబాద్ సంబంధించిన పాల ఉత్పత్తికి డిమాండ్ కి అనుగుణంగా అందుకో లేక పోతున్నామని అన్నారు. కొత్తగా పాడి పరిశ్రమ పెట్టుకునే వారికి సబ్సిడీ కింద పాడి రుణాలను ఇస్తే బాగుంటుందని అన్నారు. మన వ్యవస్థని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. విజయ డైరీని బలోపేతం చేసుకొని దానిపైన వచ్చిన లాభాలు రైతులకు వస్తాయని తెలిపారు. ప్రతి పాడి రైతు విజయ డైరీకి పాలు ఇచ్చే విధంగా రైతులను ప్రోత్సహించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఇగ్గె మల్లేశం, సురభి వాణి దేవి, జిల్లా చైర్పర్సన్ తీగల అనిత రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, పశు సంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర ,అడిషనల్ డైరక్టర్ రాంచందర్ , టీఎ స్ఎస్ ఎల్డిఏ సీఈఓ మంజువాణి , జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం , తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మధుమేహన్ , వైస్ చైర్మన్ వెంకన్న, విజయ డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి, విజయ డైరీ ఎండి శ్రీనివాస్ రావు , సహకార సంఘాల సభ్యులు, రైతులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.