Suryaa.co.in

Andhra Pradesh

వైకాపా ప్రభుత్వంపై భాజపా ప్రజాపోరు

– భాజపా ముఖ్య నాయకుల సమావేశంలో దగ్గుబాటి పురందేశ్వరి

వైకాపా అవినీతి, అసమర్ధ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు భాజపా ప్రజలతో కలసి ప్రజాపోరు చేయనుందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్టంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 21 నుంచి 30 వరకు 9 రోజుల పాటు ప్రజాపోరు కార్యక్రమం నిర్వహించనుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య నాయకుల సమావేశం ప్రజాపోరు కార్యక్రమం కన్వీనరు, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన పురందేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గమైన నియంతృత్వ పాలన సాగుతోందన్నారు. కొండలు, గుట్టలు వంటి ప్రకృతి వనరులను యధేచ్ఛగా దోచుకుంటూ, మద్యం, ఇసుక సరఫరాల్లో వైకాపానే కేంద్రీకృత అవినీతికి పాల్పడుతుందని ఆరోపణలు వచ్చాయన్నారు.

ఈ విచ్చలవిడి అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైళ్లలో వేస్తున్నారని, ఎన్నికల్లో గెలిచేందుకు కూడా నకిలీ ఓటరు ఐడీ కార్డులు సృష్టించడం వైకాపా నాయకత్వానికే చెల్లిందన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో నకిలీ ఐడీలు సృష్టించేందుకు సహకరించిన ఉన్నతాధికారులు ఇప్పుడు జైల్లో ఉన్న సంగతిని పురందేశ్వరి గుర్తుచేశారు. పన్నుల భారాలు మోపి, ధరలు అదుపు చేయలేక ప్రజలను ఆర్ధిక సంక్షోభంలో నెట్టివేసిన వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించే అవకాశం ఇప్పుడు వచ్చిందన్నారు.

రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు ఉద్దేశించినదే ‘‘ప్రజాపోరు’’ కార్యక్రమంగా చెప్పారు. ఒకవైపు వైకాపా ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతిని ప్రజలకు వివరించడం ద్వారా వైకాపాను ఓడిరచడం…… మరోవైపు శ్రీనరేంద్రమోడీ సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రానికి అందించిన సంపూర్ణ సహకారం వివరించడం ద్వారా ప్రజల మద్దతును పొందాలనేది కార్యక్రమం లక్ష్యంగా చెప్పారు.

త్వరలో జరిగే ఎన్నికల్లో వైకాపాకు బుద్దిచెప్పేందుకు ఇదే మంచి అవకాశమని అన్నారు. అలాగే మూడోసారి కూడా భాజపానే కేంద్రంలో గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయని అందువల్ల రాష్ట్రంలో కూడా భాజపా ప్రభుత్వం ఉంటే డబులింజన్‌ సర్కార్‌ సౌలభ్యంతో రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రజలకు భాజపా దగ్గరయ్యేందుకు ప్రజాపోరు కార్యక్రమాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగించుకోవాలని నాయకులను కోరారు.

వైకాపా ఓటమి ఖాయం : విష్ణువర్ధన్‌రెడ్డి
ప్రజాపోరు కన్వీనరు, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ, ఈ నెలలో చేయబోయే ప్రజాపోరుతో వైకాపా ఓటమి ఖాయమైపోయిందన్నారు. ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వం పట్ల కనిపించే వ్యతిరేకతకు గతేడాది 15 రోజుల పాటు జిల్లా స్ధాయిలో చేసిన ప్రజాపోరు కార్యక్రమం ప్రభావం ఒక ప్రధాన కారణంగా చెప్పారు. . ఇప్పుడు అసెంబ్లీ స్ధాయిలో జరుగుతుందన్నారు.

నాయకుల ప్రసంగాలు, కరపత్రాల పంపిణి, డిజిటల్‌ మాధ్యమాల ప్రసారం ద్వారా ప్రచారం చేస్తామన్నారు. అసెంబ్లీకి ఒకటి చొప్పున 175 ప్రచార రధాలను కూడా ఈ కార్యక్రమం కోసం సిద్దం చేస్తున్నామన్నారు. 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో 50 మిని బహిరంగ సభలు జరుగుతాయని, పార్లమెంటు స్ధాయిలో ఒక భారీ బహిరంగసభ జరుగుతుందని, కేంద్రమంత్రులు, జాతీయ, రాష్ట్ర స్ధాయి నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. ప్రజలపై వేసిన పన్నుల భారాలు, ప్రభుత్వ అవినీతి, వనరుల దోపిడి, అభివృద్ధి లేమి, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, అన్ని వర్గాలను మోసం చేయడం, మహిళలకు వేధింపులు, ఆగిపోయిన అవస్ధాపన, స్తంభించిన పారిశ్రామిక రంగం, స్ధానిక సమస్యల ప్రస్తావన వంటి ప్రభుత్వ వైఫల్యాలపై నాయకులు విమర్శిస్తారని చెప్పారు. సమావేశంలో భాజపా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసవర్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరి లక్ష్మీ నారాయణ,జిల్లా ఇన్‌ఛార్జి, శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE