చంద్రబాబు కుప్పం సభలో స్వల్ప ఉద్రిక్తత
కుప్పం: రాష్ట్రాన్ని పాలించే అర్హత వైసీపీ ప్రభుత్వానికి లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా కుప్పం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడారు.
‘‘విశాఖ ఏజెన్సీలో 25వేల ఎకరాల్లో గంజాయి పండిస్తున్నారు. రూ.8వేల కోట్ల విలువైన గంజాయి సరఫరా చేస్తున్నారు. చర్యలు తీసుకోమని కోరితే తెదేపా కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. అక్రమ కేసులు పెడుతున్నారు. దిల్లీలో రాష్ట్రపతిని కలిసి రాష్ట్ర పరిస్థితులు వివరించాం. రాష్ట్రంలో ప్రభుత్వ ఉగ్రవాదం ఉందని రాష్ట్రపతికి తెలిపా. తెదేపా కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారు. డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్న తెదేపా కార్యాలయంపై దాడులు చేయిస్తున్నారు. నాపై బాంబులు వేస్తామని అంటున్నారు. బాంబులకు భయపడే వ్యక్తిని కాదు. అక్రమ కేసులకు భయపడి పార్టీ మూసేయాలా? పేదల కోసం ధర్మపోరాటం చేస్తున్న నన్ను ప్రజలే కాపాడుకుంటారు. రాష్ట్రంలో వింత వింత మద్యం బ్రాండ్లు తెచ్చారు. నాసిరకం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం హామీ ఇచ్చారు. కరోనా సమయంలో కూడా మద్యం షాపులు తెరిచారు. జగన్ అధికారంలోకి వచ్చాక కొత్తరకం మద్యం బ్రాండ్లు తెచ్చి.. రేట్లు విపరీతంగా పెంచేశారు’’ అని చంద్రబాబు విమర్శించారు.
చంద్రబాబు సభలో అలజడి
కుప్పం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి బహిరంగసభ వద్దకు చేరుకుని కలకలం రేపాడు. తెదేపా కార్యకర్తలు అతన్ని పట్టుకున్నారు. బాంబు తెచ్చాడంటూ అనుమానం వ్యక్తం చేయడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు భద్రతా సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు తెరిచి ఆయనకు రక్షణగా నిలిచారు. వైకాపా గూండాయిజం నశించాలి, సీఎం డౌన్ డౌన్ అంటూ తెదేపా శ్రేణులు నినాదాలు చేశారు.
కుప్పంలో రౌడీలు, గూండాలు ప్రవేశించారు
‘‘బాబాయిని చంపినోడు భయపడాలి కానీ, మనమెందుకు భయపడతాం. కోడి కత్తి కేసు ఏమైంది. తప్పుడు ప్రచారం వాళ్లు చేసుకున్నారు.. మనం కాదు. తెదేపా మరోసారి అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి రాగానే కమిషన్ వేస్తాం. తప్పు చేసిన వారిని శిక్షించే వరకు వదిలిపెట్టను. న్యాయానికి తల ఒగ్గుతాం.. దుర్మార్గానికి గుండె చూపుతాం. మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిని అణచివేశా. తెదేపా కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులు పెట్టారు. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా క్షోభపెట్టారు. పోలీసులను ఉసిగొల్పుతూ తప్పుడు కేసులు పెడుతున్నారు. తీవ్రవాదులు, ముఠా నాయకులకు భయపడలేదు. డబ్బు సంచులతో కుప్పం వస్తున్నారు. కుప్పంలోకి రౌడీలు, గూండాలు ప్రవేశించారు’’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.