Suryaa.co.in

Telangana

కాంగ్రెస్‌, భారాస రెండూ కుటుంబ పార్టీలే

– ఆ రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే
– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

కాంగ్రెస్‌, భారాస రెండూ కుటుంబ పార్టీలేనని, ఆ రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటేనని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎవరు ఎవరికి ‘బీ టీమో’ అందరికీ తెలుసని అన్నారు. దిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ ఇవాళ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఇటీవల విపక్ష నేతలతోనూ అఖిలేశ్‌ భేటీ అయ్యారు. వీరిద్దరి తాజా భేటీ చూస్తే ఎవరు ఎవరికి బీ టీమో తెలుస్తుంది.’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌, భారాస గతంలో పొత్తులు పెట్టుకున్నాయని చెప్పిన కిషన్‌ రెడ్డి.. భాజపా మాత్రం భారాసతో కలిసి ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదని అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి నుంచి పారిపోయిన వ్యక్తి రాహుల్‌గాంధీ అని ఎద్దేవా చేశారు. భాజపాను విమర్శించే నైతిక అర్హత ఆయనకు లేదన్నారు.

భాజపాకి కాంగ్రెస్‌ ఎంత దూరమో.. భారాస కూడా అంతే దూరమని వ్యాఖ్యానించారు. ‘‘ మేం గతంలో భారసతో కలవలేదు.. భవిష్యత్‌లోనూ కలవబోము. కుటుంబపాలన, అవినీతిపై భాజపా పోరాటం కొనసాగుతుంది.’’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE