గిరిజన సోదర,సోదరీమణులకు వైద్యం అందించడం ఆనందం

– ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నాం
– త్వరలో 7 ప్రాంతాల్లో ఎన్టీఆర్ హెల్త్ క్లినిక్ లు ఏర్పాటు
– సాలూరు టౌన్ లో హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవంలో భువనమ్మ వ్యాఖ్య

గిరిజన సోదర, సోదరీమణులకు వైద్య సేవలు అందించడం చాలా ఆనందంగా ఉందని చంద్రబాబు సతీమణి భువనమ్మ అన్నారు. ఉత్తరాంధ్రలో నిజం గెలవాలి పర్యటనకు వెళుతూ మార్గం మధ్యలో సాలూరు పట్టణంలో ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్లినిక్ ను భువనమ్మ మంగళవారం ప్రారంభించారు. హెల్త్ క్లినిక్ ను రిబ్బన్ కత్తిరించి భువనమ్మ ప్రారంభించారు.

అనంతరం క్లినిక్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. క్లినిక్ లో ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలను భువనమ్మ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. క్లినిక్ మొత్తం పరిశీలించి ఏర్పాట్లపై సంతోషం వ్యక్తి చేశారు. సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. వైద్యం కోసం వచ్చే ప్రతి ఒక్కరికి వైద్యసేవలను అందించాలని క్లినిక్ సిబ్బందికి సూచించారు.
అనంతరం భువనమ్మ విలేకరులతో మాట్లాడుతూ… నా గిరిజన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు ఉన్న ఈ సాలూరు ప్రాంతంలో సంజీవనీ క్లీనిక్ ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో నేటికీ వైద్యం అందక గిరిజనులు పడుతున్న ఇబ్బందులను మనం చూస్తున్నాం.

సాలూరు ప్రజలకు వైద్య సేవలను అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ క్లినిక్ ను ప్రారంభించడానికి కారణం.ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా 27ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఉచిత విద్య, వైద్యం తెలుగు ప్రజలకు అందిస్తూ సేవలు అందిస్తున్నాం. ఎన్టీఆర్ ట్రస్టు నుండి 3 బ్లడ్ బ్యాంక్ కేంద్రాలు నిర్వహిస్తున్నాం. వీటి నుండి ఇప్పటి వరకు 8లక్షల మంది ప్రజలకు రక్తాన్ని ఇచ్చి కాపాడాం.

81,361 యూనిట్ల రక్తాన్ని నిరుపేదలకు ఉచితంగా అందించాం. 19,956 యూనిట్ల రక్తాన్ని తలాసేమియా బాధితులకు ఉచితంగా అందించాం. 57,652 యూనిట్లు రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు ఉచితంగా అందించాం. సంజీవని క్లినిక్స్ ద్వారా 67,104 కుటుంబాలు లబ్ధి పొందాయి. ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం ద్వారా 33,681 కుటుంబాలు నేటికి వైద్యసేవలు పొందాయి.

పాకాల, పాలకొండ, పోలవరం, కురుపాం, పాడేరు, రంపచోడవరం, అరకు ప్రాంతాల్లో ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఎన్టీఆర్ ట్రస్టు నుండి వికలాంగులకు ఉచితంగా ట్రై సైకిళ్లు, కృత్రిమ కాళ్లు అందించాం. తిరుపతి, నెల్లూరు, కడపలో వరదలు వచ్చిన సమయంలో ఇళ్లు కూలిపోయిన 175 మంది బాధితులకు ఇంటి మరమ్మతులు కోసం ఒక్కో ఇంటికి రూ.5వేలు ఆర్థికసాయం అందించాం.

వరద సమయంలో మృతిచెందిన 48మంది బాధిత కుటుంబాలలో ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థికసాయం అందించాం. కేరళలో వరదలు వచ్చిన సమయంలో రూ.10లక్షలు విలువైన నోట్ బుక్స్, రూ.20లక్షలు విలువైన మెడిసిన్స్ అందించాం. కరోనా కష్టసమయంలో రూ.1.5కోట్ల రూపాయలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పాం. రూ.2.75లక్షల విలువైన మాస్కులు అందించాం. 20వేల కుటుంబాలకు కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఉచితంగా నిత్యావసర వస్తువులు, ఫుడ్ ప్యాకెట్లు, మెడిసిన్స్ ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా పంపిణీ చేశాం.

ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా స్కూళ్లు నడుపుతూ 1,938 మందికి ఉచిత విద్య, వసతి కల్పిస్తున్నాం. రూ.3.44కోట్లతో పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందిస్తున్నాం. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా రెండు క్లస్టర్లలో మూడు పెద్ద వాటర్ ప్లాంట్లు పెట్టి 3.5లక్షల మంది జనాభాకు సురక్షిత మంచినీరు అందిస్తున్నాం. ఎన్టీఆర్ పేదల పట్ల సంకల్పించిన సేవా కార్యక్రమాలను ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా నెరవేరుస్తున్నాం.సాలూరు పట్టణ ప్రజలు ఎన్టీఆర్ హెల్త్ క్లినిక్ ను సద్వినియోగం చేసుకుని, వైద్య సేవలు పొందాలని కోరుతున్నాం.

Leave a Reply