Suryaa.co.in

Andhra Pradesh Telangana

బీసీలకు జగన్‌ రెడ్డి అన్యాయం చేస్తే… రేవంత్ న్యాయం చేస్తారు

-బీసీల సమస్యను ఇన్నాళ్లు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడం దురదృష్టకరం
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ కులాలుగా గుర్తింపు పొందిన 26 కులాలను , రాష్ట్ర విభజన అనంతరం గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించినప్పటికీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్లు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు విమర్శించారు. రాబోయే రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్న శెట్టిబలిజ, తూర్పు కాపులు, కొప్పుల వెలమ, ఈడిగ కులాల తోపాటు , ఇతర కులాల వారిని గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ జాబితాలో నుంచి తొలగించింది. నా బీసీలు, నా ఎస్సీలు అని చెప్పుకోవడం మినహా జగన్మోహన్ రెడ్డి వారికి చేసిందేమీ లేదన్నారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆస్తులను పప్పు బెల్లాలు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జగన్మోహన్ రెడ్డి అప్పగించారు సరే… ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్న 26 బీసీ కులాలను, కేసీఆర్ ప్రభుత్వం బీసీ జాబితాలో నుంచి తొలగిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.

ఖాళీగా కూర్చుని గడ్డి తింటున్నారా?, గాడిద పళ్ళు తోముతున్నారా అంటూ ఫైర్ అయ్యారు. కొప్పుల వెలమలు ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే కాకుండా, ఉభయగోదావరి జిల్లాలతో పాటు, కృష్ణాజిల్లాలోనూ కూడా అధికంగా ఉన్నారు. గోదావరి జిల్లాలలో సర్దార్ పాపారాయుడు, తెదేపా నేత ఎర్రం నాయుడు విగ్రహాలు మనకు కనిపిస్తాయి. శెట్టి బలిజ, గౌడ, ఈడిగ, శ్రీశైశయన కులాలకు చెందినవారు గీత పని వృత్తిగా జీవిస్తుంటారు. వీరంతా ఒకే సామాజిక వర్గం అయినప్పటికీ, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. తెలంగాణ ప్రాంతంలో గౌడ పేరుతో, ఆంధ్రాలో శెట్టి బలిజ, ఈడిగ, శ్రీశైశయన, గౌడ పేర్లతో పిలుస్తారని, రాష్ట్రంలోనూ గౌడ కులస్తులు బీసీ జాబితాలోనే కొనసాగుతున్నారని తెలిపారు.

ఆంధ్ర మూలాలు ఉన్న 26 కులాలను బీసీ జాబితాలో నుంచి తొలగించడం వల్ల, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగం, వ్యాపార రీత్యా హైదరాబాద్ , తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో స్థిరపడిన లక్షలాదిమందికి తీరని అన్యాయం జరుగుతోందని రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గీత పనివారలు ఎక్కడ ఉన్నా వారిని బీసీలు గానే గుర్తించారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో కూడా గీత పని వృత్తిపై ఆధారపడిన గౌడ కులస్తులను బీసీలుగా గుర్తించారని కానీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే శెట్టి బలిజలను ఓసి జాబితాలో చేర్చారన్నారు. దీనివల్ల శెట్టి బలిజల పిల్లలు ఉద్యోగ,ఉపాధి, విద్యా అవకాశాలలో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని నేను తప్పు పట్టడం లేదు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదో అర్థం కావడం లేదన్నారు . పైగా జగన్మోహన్ రెడ్డి బీసీ పక్షపాతి అని ఎద్దేవా చేశారు. ఆంధ్ర మూలాలు ఉన్న 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించి ఓసి జాబితాలో చేర్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి స్పందించి, వారిని తిరిగి బీసీ కులాల జాబితాలో చేర్చాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరి ఉంటే బాగుండేది అన్నారు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను కలిసి ఇదే అంశంపై చర్చించడానికి 9 ఏళ్లుగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదని శెట్టిబలిజ కుల సంఘ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే 26 కులాలను బీసీ జాబితాలో చేరుస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం హామీ ఇచ్చింది. నర్సాపురం నియోజకవర్గ పరిధిలో శెట్టిబలిజలు, తూర్పు కాపులు, కొప్పుల వెలుమలు, ఈడిగ కులస్తులు అధిక సంఖ్యలో ఉంటారని, ప్రతి కుటుంబానికి హైదరాబాదులో బంధువులు ఉన్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

శెట్టి బలిజ కులస్తుల ప్రతినిధి బృందం నన్ను కలిసిన వెంటనే వారిని తీసుకొని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారిని సోమవారం ఉదయం కలిసి ఈ సమస్యపై మాట్లాడడం జరిగిందన్నారు. ఈ సమస్యను మా ఎజెండాలో కూడా పెట్టామని పేర్కొన్న వేం నరేందర్ రెడ్డి గారు , రెండు, మూడు నెలల వ్యవధిలో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా చెప్పి వదిలేసే వ్యక్తి వేం నరేందర్ రెడ్డి గారు కాదు. ఈ విషయం 10 గంటల వ్యవధిలోనే తెలిసిపోయింది. ఈ అంశంపై వెంటనే ఆయన సంబంధిత ప్రిన్సిపల్ సెక్రెటరీ తో మాట్లాడడమే కాకుండా, బీసీ కమిషన్ కు రిపోర్టు పంపించి, వాయువేగంతో సమస్య పరిష్కారానికి కృషి చేసేందుకు చర్యలు చేపట్టారన్నారు.

తెలంగాణలో స్థిరపడిన శెట్టిబలిజలు, తూర్పు కాపులు, కొప్పుల వెలుమలు, గౌర కులస్తుల తో పాటు, ఇతర కులాల వారికి తెలంగాణ గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని, రికార్డు సమయంలో ప్రస్తుత ప్రభుత్వం సరి చేస్తుందన్న ఆశాభావాన్ని రఘురామ కృష్ణంరాజు వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు బిజెపి నాయకత్వం కూడా హామీ ఇచ్చినప్పటికీ,ఆ పార్టీ అధికారంలోకి రాలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి మినహా అందరి కృషి ఫలితంగా రాబోయే వంద రోజుల్లో ఈ సమస్య కు పరిష్కారం దొరుకుతుందన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలుగా గుర్తించబడిన వారు, గత తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఓసీలుగా పరిగణించిన వారిని తిరిగి బీసీల జాబితాలో చేర్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వారికి న్యాయం చేస్తుందన్నారు. ఈ ప్రక్రియలో ఒక కేటలిస్టు పాత్ర వహించడం నా బాధ్యత. ఎందుకంటే, నర్సాపురం నియోజకవర్గంలో పాటు చుట్టుపక్కాల నియోజకవర్గాలలో పెద్ద సంఖ్యలో శెట్టిబలిజ, తూర్పు కాపులు, కొప్పుల వెలమలు, ఈడిగ కులాలకు చెందిన వారితో పాటు ఇతర కులాల వారు ఉన్నారన్నారు.

ఏసీఏను ప్రక్షాళన చేయండి
దేశానికి టెస్ట్ క్రికెట్లో ప్రాతినిధ్యం వహించిన హనుమ విహారి ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ గా తప్పించాలని తిరుపతి పట్టణానికి చెందిన ఒక కార్పోరేటర్ చేసిన ఒత్తిడితో దిక్కుమాలిన రాజకీయాలకు ఆయన బలయ్యారని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఆంధ్ర రంజీ జట్టులో 17వ ఆటగాడిగా తిరుపతి పట్టణానికి చెందిన ఒక కార్పొరేటర్ కుమారుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు .

17వ ఆటగాడు డ్రెస్సింగ్ రూమ్ లోకి సాధారణంగా వెళ్లరు. అయితే ఆంధ్ర రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్ తనయుడు ఏకంగా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లడంతో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న హనుమ విహారి మందలించినట్లు తెలిసింది. దీనితో, కార్పొరేటర్ తనయుడు అలిగి తండ్రికి ఫిర్యాదు చేయడంతో, కాపు కులానికి చెందిన హనుమ విహారిని కెప్టెన్ గా తప్పించాలని సదరు కార్పొరేటర్ ఒత్తిడితో, తిరుపతికి చెందిన ఇద్దరు కీలక నేతల ప్రమేయంతో హనుమ విహారిని కెప్టెన్ గా తప్పించారు.

ఆడుదాం ఆంధ్ర పేరిట రాష్ట్రవ్యాప్తంగా క్రీడలను నిర్వహిస్తున్నామని చెప్పి, వారిని వీరిని తీసుకువచ్చి ఆటలు నేర్పిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం, దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాడి పట్ల ఇంత అవమానకరంగా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ( ఏసీఏ) ను ఎందుకు మందలించలేదని ప్రశ్నించారు. ఏసీ ఏ అధ్యక్షుడిగా శరత్ చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడిగా రోహిత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గోపీనాథ్ రెడ్డి లు కొనసాగుతున్నారు. ఈ ముగ్గురు కూడా విజయసాయిరెడ్డి సన్నిహితులే. వీరెవరికి క్రికెట్ ఆడడం రాదు… చూడడం తప్ప అని రఘు రామ కృష్ణం రాజు అపహాస్యం చేశారు.

క్రికెట్ ఆడడం వచ్చిన ఇతర కులాల వారు లేరా అన్న ఆయన, ఆట ఆడడం రాకుండా చూసే రెడ్లు మాత్రమే కావాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీఏను తక్షణమే ప్రక్షాళన చేసి నిజమైన ఆటగాళ్లతో కార్యవర్గం ఏర్పాటు చేయాలన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని సిన్సియర్ గా చేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వ పెద్దలు, జగన్మోహన్ రెడ్డి బ్యాట్ పట్టాడని, ఇంకొక అన్న బాలు పట్టాడని, మంత్రి రోజా రెడ్డికి జగనన్న బ్యాటింగ్ నేర్పించారని చెప్పుకోవడం కాదని, ఆటగాళ్లను గౌరవించడం నేర్చుకోవాలని రఘురామకృష్ణంరాజు కోరారు.

ప్రారంభించిన తర్వాత మాక్ డ్రిల్ ఏమిటి?
ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను ప్రారంభించిన తర్వాత మాక్ డ్రిల్ చేశామని అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రారంభించిన 24 గంటల వ్యవధిలోనే ఊడిపోయింది. బ్రిడ్జ్ ఊడిపోయిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మాక్ డ్రిల్ చేశామని అధికారులు చెప్పడం విడ్డూరం. మాక్ డ్రిల్ ఎవరైనా ప్రారంభానికి ముందు చేస్తారు. బ్రిడ్జి ప్రారంభించిన తర్వాత మాక్ డ్రిల్ చేసి, నట్లు ఊడితే ఎలా ఉంటుందో చూస్తారా? అంటూ ప్రశ్నించారు.

అది సాగిపోయి ఊడిపోయినట్లుగా ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్స్ చేయడం చాలానే చూశాం. అకస్మాత్తుగా సైరన్ కొడితే, ప్రజలు ఎలా అప్రమత్తమవుతారని పరీక్షిస్తారు. ఇంకా నయం బ్రిడ్జ్ పైన ఎవరైనా ఉండగా, వారిని లేపేయలేదు. ఇప్పటికైనా తప్పు జరిగిందని చెప్పండి. తప్పును కప్పి పుచ్చుకునేందుకు అధికారులు, ప్రభుత్వ పెద్దలు పడుతున్న తాపత్రయం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గతంలో విశాఖపట్నంలో ఒక బస్ బే నిర్మించారు. అది కూడా ప్రారంభానికి ముందే కూలిపోయింది.

ఇప్పుడేమో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రారంభించిన 24 గంటల వ్యవధిలోని ఊడిపోయింది. ఇంత దరిద్రమైన పనులు చేసేవారు మూడు రాజధానులను కడతారంటే ప్రజలు విశ్వసిస్తారా? అని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. ఇంకా నయం పోలవరం ప్రాజెక్టును కట్టలేదు. కట్టి ఉంటే నిర్మాణ దశలోనే కొట్టుకుపోయి ఉండేది. సాగునీటి ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోతే, గేట్ల నిర్వహణ కోసం గ్రీజు పెట్టడానికి కూడా నిధులను ఖర్చు చేయకపోవడం దారుణం. సాగునీటిపారుదల శాఖను ఎంత దరిద్రంగా నిర్వహిస్తున్నారో ఈ సంఘటనలను చూస్తే అర్థమవుతుంది . సాగునీటి ప్రాజెక్టుల గురించి సంబంధిత శాఖ మంత్రి పట్టించుకోరు. ఆయన ఓ సరదా మనిషి. డాన్స్ వేసుకుంటూ ఉంటారు. ఆయన డాన్స్ అంటే నాకు అభిమానమని రఘురామకృష్ణం రాజు అన్నారు.

ఫ్లోటింగ్ బ్రిడ్జిపై మనుషులు ఉండి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది. పాలెగాళ్లు పోతే ప్రజలు సంతోషించే వారేమో నాకు తెలియదు. కానీ నేను మాత్రం బాధ పడే వారిని. ఎందుకంటే వారంతా నాకు గతంలో సహచరులేనని రఘురామ కృష్ణంరాజు అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైనందుకు ఇప్పుడు ప్రజలు సంతోషిస్తూ ఉంటారు. ఎందుకంటే ఏ కట్టడమైన పాలకుల కాసుల కక్కుర్తి కూలిపోవాల్సిందే. ఎక్కడికక్కడ కమిషన్ల కక్కుర్తి తో నాసిరకమైన పనులు చేపడితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. లేకపోతే కాంట్రాక్టర్ కూలిపోతారు. గతంలో బస్సు షెల్టర్ కూలిపోయినప్పుడు కూడా కార్పొరేషన్ అధికారులు ఇటువంటి తోకడ వివరణలనే ఇచ్చారు.

ఈ రెండు నెలలపాటైన ఎటువంటి నిర్మాణాలను చేపట్టవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయన పాలెగాళ్లకు , ఐఏఎస్ అధికారులకు, ఇంజనీర్లకు ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. విశాఖ పట్టణానికి వై వి సుబ్బారెడ్డికి అసలు సంబంధం ఏమిటి?, ఏ హోదాలో ఆయన ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను ప్రారంభించారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారా అంటే అది కూడా లేదు. రెండు నెలలు ముఖ్యమంత్రిగా కొనసాగే జగన్మోహన్ రెడ్డికి బాబాయి అన్న ఒకే ఒక కారణంగా ప్రభుత్వ నిధులతో చేపట్టిన నిర్మాణాన్ని ప్రారంభిస్తారా? అంటూ రఘురామ కృష్ణంరాజు నిలదీశారు.

రక్తపు కూడు సంపాదన ఎవరి కోసం జగన్ మోహన్ రెడ్డి?!
రక్తపు కూడు సంపాదన ఎవరికోసమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. నీకు ఉన్నది ఇద్దరు కూతుర్లు మాత్రమే… వారు కూడా రేపు ఈ రక్తపు కూడు సంపాదన వద్దనే అంటారు. ఇప్పటికే నీకు 50 ఏళ్ల వయసు దాటింది. బాగా బ్రతికితే మరో 30 ఏళ్ల పాటు జీవిస్తావు. వయసు పైబడిన వారంటే నీకు గౌరవం లేదు. వయసు పైబడిన వారిని ముసలి వాళ్లు అంటూ చీదరించుకుంటావు. నువ్వు నిండా నూరేళ్లు బ్రతికిన నెలకు కోటి రూపాయల చొప్పున ఖర్చు చేసిన 550 కోట్ల రూపాయలు సరిపోతాయి. మరి ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకొని, రక్తపు కూడు సంపాదించడం నీకు అవసరమా? అంటూ నిలదీశారు.

ఇప్పటికైనా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడే వ్యాపారాలను మానేయాలని రఘురామ కృష్ణంరాజు కోరారు. సారా వ్యాపారం చేసిన వారు ఎవరు కూడా బాగుపడిన దాఖలాలు లేవు. నేను కొన్ని కుటుంబాలను స్టడీ చేసే ఈ విషయాన్ని చెబుతున్నాను. సిబిఎన్ ఫోరం మహిళలతో జరిగిన పరిచయ కార్యక్రమం లో గ్రామ గ్రామాన గంజాయి లభిస్తున్నట్లుగా వారు తెలిపారు . టూత్ పేస్ట్ దొరకడం కష్టమేమో కానీ రాష్ట్రంలోని గల్లీ గల్లీలో గంజాయి దొరుకుతుందని చెప్పారన్నారు. ఇంత జరుగుతుంటే ఎక్సైజ్, స్పెషల్ టీములు ఏమి చేస్తున్నాయని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

కంచె చేను వేసిన చందంగా సర్కారు వారి సహకారం లేకపోతే ఇంత విశృంకలంగా గంజాయి లభిస్తుందా ? అని నిలదీశారు. యువతను నిర్వీర్యం చేసే గంజాయి, రాష్ట్రంలో ప్రస్తుతం వాణిజ్య పంటగా మారి పోయిందని అపహాస్యం చేశారు. అనంతపురంలో జరిగిన బహిరంగ సభలో పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిళా రెడ్డి మాట్లాడుతూ… పాలకుడే మద్యం సరఫరాదారుడా? అనే అనుమానాన్ని వ్యక్తం చేశారన్నారు . మధ్య నిషేధం అమలు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, మద్యాన్ని అమ్ముతున్నారని ఆమె విమర్శించారు.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, రాష్ట్రంలో మద్యం సేవించిన వారి శరీరంలోని అవయవాలు త్వరగా దెబ్బతింటున్నాయని, వారు హఠాత్తుగా మరణిస్తున్నారని షర్మిలా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారన్నారు. పాలకుడి పాతకుడైతే అంతకంటే దారుణం ఏముంటుందన్న షర్మిలా రెడ్డి వ్యాఖ్యలతో తాను కూడా ఏకీభవిస్తున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

రేపటి బహిరంగ సభను ప్రజలంతా విజయవంతం చేయాలి
తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు లో తెదేపా, జనసేన పార్టీలు తెలుగు సేన విజయకేతనం పేరిట నిర్వహిస్తున్న బహిరంగ సభను ప్రజలంతా విజయవంతం చేయాలని రఘురామకృష్ణం రాజు కోరారు. ఈ ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి దించాలని కోరుకుంటున్న వారిలో నేను ఒకరిని తెలిపారు. ప్రజాస్వామ్య వాదులంతా ఈ సభకు హాజరై అప్రజా స్వామి గంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి దించేందుకు తమ వంతు మద్దతును ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు

LEAVE A RESPONSE