– ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాం
– నిత్యం అప్రమత్తంగా ఉన్నాం
– జిల్లా కలెక్టర్ షణ్మోహన్
కాకినాడ : మొంథా తుపాను నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ .. జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్, ఎంపీ సానా సతీష్ బాబు, కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఇతర అధికారులతో కలిసి కాకినాడ పట్టణం ఏటిమొగ, దుమ్ములుపేట, పర్లోవపేట ఏఎంజీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం, తాళ్ళరేవు మండలం గాడిమొగ ఇతర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు.
పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించి, భోజన పదార్థాలను ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎంపీ, ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం పట్టణం దుమ్ములుపేట తుపాను ప్రభావిత ప్రాంత ప్రజల కోసం పర్లోవపేట ఏఎంజీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ప్రజలకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందు మాధవ్, ఎంపీ సానా సతీష్ బాబు, కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు స్వయంగా మధ్యాహ్నం భోజనం వడ్డించారు. అనంతరం కాకినాడ జిల్లా తాళ్ళరేవు గాడిమొగ ధీరుబాయ్ అంబానీ కమ్యూనిటీ హాలులో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రంలోని ఏర్పాట్లను పరిశీలించి, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు భోజన పదార్థాలు వడ్డించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో 18 మండలాల్లో 67 గ్రామాలు, 5 పట్టణ ప్రాంతాల్లో తుపాను ప్రభావం ఉందన్నారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసేమన్నారు. జిల్లా వ్యాప్తంగా 401 పునరావాస కేంద్రాలు సిద్ధం చేయగా, ఇప్పటికే 76 కేంద్రాలు ప్రారంభించామన్నారు. కాకినాడలో 16 పునరావాస కేంద్రాల్లోకి లోతట్టు ప్రాంత ప్రజలను తరలించామని తెలిపారు. జిల్లా అధికారయంత్రాంగం పునరావస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశారని, అధికారులతో సహకరించి, ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
పునరావాస కేంద్రాల్లోని ప్రజలు ఇబ్బందులు పడకుండా నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని సకాలంలో అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నుంచి అధిక వర్షాలు, అధిక వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు పునరావాస కేంద్రాలను విడిచి వెళ్ళరాదన్నారు. తీరం సమీపిస్తున్న కొద్ది తుపాను తీవ్రత అధికంగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో ప్రజలేవరు బయటకు రావద్దని జిల్లా సూచించారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ కమిషనర్ కెపీ సుధాకర్, జిల్లా కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, కాకినాడ అర్బన్ తహశీల్దార్ వి.జితేంద్ర, తాళ్ళరేవు తహసీల్దార్ పి.త్రీనాథ్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు