Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ పాలనలో రాష్ట్రంలో విష ఘడియలు

  • ఎటు చూసినా దోపిడీలు, కుంభకోణాలు
  • నరేంద్ర మోదీ ముందుండి నడిపితేనే ఈ దోపిడీలు ఆగుతాయి
  • వికసిత్ భారత్ కలలో ఐదు కోట్ల ఆంధ్రులు భాగస్వాములవుతాం
  • రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వస్తుంది
  • వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొడుతుంది
  • రాజమండ్రి ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచార సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  నాయకత్వంలో భారత దేశం మొత్తం అమృత ఘడియలు కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలనలో విష ఘడియలు సాగుతున్నాయి. రాష్ట్రంలో ఎటు చూసినా ఇసుక, మట్టి దోపిడీ, స్కాములే కనిపిస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూటమిని ముందుండి నడిపిస్తే తప్ప ఈ దోపిడీలు ఆగవు. వికసిత్ భారత్ కలలో ఐదు కోట్ల మంది ఆంధ్రులు నిస్వార్ధంగా మీ వెంట నడుస్తామని చెప్పిన వెంటనే ఆశీస్సులు అందచేసిన మోదీకి యావత్ ఆంధ్ర ప్రజానీకం తరఫున నమస్కారాలు. రాష్ట్రంలో విష ఘడియల్ని అమృత ఘడియల వైపు తీసుకువెళ్ళేందుకు సంసిద్ధులయ్యారు’ అని జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ తెలియచేసారు. సోమవారం మధ్యాహ్నం రాజమండ్రిలో నిర్వహించిన ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “భారత దేశ సమాజానికి అభివృద్ధితో పాటు గుండె ధైర్యం ప్రధాన మంత్రి మోదీ . శత్రు దేశాల మీద పోరాడగలిగే శక్తి, ముందుకొస్తుంటే నిలువరించే శక్తి ఇచ్చారు. కశ్మీర్ భారత దేశంలో అంతర్భాగం అంటూ ఆర్టికల్ 370ని రద్దు చేసిన బలమైన నాయకులు. దశాబ్ద కాలంలో దేశం వైపు ఒక్క ఉగ్రవాది కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితి తీసుకువచ్చారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యావత్ భారత దేశాన్ని ప్రపంచ చిత్ర పటంలో సగర్వంగా నిలబెట్టిన వ్యక్తి మోదీ . గుంటూరు శేషేంద్ర కవిత చుదువుంటే నాకు మోదీ గుర్తుకు వస్తారు. మోదీ  గొంతెత్తితే ప్రతి భారతీయుడి వెన్ను కదులుతుంది.

కేంద్ర పథకాలకు రాష్ట్ర పథకాలుగా ప్రచారం
సంక్షేమ, అభివృద్ధి, ప్రతి ఒక్కరికి ఉపాధి, పరిశ్రమలు, సాగునీరు, తాగునీరు దేశ ప్రజలకు కేంద్రం సగర్వంగా అందిస్తోంది. ఓ వైపు మోదీ అన్నీ ఇస్తుంటే  ప్రధాన మంత్రి  చేస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ పథకాలుగా ప్రచారం చేసుకుంటోంది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకాన్ని వైఎస్సార్ బీమా పథకంగా మార్చి ప్రీమియం చెల్లించకుండా రైతుల్ని ముంచారు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదు. కిసాన్ సమ్మాన్ నిధి నుంచి కేంద్రం నిధులు విడుదల చేసినా రైతుల్ని నష్టపరిచారు. ప్రధాన మంత్రి కేంద్రం నుంచి చిన్న బిడ్డలకు మధ్యాహ్నం ఉచిత భోజనం ఇస్తుంటే దాన్ని వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద మార్చుకున్నారు. మిషన్ వాత్సాలయ, శక్తి పథకాలను జగనన్న గోరుముద్ద, జగనన్న పాలు అంటూ రాష్ట్ర పథకాలుగా మార్చుకున్నారు. జగన్ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను ఇళ్లకు మళ్లించడంతోపాటు పేదల గృహ నిర్మాణానికి కేంద్రం ఇస్తున్న రూ. లక్షా 80 వేలతో ఇళ్లు కట్టించి జగనన్న కాలనీలుగా పేరు పెట్టుకున్నారు. మోదీ  నాయకత్వంలో దేశ వ్యాప్తంగా రోజుకి 38 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మితం అవుతున్నాయి. రాష్ట్రంలో లక్షలాది మంది యువత ఉన్నారు. అణువణువునా దేశ భక్తిని నింపుకున్న జాతి మనది. మాలో ప్రతి ఒక్కరిలో జాతీయోధ్యమ స్ఫూర్తి ఉంది. టీడీపీ, జనసేన కూటమి మీతో కలసి వికసిత్ భారత్ వైపు అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ఎక్కడెక్కడి కళాకారుల్ని.. శాస్త్రవేత్తలు.. సమాజ సేవకుల్ని గుర్తించారు
భారత దేశంలో పద్మ అవార్డులను కూడా రాజకీయం చేసేవారు.  మోదీ ఎవరూ గుర్తించని గొప్ప వ్యక్తులను పరిచయం చేశారు. విమాన ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయి స్వదేశంలో సేవలు అందిస్తున్న డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ ని గుర్తించారు. 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఏటికొప్పాక బొమ్మల కళని ముందుకు తీసుకువెళ్తున్న సీవీ రాజుని గుర్తించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న 33 ఆర్కిడ్స్ జాతులను ప్రపంచానికి తెలియచేసిన శాస్త్రవేత్త అబ్బారెడ్డి నాగేశ్వరరావుకి పద్మ శ్రీ ఇచ్చారు. హరికథ కళాకారులు సచ్చిదానంద శాస్త్రిని, తొలుబొమ్మలాట కళాకారులు దళువాయి చలపతిరావుని మోదీ గుర్తించారు. పోలియో వ్యాధిగ్రస్తులకు 10 లక్షలకు పైగా ఆపరేషన్లు చేసిన డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణని, స్థపతి వేలు ఆనందాచారి, కిన్నెర మొగిలయ్య లాంటి ఎక్కడెక్కడో ఉన్న కళాకారులను, వైద్యులను గుర్తించి దక్షిణ భారత దేశానికి 135 పద్మ అవార్డులు ఇచ్చిన నాయకులు మోదీ .

మేమంతా మీ వెన్నంటే ఉంటాం
మోదీ రాక ముందు దేశం మొత్తం మీద 100 స్టార్టప్ లు ఉంటే, పదేళ్లలో లక్షా 17 వేల స్టార్టప్ లు మొదలయ్యాయి. అందరి సహకారంతో అందర్నీ కలుపుకుని ముందుకు వెళ్తున్న మోదీ నాయకత్వం దేశంలో ఉంటే, ఐదు కోట్ల ఆంధ్రుల్ని హింసిస్తున్న జగన్ నాయకత్వాన్ని రాష్ట్రం నుంచి పారదోలేందుకు మీ ఆశీస్సులు కావాలి అని అడిగిన వెంటనే అంగీకరించినందుకు మరోసారి ధన్యవాదాలు. 400 పార్లమెంటు స్థానాలు సాధించాలన్నది ప్రధాన మంత్రి మోదీ కల. 100 మందిని ఇస్తే దేశాన్ని మార్చేస్తాను అన్న స్వామి వివేకానంద స్ఫూర్తితో దేశం కోసం ఎవరో ఒకరు వస్తారని కలలు కనే వాడిని. ఇన్నాళ్లకు మోదీ వచ్చారు. ఒక్కరుగా వచ్చి భారత దేశపు శక్తిని ప్రపంచ చరిత్ర పుటల్లోకి తీసుకువచ్చారు. ప్రపంచంలో 10 వ ఆర్ధిక శక్తిగా ఉన్న దేశాన్ని 5వ స్థానానికి తీసుకువచ్చారు. ముచ్చటగా మూడో సారి ప్రధాని కాబోతున్న  మోదీ దేశాన్ని మూడో ఆర్ధిక శక్తిగా మార్చబోతున్నారు. భారత దేశాన్ని సూపర్ పవర్ గా, ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా చేయడానికి మేమంతా ఆయన వెన్నంటి నడుస్తాం. కూటమి ప్రభుత్వం వస్తుంది. వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొడుతుంది. కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం” అన్నారు.

వికసిత్ భారత్ మోదీ కల.. వికసిత్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు , పవన్ కళ్యాణ్ కల : నారా లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ.. “దేశానికి మోదీ అవసరం ఉంది. దేశం దశా దిశ మార్చిన పదం నమో నమో నమో. తెలుగు జాతి పౌరుషాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటితే, భారత దేశ పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం వ్యక్తి మోదీ . మోదీ రు అంటే ప్రైడ్ ఆఫ్ ఇండియా, మేకర్ ఆఫ్ మోడ్రన్ ఇండియా. దేశానికి ఏం కావాలో మోదీ కి తెలుసు. పేదరికం లేని భారతదేశం మోదీ  కల. సంక్షేమం అమలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పేదరికం లేని భారత దేశాన్ని తీర్చిదిద్దుతున్నారు. వికసిత్ భారత్ మోదీ కల.. వికసిత్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ కల. విభజన అనంతరం లోటు బడ్జెట్ అధిగమించి రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి చేపట్టాం. అమరావతి నిర్మాణం చేపట్టాం. ఒకే రాజధాని… అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా అడుగులు వేశాం.  మోదీ  సహకారంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలు తీసుకువచ్చాం. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ నినాదంతో ప్రజలు మోసపోయారు. ప్రపంచం మొత్తం దేశం వైపు చూస్తుంటే., మన ముఖ్యమంత్రి సౌతాఫ్రికాను ఆదర్శంగా తీసుకున్నారు. కూర్చున్న కొమ్మని నరుక్కున్నారు.

వైసీపీ పాలనలో మొదటి బాధితులు యువత. రాష్ట్రం నుంచి పరిశ్రమల్ని తరిమేశారు. కేంద్రం రైల్వే జోన్ ప్రకటిస్తే అవసరం అయిన భూమి ఇవ్వలేదు. మంగళగిరి ఎయిమ్స్ కి నీరు కూడా ఇవ్వలేదు. మోసానికి ఫ్యాంటు, షర్టు వేస్తే ముఖ్యమంత్రిలా ఉంటుంది. ప్రజలని రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజాగళం ఏర్పడింది. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మొదటి అడుగు వేసిన నాయకుడు పవనన్న, ప్రజల తరఫున ప్రశ్నిస్తోంది, పోరాడుతుంది మన పవనన్న. మోదీ  స్ఫూర్తితో కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి అనే జోడెద్దుల బండిని ముందుకు తీసుకువెళ్తాం” అన్నారు.

ప్రజా కంటకుల్ని గద్దె దించేందుకే కూటమి : దగ్గుబాటి పురంధేశ్వరి
బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. “దుష్ట పాలన అంతానికి, ప్రజా కంటకుల్ని గద్దె దించడానికి నడుబిగించి బీజేపీ, జనసేన, టీడీపీలు కలసి ముందుకు వచ్చాయి. ఈ కలయికలో మోదీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్ కళ్యాణ్ శక్తి ఉన్నాయి. గత ఐదేళ్లలో వైసీపీ పేదల నడ్డి విరిచింది. ఏ వర్గానికి న్యాయం చేయని పాలనని రాష్ట్రంలో చూశాం. ఆ దుష్టపాలనను అంతం చేయడానికే మూడు పార్టీలు ఒకే ఆలోచనా విధానంతో ముందుకు వచ్చాయి. ప్రజల ఇబ్బందులు, కడగండ్లు దూరం చేసేందుకు, సుపరిపాలన అందించేందుకు ఈ కలయిక దోహదపడుతుంది. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన చూడాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలి” అన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీల నుంచి పోటీ చేస్తున్న కూటమి అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులు, మూడు పార్టీల నేతలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE