Suryaa.co.in

Andhra Pradesh

విశాఖ ఉక్కుకు భూములు బదలాయించం

రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి సేకరించిన భూములను ఆ కర్మాగారానికి బదలీ చేసే ప్రతిపాదన ఏదీ లేదని ఉక్కు శాఖ మంత్రి ఫగన్‌ సింగ్‌ కులస్తే స్పష్టం చేశారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సిపి సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు.

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం సేకరించిన భూములను ఆ ప్లాంట్‌కు బదలాయించడం ద్వారా దాని ఆస్తుల విలువను, రుణ శక్తిని పెంపొందించడానికి అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం అందుకు నిరాకరించడానికి కారణాలు ఏమిటి…అంటూ శ్రీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దీనికి మంత్రి వివరణ ఇస్తూ విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌) ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం భూములను సేకరించి అప్పగించింది. తదనంతరం ఆ భూములపై సర్వహక్కులను కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు బదలాయించడం జరిగింది.

స్టీల్‌ ప్రాజెక్ట్‌ కోసం ఆ భూములను వినియోగించుకోవడానికి వీలుగా ఉక్కు మంత్రిత్వ శాఖ ఆర్‌ఐఎన్‌ఎల్‌కు పవర్‌ ఆఫ్‌ అటార్నీ జారీ చేసింది. అందువలన ఆ భూములపై యాజమాన్య హక్కులను ఆర్‌ఐఎన్‌ఎల్‌కు బదిలీ చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని మంత్రి స్పష్టం చేశారు.రౌర్కెలా స్టీల్‌ ప్లాంట్‌ మినహా స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) దేశంలోని వివిధ ప్రాంతాలలో నెలకొల్పిన స్టీల్‌ ప్లాంట్ల భూములపై సర్వహక్కులు ఆయా ప్లాంట్ల పేరిట దఖలు పడి ఉన్నట్లు ఉక్కు శాఖ మంత్రి తెలిపారు. భిలాయ్‌ స్టీల్‌ ప్లాంట్‌, బొకారో స్టీల్‌ ప్లాంట్‌, దుర్గాపూర్‌ స్టీల్‌ ప్లాంట్‌, ఇస్కో స్టీల్‌ ప్లాంట్‌, సేలం స్టీల్‌ ప్లాంట్‌ అలాయ్‌ స్టీల్‌ ప్లాంట్‌, విశ్వేశ్వరయ ఐరన్‌, స్టీల్‌ ప్లాంట్‌లు నెలకొల్పిన భూములకు ఆయా ప్లాంట్‌లే యాజమాన్య హక్కులు కలిగి ఉన్నాయి. రౌర్కెలా స్టీల్‌ ప్లాంట్‌ భూములు మాత్రం లీజు పద్దతిలో కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.

గ్లోబల్ బయోఫ్యూయల్స్ కూటమిలో 22 దేశాలు
బయోఫ్యూయల్స్ (జీవ ఇంధనాలు) వినియోగం, అభివృద్ధిని వేగవంతం చేసే ప్రక్రియలో ప్రపంచ దేశాల సహకారాన్ని బలోపేతం చేసే దిశగా భారత్ చొరవతో ప్రారంభమైన గ్లోబల్ బయోఫ్యూయల్స్ కూటమిలో చేరిన దేశాల సంఖ్య 22కు పెరిగింది. అలాగే 12 అంతర్జాతీయ సంస్థలు ఈ కూటమిలో సభ్యత్వం పొందినట్లు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ పేర్కొన్నారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన జీ 20 సమ్మిట్లో 19 దేశాలు, 12 అంతర్జాతీయ సంస్థల సహకారంతో గ్లోబల్ బయోఫ్యూయల్స్ కూటమిని ప్రారంభించినట్లు తెలిపారు. కూటమి ప్రారంభించినప్పటి నుంచి సభ్యత్వ దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని చెప్పారు.

స్టేక్‌హోల్డర్స్ విస్తృత భాగస్వామ్యంతో బయోఫ్యూయల్స్‌కు సంబంధించి కెపాసిటీ బిల్డింగ్ సన్నాహాలను సులభతరం చేయడం, జాతీయ కార్యక్రమాలు, పాలసీ-పాఠాలు పంచుకోవడానికి సాంకేతిక సహాయం అందించడం, సాంకేతికత పురోగతి, స్థిరమైన జీవ ఇంధనాల వాడకాన్ని విస్త్రతం చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా జీవ ఇంధన వాడకాన్ని వేగవంతం చేయాలని గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్ భావిస్తోందని మంత్రి వివరించారు. అలాగే బయోఫ్యూయల్స్ నైపుణ్య కేంద్రంగా విజ్ఞానాన్ని అందించేందుకు జీబీఏ (గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్) కేంద్ర బిందువుగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు తెలిపారు.

భారతదేశ చొరవతో ప్రారంభమైన జీబీఏను ముందుకు తీసుకెళ్లేందుకు ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫోరం ఫర్ ప్రాస్పరిటీ (ఐపీఈఎఫ్) మలేషియా రౌండ్‌లో ఇండియా బయోఫ్యూయల్‌ కోపరేటివ్ వర్క్ ప్రోగ్రాంను ప్రతిపాదించినట్లు మంత్రి తెలిపారు.

ఆసక్తి కలిగిన ఐపీఈఎఫ్ సభ్యులను ప్రోత్సహించడం, జీవ ఇంధన ఉత్పత్తికి సంబంధించి అత్యంత సమర్థవంతమైన పద్ధతులు అభివృద్ధి చేయడం, బయోఫ్యూయల్ వర్తకంలో సప్లైచైన్స్‌ను గుర్తించడం, ప్రాంతీయ ఫీడ్ స్టాక్ ఏర్పాటు, కోపరేటివ్ వర్క్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఐపీఈఎఫ్ దేశాల నుండి వనరులు, నైపుణ్యాలను సమీకరించడం ద్వారా జీవ ఇంధన రంగంలో స్థిరమైన, వినూత్నమైన పరిష్కారాలను అభివృద్ధి చేయడం సిడబ్య్లూపి (కోలేబోరేటివ్ వర్క్ ప్రోగ్రాం) ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. దీనికి అందనంగా జాయింట్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్, పైలట్ ప్రాజెక్ట్‌లు, నాలెడ్జ్ షేరింగ్, కెపాసిటీ బిల్డింగ్‌ ద్వారా క్లీన్ ఎనర్జీ రంగంలో కోలాబోరేటివ్ వెంచర్స్ ద్వారా సాంకేతిక బదిలీలో ఇండియా విజేతగా నిలుస్తోందని మంత్రి తెలిపారు.

LEAVE A RESPONSE