Suryaa.co.in

Andhra Pradesh

ఈ-ఆఫీస్‌ లో అక్రమాలకు అవకాశం

-అప్‌గ్రేడ్‌ నిలిపివేతకు ఆదేశాలివ్వాలని వినతి
-గవర్నర్‌కు చంద్రబాబు లేఖ

రాష్ట్ర ప్రభుత్వ ఈ` ఆఫీస్‌ అప్‌గ్రేడ్‌ వ్యవహారం నిలిపివేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గురువారం గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు లేఖ రాశారు. ఈ నెల 17 నుంచి 25 వరకు అప్‌గ్రేడ్‌ పేరుతో ఈ-ఆఫీస్‌ మూసివేతపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. కొద్దిరోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ-ఆఫీస్‌ అప్‌గ్రేడ్‌ చేయాల్సిన అవసరం లేదన్నారు. పారదర్శకత పాటించని ఈ ప్రభుత్వంలో ఈ-ఆఫీస్‌ వ్యవహారంలో కూడా అక్రమాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం షెడ్యూల్‌ చేసిన ఈ-ఆఫీస్‌ వెర్షన్‌ అప్‌గ్రేడ్‌ వల్ల సీఎంవో, చీఫ్‌ సెక్రటరీ, ప్రభుత్వ విభా గాల సేవలకు సంబంధించి అందుబాటులో ఉండవని వివరించారు.

ఐదేళ్లలో ప్రభుత్వం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలకు సంబంధించిన జీవోలను కూడా ప్రభుత్వం వెబ్‌సైట్‌ లో పెట్టడకుండా రహస్యంగా ఉంచుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న ఈ సమయంలో ఈ-ఆఫీస్‌ వెర్షన్‌ మార్పు నిర్ణయం, ఈ ఆఫీస్‌ మూసివేత, అప్‌గ్రేడ్‌ ప్రక్రియను కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టేదాకా నిలిపివేయాలని సీఎస్‌ను ఆదేశించా లని కోరారు. ఇప్పటికే పలు కీలకమైన రికార్డులు మాయమైనట్లు తెలిసింది. కొద్దిరోజుల క్రితం నిబంధనలకు విరుద్ధంగా పలు రికార్డులను సీఐడీ కూడా అనుమతి లేకుండా కాల్చేసింది. ప్రభుత్వ రికార్డుల మాయం, కాల్చివేతపై సీఈఓకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఈ నేపథ్యంలో అన్ని ఫైళ్లు, నోట్‌ ఫైళ్లు, రికార్డులు మాయం కాకుండా భద్రపరచాలి. అన్ని హెచ్‌ఓడీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఇప్పటికే సీసీ కెమెరాలు ఉన్న చోట పరిశీలన జరపాలి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉన్న ఫిజికల్‌ డాక్యుమెంట్లు, డిజిటల్‌ డాక్యుమెంట్లు భద్రపరిచేలా చీఫ్‌ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు.

LEAVE A RESPONSE