– పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తిరుపతి: చిత్తూరు జిల్లాలో 56వేల ఎకరాల్లో మామిడి సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లాలో మామిడి రైతులు కన్నీరు పెడుతున్నా, కూటమి ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మామిడి రైతుల గోడుపై ప్రభుత్వం తక్షణం స్పందించాలి. ఖచ్చితంగా కేజీ రూ.8 చొప్పున కొనుగోళ్ళు చేయించాలి. లేనిపక్షంలో రైతులతో కలిసి వైయస్ఆర్సీపీ ప్రత్యక్ష కార్యాచరణకు సిద్దమవుతుందని ఆయన హెచ్చరించారు. మామిడి రైతుకు న్యాయ జరిగే వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు.
చిత్తూరు జిల్లా మామిడికి కనీస గిట్టుబాటు రేటు కూడా దక్కకపోవడం, ఫ్యాక్టరీలు కొనుగోళ్ళు చేయకుండా రైతులను ఇబ్బందుల పాలు చేస్తుండటం, పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మామిడి దిగుమతులు జరిగిపోతున్నా ప్రభుత్వం నిద్రపోతోందా అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఒకవైపు చిత్తూరు జిల్లాకు చెందిన మామిడి రైతులు తమ పంటలను ట్రాక్టర్లో తీసుకువచ్చి ఫ్యాక్టరీల ముందు రోజుల తరబడి పడిగాపులు కాస్తుంటే, పొరుగు రాష్ట్రాల మామిడి లోడ్ వాహనాలు నేరుగా ఫ్యాక్టరీల్లోకి నేరుగా వెళ్ళిపోతున్నాయని అన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తోందా? అధికార యంత్రాంగాన్ని పనిచేయించుకోలేని అసమర్థ స్థితిలో ఉన్నారా అని నిలదీశారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్ట్లు ఏర్పాటు చేశామని చెబుతున్నారు, అలాంటప్పుడు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల వాహనాలు ఎలా ఏపీలోని ఫ్యాక్టరీలకు వస్తున్నాయి? కొందరు ఫ్యాక్టరీ నిర్వాహకులతో కూటమి నాయకులు కుమ్మకై, చిత్తూరు జిల్లా మామిడి రైతులను నాశనం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినట్లు ఎక్కడైనా కిలో మామిడి రూ.8 కి కొనుగోలు చేస్తున్నారా? నిరూపించే ధైర్యం కూటమి ప్రభుత్వానికి ఉందా? నేరుగా ఫ్యాక్టరీల వద్దకు వచ్చి, రోజుల తరబడి మామిడి పంటతో వేచి ఉన్న రైతులతో ఈ మాట చెప్పించగలరా? ఇంత దౌర్భగ్య పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. చిత్తూరు మామిడి రైతుల మీద ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష ఉందో అర్థం కావడం లేదని అన్నారు.
చిత్తూరు జిల్లాలో మామిడి ధరలు దారుణంగా పతనమయ్యాయి. ఇదే అదునుగా పల్ప్ ఫ్యాక్టరీలు, మామిడి వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారు. తోతాపురి రకం అమ్ముడుపోక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదుకోవాలంటూ రైతులు రోడెక్కారు, పలుచోట్ల ఆందోళనలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 56 వేల హెక్టార్లల్లో మామిడి సాగవుతోంది. ఇందులో తోతాపురి 39,895 హెక్టార్లు, నీలం 5,818, అల్పోన్సో 3,127, బేనీషా 3,895, మల్లిక 1,740 హెక్టార్లు, ఇతర రకాలు 1,526 హెక్టార్లలో సాగవుతోంది.
ఇప్పటికే మామిడి కోతలు పూర్తి చేసిన రైతులు పంట అమ్ముకునేందుకు చిత్తూరు, పలమనేరు, దామలచెరువు, బంగారుపాళ్యం ఇతరాత్ర మార్కెట్లకు తరలివస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా తోతాపురి రకం సాగవుతోంది. ఈ కాయలు 90శాతం దాకా పక్వానికి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 39,895 హెక్టార్లకు గాను 4,99,274 మెట్రిక్ టన్నుల దాకా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. టేబుల్ రకాలను మాత్రం రైతులు కోతకోసి మార్కెట్, ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు.
తోతాపురి పంటను ఫ్యాక్టరీలు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపడం లేదు. జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు దీనిపై ఆందోళనలు చేస్తూ రోడ్డెక్కారు. రైతుల ఆగ్రహం చూసిన కూటమి ప్రభుత్వం కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేయాలని ఫ్యాక్టరీలను ఆదేశించి చేతులు దులుపుకుంది. ప్రభుత్వం తరఫున కిలోకు రూ.4 చొప్పున్న ప్రోత్సాహక నిధి ఇస్తామని గొప్పగా ప్రకటించింది. ఎక్కడా ఇది అమలు జరగడం లేదు. కూటమి ప్రభుత్వానికి అమరావతి తప్ప చిత్తూరు జిల్లాలోని మామిడి రైతుల కష్టాలు కనిపించడం లేదు. మామిడి రైతులను ఆదుకునేందుకు వైయస్ఆర్సీపీ ముందుండి పోరాడుతుంది. ఈ ప్రభుత్వం మెడలు వంచి అయినా గిట్టుబాటు రేటుకు కొనుగోళ్ళు చేయించే వరకు పోరాడుతుందని శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.