ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడించండి!

– “జగన్ ఓడితేనే – మన మనుగడ”
– “సర్పంచుల సమర శంఖారావం” మలిదశ ఉద్యమం
– ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్.
– సర్పంచులకు, ఎంపీటీసీలకు,కౌన్సిలర్ కు, కార్పోరేటర్స్ కు రాజేంద్రప్రసాద్, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు పిలుపు

విశాఖపట్నం: ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ… గ్రామ వాలంటీర్లను, గ్రామ సచివాలయాలను 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టంలోని ఆర్టికల్ 243 జి 11 వ షెడ్యూల్లో పేర్కొన్న ప్రకారం గ్రామపంచాయతీలలో విలీనం చేసి, సర్పంచుల ఆధ్వర్యంలోనే అన్ని రకాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

అలాగే చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ శక్తులుగా మా సర్పంచులకు పోటీగా – సమాంతరంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులైన గృహ సారధులను, సచివాలయ కన్వీనర్ల వ్యవస్థను తక్షణమే రద్దు చేయవలసినదిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

అలాగే 2 నెలల్లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ- పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక సంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా “ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, వైయస్సార్సీపి పార్టీని ఓడించడానికి తీవ్రంగా కృషి చేయాలని – రాష్ట్రంలోని అన్ని పార్టీలకు వైయస్సార్సీపి, బిజెపి, టిడిపి, జనసేన,సిపిఎం, సిపిఐ లకు చెందిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీ లకు, జడ్పిటిసి లకు, కౌన్సిలర్ కు, కార్పొరేటర్స్ కు రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు.

అలాగే “ఇది చాలా తీవ్రమైన నిర్ణయం అని మాకు తెలుసు కానీ మాకు మరో దారి లేక ఈ తీవ్ర నిర్ణయాన్ని తీసుకున్నాము. రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు మా నిధులు, అధికారాలను, విధులను దొంగిలించి వేసినారు. అవి తిరిగి ఇవ్వమని రాజకీయాలకు అతీతంగా, రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని పార్టీల వైయస్సార్సీపి, టిడిపి, బిజెపి, జనసేన, సిపిఐ, సిపిఎం చివరకు అధికార పార్టీ వైఎస్ఆర్సిపి తో సహా మొదలగు పార్టీలకు చెందిన సర్పంచులు,ఎంపీటీసీలు,ఎంపీపీలు, జడ్పిటిసిలు, కౌన్సిలర్స్,కార్పొరేటర్స్ గత మూడు సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు, ఆందోళనలు, పోరాటాలు చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి , రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు” అని రాజేంద్రప్రసాద్ విమర్శించారు.

12,918 గ్రామాలలోని 3 కోట్ల 50 లక్షల మంది గ్రామీణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని. మేము స్థానిక ప్రజాప్రతినిధులం ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయి, అసమర్థులుగా, చేతకాన్ని వాళ్ళలా మా గ్రామాల ప్రజల చేత తీవ్ర నిందలు పడ్డాము. కానీ తప్పు మాది కాదు – జగన్ ది” అని రాజేంద్రప్రసాద్ అన్నారు

” అందుకే మళ్లీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పల్లెలు శిధిలమైపోయి, గ్రామీణ ప్రజలు నాశనమైపోతారని, స్థానిక ప్రజా ప్రతినిధులు అన్యాయమైపోతారని, అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి తగిన బుద్ధి చెప్పడానికి, గ్రామీణ ప్రజలకు తగిన న్యాయం చేయడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ కఠిన నిర్ణయం ఈరోజున తీసుకోవడం జరిగిందని” రాజేంద్రప్రసాద్ చెప్పారు.

వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు మాట్లాడుతూ… ” రెండు నెలల్లో జరగబోయే ఏపీ అసెంబ్లీ- పార్లమెంట్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ని, అధికార వైయస్సార్సీపి ప్రభుత్వాన్ని ఓడించడానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన ముఖ్యంగా అధికార పార్టీ అయిన వైయస్సార్సీపి పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు,జడ్పీటీసీలు,కౌన్సిలర్స్,కార్పొరేటర్స్ తీవ్రంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మన గ్రామాల, పట్టణ ప్రజలకు జగన్ చేస్తున్న అన్యాయాన్ని సాక్షాదారాలతో సహా వివరించి చెప్పి జగన్ కి వ్యతిరేకంగా మన ప్రజలతో ఓటు వేయించి ఓడించాలని “జగన్ ఓడితేనే – మన మనుగడ” అనే నినాదంతో అన్ని పార్టీల సర్పంచులు, ఎంపీటీసీలు,ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ ఈ రెండు నెలలు చిత్తశుద్ధితో పట్టుదలగా తమ తమ గ్రామాలలో, పట్టణాలలో పనిచేయాలని” లక్ష్మీ ముత్యాలరావు అన్నారు.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు చుక్క ధనుంజయ్ యాదవ్, పంచాయితీ రాజ్ ఛాంబర్ సీనియర్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వై. వినోద్ రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతకాయల ముత్యాలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply