– ఎక్స్ వేదికగా రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
హైదరాబాద్: కొండనాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడింది అన్నట్టు-సన్నబియ్యం కోసం చూస్తే దొడ్డుబియ్యం కూడా ఇయ్యలే. రైతుల నుండి సన్నాలు కొన్నది లేదు-సన్నాలకు బోనస్ రూ.500 ధర ఇచ్చింది లేదు. మార్చి నుండి పేదలకు సన్నబియ్యం అని ప్రకటనలు.. పదో తేదీ దాటినా పేదలకు రేషన్ బియ్యం కూడా ఇవ్వని అసమర్థ ప్రభుత్వం.
గురుకులాల్లో విద్యార్థులకు బుక్కెడు బువ్వ పెట్టని కాంగ్రెస్ సర్కార్.. సామాన్యులకు రేషన్ బియ్యం అందించడంలో నిర్లక్ష్యం. లక్ష 54 వేల మెట్రిక్ టన్నులకు గాను రేషన్ దుకాణాలకు కేవలం 62 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేసి చేతులు దులుపుకున్న ఇందిరమ్మ ప్రభుత్వం. కొత్త ఏడాది ఉగాదికి సన్నబియ్యం అని సన్నాయి నొక్కులు నొక్కి ఉన్న బియ్యం ఊడబీకిన కాంగ్రెస్ ప్రభుత్వం.
ప్రజాపాలన అంటే పస్తులేనా ? ఇందిరమ్మ రాజ్యం అంటే రేషన్ బియ్యం ఎగ్గొట్టుడేనా ? రైతులకు రుణమాఫీ కట్. రైతులకు రైతుభరోసా కట్. రైతులకు రైతుబీమా కట్. ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్ కట్. గర్భవతులకు న్యూట్రిషన్ కిట్ కట్. విద్యార్థినులకు హెల్త్ కిట్, ఎలక్ట్రిక్ స్కూటీ కట్. మహిళలకు నెలకు రూ.2500 మహాలక్ష్మి కట్. ఆఖరికి పేదలకు రేషన్ బియ్యం కట్. కాంగ్రెస్ అంటే కటింగ్. కాంగ్రెస్ అంటే కన్నింగ్.