Suryaa.co.in

Andhra Pradesh

దేశంలోనే ఏపీలో డ్వాక్రా సంఘాలను చంద్రబాబు నెం.1గా నిలిపారు

-ఆవకాయ పెట్టాలన్నా, అంతరిక్షానికి వెళ్లాలన్నా మహిళకే సాధ్యం!
-ప్రజలందరి ఆశీస్సులతో నిండు నూరేళ్లూ చంద్రబాబు సేవలు
-మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించిన మహనీయుడు ఎన్టీఆర్
-తాడేపల్లి స్త్రీశక్తి, మహిళామిత్ర, డ్వాక్రా మహిళలతో నారా బ్రాహ్మణి

తాడేపల్లి: ఆవకాయ పట్టాలన్నా, అంతరిక్షానికి వెళ్లాలన్నా మహిళలకే సాధ్యం, మహిళలంటే మహాశక్తి…నేడు ఆకాశమే హద్దుగా అన్నిరంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారని శ్రీమతి నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి గౌడ కళ్యాణమండపంలో స్త్రీశక్తి లబ్ధిదారులు, మహిళామిత్ర, డ్వాక్రా మహిళలతో ఆమె సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ…. ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమానహక్కు, స్థానిక సంస్థల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించారు, మహిళా యూనివర్సిటీ స్థాపించింది కూడా ఎన్టీఆరే. ఎన్టీఆర్ కు కొనసాగింపుగా చంద్రబాబు, లోకేష్ లు మహిళల సాధికారితకు కృషిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు దేశం మొత్తమ్మీద ఎపిలో డ్వాక్రా సంఘాలను నెం.1గా నిలిపారు. మహిళలకు విద్యాసంస్థల్లో రిజర్వేషన్ కల్పించారు, దీపం పథకం కింద మహిళలకు వంటకష్టాలు తీర్చారు. మీ అందరి ఆశీస్సులతో చంద్రబాబు గారు నిండునూరేళ్లూ రాష్ట్రప్రజలకు సేవలందిస్తారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళల స్వయం ఉపాధికి సహకారం అందిస్తున్నారు.

చంద్రబాబు, లోకేష్ లు మహిళా సాధికారితకు మాటల్లో కాకుండా చేతల్లో చేయూతనిస్తున్నారు. అందుకు నేనే ఉదాహరణ. వివాహమయ్యాక వారి ప్రోత్సహంతోనే నేను యుఎస్, సింగపూర్ వెళ్లి ఉన్నత చదువులు చదివాను. వారి సహకారంతోనే హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా వ్యాపారాన్ని చూసుకోవడమేగాక బసవతారకం క్యాన్సర్ సెంటర్ ద్వారా సేవలందిస్తున్నా. హెరిటేజ్ ద్వారా మహిళా రైతులను పోత్సహించడంతో వారి ఆదాయం పెరిగి కుటుంబాలకు అండగా నిలుస్తున్నాం.
మంగళగిరి ప్రజలే కుటుంబంలా లోకేష్ సేవలు
గత ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్ ఓడిపోయినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని సేవలందిస్తున్నారు. మంగళగిరి ప్రజలను తన కుటుంబసభ్యుల్లా భావిస్తూ సొంత నిధులతో 29 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.

మంగళగిరిని దేశంలో నెం.1గా చేయాలన్న లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. అన్నాక్యాంటీన్లు, పెళ్లికానుక, సంజీవని ఆరోగ్యరథాల వంటి కార్యక్రమాల ద్వారా సేవ చేస్తున్నారు. స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మహిళల స్వావలంబనకు చేయూతనిస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 32 బ్యాచ్ లుగా 1600 మంది కుట్టుశిక్షణ ఇచ్చి మహిళలకు మెషీన్లు కూడా అందజేశాం. వారి ఆదాయం పెంపుదలకు అధునాతన డిజైన్లలో తర్ఫీదు ఇచ్చి మార్కెట్ లింకేజి చేశాం. ప్రతిపక్షంలో ఉండే ఇంత చేస్తున్నారంటే ఎమ్మెల్యేగా ఎన్నికైతే లోకేష్ ఎంత సేవచేస్తారో మహిళలంతా ఆలోచించాలి. మహిళలకు అన్నిరంగాల్లో అత్యధిక ప్రాధాన్యతనిచ్చేది తెలుగుదేశం. గత అయిదేళ్లుగా రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలతో సామాన్యులు బతుకుబండి లాగడం కష్టంగా మారింది. పేదలను కష్టాలనుంచి గట్టెక్కించేందుకే చంద్రబాబునాయడు సూపర్ -6 హామీలు ఇచ్చారు. మహిళల ఉన్నత చదువుల కోసం వడ్డీలేని రుణాలు అందించే కలలకు రెక్కలు పథకాన్ని కూడా ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో మంగళగిరిలో నారా లోకేష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని బ్రాహ్మణి విజ్ఞప్తిచేశారు.

స్త్రీశక్తి సేవలు అభినందనీయం: పెమ్మసాని శ్రీరత్న
గుంటూరు ఎంపి పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి డాక్టర్ శ్రీరత్న మాట్లాడుతూ… మంగళగిరిలో మహిళల స్వావలంబనకు స్త్రీశక్తి పథకం ద్వారా నారా లోకేష్, బ్రాహ్మణి అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పర్యటిస్తున్నపుడు కుటుంబంలో ఇంటిపెద్ద సంపాదనపై అయిదారుగురు ఆధారపడి జీవించడం చూశాను. అటువంటి కుటుంబాల్లో మహిళలకు స్త్రీశక్తి వంటి పథకాలు ఎంతో ఆలంబనగా నిలుస్తాయి. రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం ఏర్పాటైతే ఇటువంటి కార్యక్రమాన్ని రాష్ట్రమంతా అమలుచేయడానికి ఆస్కారమేర్పడుతుంది. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగకుండా కూటమి అభ్యర్థులుగా పోటీచేస్తున్న చంద్రశేఖర్, లోకేష్ లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి, అప్పుడే భారీఎత్తున అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని చెప్పారు.

స్త్రీశక్తి ద్వారా కుటుంబాలకు చేదోడుగా నిలుస్తున్నాం
ఈ సమావేశంలో పలువురు స్త్రీశక్తి లబ్ధిదారులు నారా బ్రాహ్మణి ఎదుట తమ మనోభావాలను తెలియజేశారు. అనూష అనే మహిళ మాట్లాడుతూ… పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో కుటుంబాలను భారంగా లాగుతున్న సమయంలో స్త్రీశక్తి పథకం మాకు ఎంతగానో ఉపకరించింది. ఈ పథకం ద్వారా కుట్టుశిక్షణ పొంది ఆదాయం పొందుతూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నామని అన్నారు. జాహెదా మాట్లాడుతూ..నేను డిగ్రీ చదివి, ట్యూషన్స్ నడుపుకుంటున్నా. ఆ ఆదాయం సరిపోక స్త్రీశక్తి ద్వారా మిషన్ నేర్చుకుంటున్నా, చాలా బాగా శిక్షణ ఇచ్చారు. స్టిచ్చింగ్ నేర్చుకోవడం వల్ల నాకు అదనపు ఆదాయం సమకూరుతోందని ఆనందం వ్యక్తంచేసింది. మరికొందరు లబ్ధిదారులు మాట్లాడుతూ… చదువులేని మహిళలు కూడా నైపుణ్యంతో స్వయం ఉపాధి పొందేందుకు స్త్రీశక్తి పథకం ప్లాట్ ఫాంలా ఉపయోగపడుతోంది. కేవలం ఉపాధి శిక్షణ ఇవ్వడమేగాక తమ కుటుంబాల్లో ఆరోగ్య సమస్యలు ఎదురైన వారికి సంజీవని ఆరోగ్యరథాల ద్వారా సేవలందిస్తున్నారు. తమకు అండగా నిలుస్తున్న నారా లోకేష్ ను పోరాడి గెలిపించుకుంటామని చెప్పారు.

నారా బ్రాహ్మణి స్పందిస్తూ… స్త్రీశక్తి మహిళలు సాధించిన విజయాలు తమకు స్పూర్తిదాయకమని అన్నారు. మా బట్టలు కూడా స్త్రీశక్తి మహిళలకే ఇవ్వాలని అనుకుంటున్నాం. మీరు కొత్త డిజైన్లలో చేస్తున్న స్టిచ్చింగ్ నాకు ఎంతోనచ్చింది. మీరు ఇంతలా అభివృద్ధి సాధించడం సంతోషంగా ఉందని అన్నారు. ఇక్కడి మహిళలు మరింత మెరుగైన ఆదాయం పొందేందుకు రాబోయే ఎన్నికల్లో నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ లను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని బ్రాహ్మణి కోరారు.

LEAVE A RESPONSE