Suryaa.co.in

Andhra Pradesh

విద్యుత్‌ రంగానికి చీకటి రోజులు

– చంద్రబాబు హయాంలో వెలుగులు ఉండవు
– ఛార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు ప్రచారం
– కానీ ప్రజలపై ఇప్పటికే రూ.15,485 కోట్ల భారం
– ట్రూఅప్‌ ఛార్జీలు రద్దు చేస్తామని చెప్పి వంచించారు
– మరోవైపు ‘టైమ్‌ ఆఫ్‌ ది డే’ పేరుతో అదనపు వడ్డన
– ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ ఫైర్‌

తాడేపల్లి: రాష్ట్రంలో విద్యుత్‌ రంగానికి ఇప్పుడు చీకటి రోజులు అని, చంద్రబాబు హయాంలో ఎప్పుడూ వెలుగులు అనేవి ఉండవని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ తేల్చి చెప్పారు. చంద్రబాబు పేరు వినగానే ఎవరికైనా గుర్రాలతో తొక్కించడం, తుపాకులతో కాల్చడం వంటివి గుర్తొస్తాయని ఆయన తెలిపారు.

అధికారంలోకి వస్తే విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని, ట్రూఅప్‌ ఛార్జీలు కూడా రద్దు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన చంద్రబాబు, ఇప్పటికే ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల రూపంలో రూ.15 వేల కోట్లకు పైగా భారం మోపారని ఆక్షేపించారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికే విద్యుత్‌ ఛార్జీలు 50 శాతం పెరిగాయని తెలిపారు. చంద్రబాబు పాలనలో ఎప్పుడూ డిస్కమ్‌లు నష్టాలబారిన పడతాయని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అరుణ్‌కుమార్‌ గుర్తు చేశారు.

‘టైమ్‌ ఆఫ్‌ది డే’ పేరుతో మోసం:
విద్యుత్‌ సర్దుబాటు ఛార్జీలు, ‘టైమ్‌ ఆఫ్‌ ది డే’ పేరుతో వినియోగదారుడికి తెలియకుండా దొడ్డిదారిన బిల్లులు వసూలు చేస్తున్నారు. సా. 6 నుంచి రాత్రి 10 గం. వరకు ఒక రేటు, మిగిలిన సమయంలో మరో రేటుతో వినియోగదారులపై ఛార్జీల భారం మోపుతున్నారు. అలా ప్రతి యూనిట్‌పై దాదాపు 40 పైసల భారం వేస్తున్నారు.

ఇక చిరు వ్యాపారుల పరిస్థితి మరీ ఘోరం. వారిపై ట్రూఅప్‌ ఛార్జీలతో పాటు, ‘టైం ఆఫ్‌ ది డే’ పేరుతో ప్రతి యూనిట్‌పై 6 పైసల నుంచి రూపాయి వరకు అదనపు భారం పడుతోంది.

అలా సర్దుబాటు ఛార్జీలు, ‘టైం ఆఫ్‌ ది డే’ పేరుతో సుమారు రూ.4వేల కోట్లు విద్యుత్‌ వినియోగదారుల నుంచి రాబట్టాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన. అయితే అది నేరుగా వేస్తే, గుర్తిస్తారు కాబట్టి, బిల్లుని ముక్కలుముక్కలుగా చేసి వాయిదా పద్థతిలో రాబట్టేలా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు.

చంద్రబాబు పాలనలో డిస్కమ్‌ల కష్టాలు
చంద్రబాబు ఎప్పుడు సీఎంగా ఉన్న విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కమ్‌)కు కష్టాలే. రాష్ట్ర విభజన తర్వాత 2014లో చంద్రబాబు సీఎం అయ్యే నాటికి డిస్కంలకు రూ.29 వేల కోట్ల బకాయిలు ఉంటే, 2019లో ఆయన దిగిపోయే నాటికి డిస్కమ్‌ల బకాయిలు రూ.86 వేల కోట్లకు చేరాయి. 2019లో జగన్‌గారు సీఎం అయ్యాక, రైతుల విద్యుత్‌కు సంబంధించి టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిపోయిన రూ.8,845 కోట్ల బకాయిలు చెల్లించింది. మరోవైపు డిస్కమ్‌లకు మా ప్రభుత్వం బాసటగా నిల్చింది. టీడీపీ ప్రభుత్వంలో డిస్కంలకు కేవలం రూ.13 వేల కోట్ల మేర సాయం చేస్తే, జగన్‌గారి పాలనలో దాదాపు రూ.47 వేల కోట్లు సాయం చేయడం జరిగింది.

LEAVE A RESPONSE