పన్ను ఎగవేత కేసులో ‘గాలి’పై క్రిమినల్ కేసు

బెంగళూరు : ఇనుప ఖనిజం అక్రమ మైనింగ్తో పాటు ప్రభుత్వానికి పన్ను ఎగవేత కేసులో బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయమని అధికారులను ఆదేశించింది. ఇనుప ఖనిజం అక్రమ మైనింగ్తో పాటు ప్రభుత్వానికి రాయల్టీ, ఇతర పన్నులు చెల్లించలేదనే ఆరోపణలపై కేసు నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారి దాఖలు చేసిన వ్యక్తిగత క్రిమినల్ ఫిర్యాదు ఆధారంగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జే ప్రీత్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ కోర్టు ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసులను విచారిస్తుంది.

జనార్దన్ రెడ్డి, ఆయన పీఏ మెహఫూజ్ అలీ ఖాన్, ఓబులాపురం మైనింగ్ కంపెనీ అండ్ మినరల్స్లో భాగస్వామిగా ఉన్న బీవీ శ్రీనివాస రెడ్డిపై సంబంధిత సెక్షన్ల ఆధారంగా కేసులు నమోదు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి 2009లో ఆదాయపన్ను శాఖ అధికారులు గాలి జనార్దన్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

వీటిలో ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు.గాలి జనార్దన్ రెడ్డి.. ప్రభుత్వ అనుమతి లేకుండా వేల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని విక్రయించారని ఆరోపణలు వచ్చాయి.

Leave a Reply