Suryaa.co.in

Andhra Pradesh

విజయవంతంగా ముగిసిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భేటీ

-గెలుపే ప్రాతిపదికగా రానున్న ఎన్నికల్లో పోటీకి నిర్ణయం
-యువ గళం ముగింపు సభలో పాల్గొని ప్రజలంతా, ఈ ప్రభుత్వం పై తమకున్న ఆగ్రహాన్ని తెలియజేయాలి
-ఇలాంటి ఉడత ఊపులకు, తొకడ కేసులకు భయపడే వనిత కాదు… సునీత
-అధికారంలోకి రాగానే టి డి ఆర్ బాండ్లను రద్దు చేస్తాం
-రానున్న ఎన్నికల్లో 30 స్థానాలకు మించి వైకాపా గెలిచే పరిస్థితి లేదని ఐ బి నివేదిక ద్వారా స్పష్టం
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

గెలుపే ప్రాతిపదికన రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు ఏ స్థానం నుంచి పోటీ చేయాలన్న దానిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసంలో ఆయన తో తెదేపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించారు. ఇద్దరి మధ్యలో చర్చలు ఫలప్రదంగా ముగిశాయని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామ కృష్ణంరాజు తెలియజేశారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… గతంలో తన ఇంటికి వచ్చి పరామర్శించిన పవన్ కళ్యాణ్ ను ఆయనే ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు పలకరించారు.

చంద్రబాబు నాయుడుకు సతీసమేతంగా గుమ్మం వద్దే పవన్ కళ్యాణ్ దంపతులు స్వాగతం పలికారు. రాజకీయంగా శత్రువును కూకటి వేళ్లతో పెకిలించాలనుకుంటే వ్యూహం అన్నది ఉండాలి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. తాజాగా తమ కిం కర్తవ్యం ఏమిటి అని రెండు పార్టీల అగ్ర నాయకులు చర్చించారు. రాష్ట్రంలో ప్రజలకు ప్రశాంతత చేకూరాలంటే, రెండు పార్టీలకు చెందిన అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేసుకొని, ఏ పార్టీకి చెందిన అభ్యర్థి ఏ స్థానం నుంచి పోటీ చేయాలని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

ఇరువురి మధ్యల జరిగిన సమావేశం విజయవంతంగా ముగియడం పట్ల రఘురామకృష్ణం రాజు హర్షం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ తాను ముందే ఒప్పుకున్న సినిమాల షూటింగ్ పూర్తి చేయడానికి యువ గళం ముగింపు సభకు హాజరు కాబోరని తెలిసి, సాక్షి దినపత్రిక యాజమాన్యం సంబరాలు చేసుకుంది. కానీ మూడు లక్షల మంది జనం హాజరయ్యే వేదికను సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో, తాను ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ పక్కన పెట్టి, సభకు హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. దీనితో వైకాపా నాయకులు, సాక్షి దినపత్రిక ప్యాకేజ్ కుదిరిందని వార్తలు రాయడం హాస్యాస్పదంగా ఉంది.. ఎవరినైనా ప్యాకేజీ తో కొనగలిగే ఆర్థిక సామర్థ్యం ప్రభుత్వ పెద్దల వద్దే ఉందని గతంలో చెప్పాను. పవన్ కళ్యాణ్ ప్యాకేజీలకు అమ్ముడుపోయే వనస్తత్వం కాదని.. ప్రజల కోసం పాటుపడే మనస్తత్వం అని స్పష్టం చేశారు.

ప్రజా సమస్యలను ఆకలింపు చేసుకున్న నారా లోకేష్
యువ గళం పాదయాత్రలో దినదిన ప్రవర్ధమానంగా నాయకుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ప్రజా సమస్యలను ఆకలింపు చేసుకోవడంలో సక్సెస్ అయ్యారని రఘురామకృష్ణం రాజు అన్నారు. తొలుత మందకోడిగా సాగిన యువ గళం పాదయాత్రను సాక్షి యాజమాన్యం హేళన చేసింది. అయినా ఆయన పట్టుదలతో ప్రజలతో మమేకమయ్యారు. బహిరంగ సభలో కాకుండానే, వివిధ వర్గాల వారితో ప్రత్యేకంగా సమావేశాలను నిర్వహించారు. వారి సమస్యల గురించి ప్రత్యేకంగా చర్చించారు. అధికారంలోకి వస్తే ఏమి చేయగలమో,ఏమి చేస్తామో ప్రజలకు స్పష్టంగా వివరించారు. రాయలసీమ ప్రాంతంలో పరిమిత నీటి వనరులు ఉన్నచోట ఆ నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ… తుంపర సేద్యాన్ని ప్రోత్సహిస్తామని రైతులకు చెప్పారు.

గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుంపర సేద్యాన్ని ప్రోత్సహించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా ప్రభుత్వం తుంపర సేద్యాన్ని మటాష్ చేసింది. పామాయిల్ రైతులతో కూడా నారా లోకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిద్ధార్థుడు ప్రజల్లోకి వెళ్లి బుద్ధుడైనట్లుగా, యువ గళం పాదయాత్రకు ముందు నారా లోకేష్ వేరు, యువ గళం పాదయాత్ర అనంతరం నాయకుడిగా నారా లోకేష్ వేరని రఘురామకృష్ణం రాజు అన్నారు. యువ గళం పాదయాత్ర ముగింపు సభ అద్భుతంగా జరుగుతుందన్న ఆశా భావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా, రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా యువగళం ముగింపు సభకు హాజరు కాలేకపోతున్నానని చెప్పారు. రానున్న ఎన్నికలకు ముందుగా జరగనున్న ఈ సభకు ఎన్నికల సంగ్రామ శంఖారావం సభగా నామకరణం చేయాలని సూచించారు. విజయనగరం జిల్లాలోని, విశాఖపట్నం సరిహద్దుల్లో జరగనున్న యువ గళం సభ కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకావాలని కోరారు.

రెండేళ్ల క్రితం పులివెందుల మెజిస్ట్రేట్ కోర్టు లో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా అభియోగాలను ఎదుర్కొంటున్న శివ శంకర్ రెడ్డి సతీమణి తులసమ్మ, వివేకానంద రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా సిబిఐ అధికారి రామ్ సింగ్ తో పాటు, డాక్టర్ వైయస్ సునీతారెడ్డి ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి లు తమను మానసికంగా వేధిస్తున్నారని, వారిపై కేసులు నమోదు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ ఆరోపణలు బోగస్ అని భావించిన అప్పటి మెజిస్ట్రేట్ పవన్ పరిగణలోకి తీసుకోలేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో సంబంధం లేకపోయినప్పటికీ మహాభారతాన్ని విదురుడు చూసినట్లుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హత్య జరిగిన విధానాన్ని మీడియాకు కళ్ళకు కట్టినట్టు గా వివరించారు.

అయితే ఇన్చార్జి మెజిస్ట్రేట్ గా బాధ్యతలను స్వీకరించిన భార్గవి గతంలో కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తక్షణమే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా జనవరి 4వ తేదీ లోగా తనకు నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు. ఈ కేసుల నమోదు వల్ల పెద్దగా వచ్చే నష్టమేమీ లేదు. మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పుపై బాధితులు హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. హైకోర్టులో తప్పక న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు. గతంలో సిబిఐ అధికారి రామ్ సింగ్ పై కేసు నమోదు చేశారు. తన తండ్రిని హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న డాక్టర్ సునీత పై ఈ తరహా తోకడా కేసులతో ఆమె ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయ లేరు.

సీబీఐ అధికారి రామ్ సింగ్ పై అక్రమంగా కేసులు నమోదు చేశారు. నాపై అక్రమంగా కేసు నమోదు చేసి లాకప్ లో చిత్రహింసలకు గురి చేశారు. ఇదే విషయాన్ని నేను కోర్టు దృష్టికి తీసుకు వెళ్లాను. సుప్రీంకోర్టులో ఏడాదిన్నర తర్వాత, హైకోర్టును ఆశ్రయించమని సూచించారు. హైకోర్టులో ప్రభుత్వం తరఫున ఎప్పుడు ఎవరో ఒకరు వచ్చి వాయిదాలను కోరుతుంటారు. రానున్న మూడు నెలల పాటు కూడా కోర్టులో కేసు విచారణకు వచ్చే అవకాశాలు లేవని తెలుసు. జగన్మోహన్ రెడ్డి అండ్ సునీల్ కో కోర్టు క్రాఫ్ట్ లు తెలియనివి కావు. మే నేలాఖ రు నాటికి జూన్ పూర్తయ్యే నాటికి కచ్చితంగా దోషులను న్యాయపరంగా శిక్షించి తీరుతామని చెప్పారు.

దసపల్లా హిల్స్ లో 2000 కోట్ల రూపాయల టిడిఆర్ బాండ్లు త్వరలో జారీ
దసపల్లా హిల్స్ లో 40 అడుగుల రోడ్లను 100 అడుగుల రోడ్లు విస్తరిస్తామనే ప్రతిపాదనతో, రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోతున్న వారికి వెయ్యికోట్ల రూపాయల టిడిఆర్ బాండ్ల ను జారీ చేయనున్నారు. దసపల్లా హిల్స్ లో బ్రిటిష్ కాలంలో నిర్మించిన సర్క్యూట్ హౌస్, రెండు పెద్ద వాటర్ ట్యాంకర్లకు ప్రభుత్వ స్థలంలో నిర్మించిన వేనని భావించారు. కానీ అవి దసపల్ల రాణి ప్రైవేటు భూములుగా పేర్కొంటూ, వాటికి కూడా టి డి ఆర్ బాండ్లను జారీ చేయనున్నారు. వైకాపా నెగ్గే వరకు దసపల్లా భూములు నిషేధిత భూముల జాబితాలో ఉండేవి. కోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పి, ఏనాడు కోర్టు తీర్పును గౌరవించని వైకాపా ప్రభుత్వం… దసపల్లా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించింది.

100 అడుగుల రోడ్డు విస్తరణవల్ల హై రైస్ బిల్డింగులు అనుమతులు పొందే అవకాశం లభిస్తుంది. 40 అడుగుల రోడ్లు ఉంటే, కేవలం 5 అంతస్తుల వరకే అనుమతి లభిస్తుంది. అదే 100 అడుగుల రోడ్డు ఉంటే, 20 అంతస్తుల హై రైజ్ బిల్డింగులు నిర్మించుకునే వెసులుబాటు లభించనుంది. ఎటువంటి పెట్టుబడి లేకుండానే, నిర్మాణాలు చేపట్టవచ్చనేది పాలెగాళ్ల పథకమై ఉండవచ్చు. విశాఖపట్నంలో ప్రభుత్వ ఆగడాలను ప్రశ్నిస్తున్న కార్పొరేటర్ మూర్తి యాదవ్ ను రఘు రామ కృష్ణంరాజు అభినందించారు. ఇటువంటి జనసైనికుడికి మరింత ఉన్నత పదవి లభిస్తే, ప్రజలకు మరింత న్యాయం జరుగుతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న టిడిఆర్ బాండ్లను అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు. 30 స్థానాలకు మించి గెలిచే అవకాశం లేదని ఇంటలిజెన్స్ బ్యూరో నివేదిక ద్వారా వెల్లడయ్యింది. అంగన్వాడి, హోంగార్డులకు తెలంగాణ రాష్ట్రం తో సమానంగా జీతాలు చెల్లిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని మండిపడ్డారు.

LEAVE A RESPONSE