Suryaa.co.in

Andhra Pradesh

తొలకరి నాటికి మరమ్మతులు పూర్తి చేయండి

* అధికారులకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆదేశం
* ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి సీతంపేట కాలువ సైఫన్ మరమ్మతు పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్

దెందులూరు : కాలువల మరమ్మతుల పనులు తొలకరి నాటికి పూర్తి చేయాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. దెందులూరులో రూ.77.45 లక్షల వ్యయంతో చేపట్టిన సీతంపేట కాలువ సైఫన్ మరమ్మతు పనులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి బుధవారం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శంకుస్థాపన చేశారు. కాలువ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ సీతంపేట కాలువపై సైఫన్ మరమ్మతులతో ఈ ప్రాంత ప్రజల దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించిందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దెందులూరు నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎనలేని కృషి చేస్తున్నారని ఎంపీ ప్రశంసించారు. ప్రాధాన్యత క్రమంలో ఆయా సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధుల మంజూరుకు తనవంతు కృషి చేస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వాన్ని, కొందరు కావాలనే సామాజిక మాధ్యమాల్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంపీ మహేష్ కుమార్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.

అనంతరం స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు దెందులూరు సమీపంలో నిరుపయోగంగా ఉన్న రైల్వే లోలెవెల్ బ్రిడ్జిని ఎంపీ, ఎమ్మెల్యే పరిశీలించారు. వర్షాకాలంలో వరద నీరు పోటెత్తి సందర్భాల్లో రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఎంపీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE