Suryaa.co.in

Telangana

కరీంనగర్ జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం

– ఫలించిన బండి సంజయ్ కృషి
-దేశవ్యాప్తంగా 21 సైనిక్ స్కూళ్ల ఏర్పాటు
-హర్షం వ్యక్తం చేసిన బండి సంజయ్
-ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లకు ప్రత్యేక క్రుతజ్ఝతలు

కరీంనగర్ లో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ గత కొంత కాలంగా చేస్తున్న కృషి ఫలించింది. కరీంనగర్ జిల్లాలో సైనిక్ స్కూల్ ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను కేంద్ర రక్షణ శాఖ ఆమోదించింది. ఈ మేరకు కేంద్రం ప్రకటన విడుదల చేసింది.

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ లో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ ఇకపై కేంద్ర రక్షణ శాఖ పరిధిలోకి వెళ్లనుంది. సైనిక్ స్కూల్ లో అడ్మిషన్లు సహా స్కూల్ నిర్వహణ వ్యయాన్ని ఇకపై పూర్తిగా కేంద్రమే భరించనుంది.
ఆల్-ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఈ సైనిక్ స్కూల్ లో 6వ తరగతిలో ప్రవేశాలు కల్పించనున్నారు. దేశవ్యాప్తంగా 21 సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా… అందులో కరీంనగర్ ఒకటి కావడం గమనార్హం.

వాస్తవానికి కరీంనగర్ లో సైనిక్ స్కూల్ ను ఏర్పాట చేయాలని కోరుతూ బండి సంజయ్ గత కొంత కాలంగా కేంద్రాన్ని కోరుతూ వస్తున్నారు. ఈ మేరకు రక్షణశాఖ మంత్రితోపాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ ప్రతిపాదన పురోగతిపై పలుమార్లు కేంద్ర మంత్రితోపాటు ఉన్నతాధికారులను కలిసి చర్చించారు. బండి సంజయ్ చేసిన విజ్ఝప్తిపట్ల సానుకూలంగా స్పందించిన కేంద్రం తాజాగా కరీంనగర్ లోని చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ లో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు ఆమోదం తెలపడం విశేషం.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాకు సైనిక్ స్కూల్ ను ఏర్పాటు చేయడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ సహా రక్షణ శాఖ ఉన్నతాధికారులకు కృతజ్జతలు తెలిపారు. సైనిక్ స్కూల్ ఏర్పాటుతో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని, రక్షణ రంగంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE