Suryaa.co.in

Andhra Pradesh

నవశకానికి నాంది పలికేలా చిలకలూరిపేట సభ

-రాతియుగం నుండి రాష్ట్రాన్ని స్వర్ణయుగం వైపు నడిపించేందుకే మూడు పార్టీల పొత్తు
-2014 ఎన్నికల ఫలితాన్ని తిరగరాసేలా ఏపీలో మళ్లీ ప్రభంజనం
-రేపు ఉదయం 9.30 గంటలకు బొప్పూడిలో భూమిపూజ
-టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
-17వ తేదీ సభపై కమిటీ సభ్యులతో లోకేష్ సమావేశం

అమరావతి : నవశకానికి నాంది పలికేలా ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేటలో సభ జరగనుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రాతియుగం నుండి రాష్ట్రాన్ని స్వర్ణయుగం వైపు నడిపించేందుకే మూడు పార్టీల పొత్తు అని వివరించారు. 2014 ఎన్నికల ఫలితాన్ని తిరగరాసేలా ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో మళ్లీ ప్రభంజనం సృష్టించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.

వైసీపీ పాలనలో విధ్వంసం అయిన రాష్ట్రాన్ని కాపాడుకునేందకు చేతులు కలిపిన మూడు పార్టీల పొత్తును ప్రజలు ఆహ్వానిస్తున్నారని అన్నారు. చిలకలూరిపేట సభను మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో నేతలతో 13 ముఖ్య సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీల సభ్యులతో మంగళవారం లోకేశ్, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, బీజేపీ, జనసేన ముఖ్యనేతలు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ….రేపు ఉదయం 9.30 గంటలకు బొప్పూడిలో భూమి పూజ జరుగుతుందన్నారు. ఎన్డీయేలో టీడీపీ చేరిన తర్వాత ఇది తొలి సభ అని, సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేద్దామన్నారు. సభకు లక్షలాది మంది తరలివస్తారని, చరిత్రలో నిలిచేలా సభను నిర్వహిద్దామన్నారు. కమిటీల ప్రకారం ఇచ్చిన బాధ్యతలను ప్రతి ఒక్కరూ సక్రమంగా నిర్వర్తించి సభ విజయానికి కృషి చేయాలన్నారు.

మూడు పార్టీల పొత్తు, అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏం చేయబోతున్నామనేదానిపై సభా వేదిక ద్వారా పార్టీ అగ్రనేతలు ప్రజలకు వివరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మూడు పార్టీల నేతలు, కమిటీల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE