Suryaa.co.in

Andhra Pradesh

అసెంబ్లీలో టీడీపీ రాక్షసకాండ

– బాబు అరెస్టుపై చర్చకు సిద్ధమన్నా.. టీడీపీ ఓవరాక్షన్
– టీడీపీ సానుభూతి డ్రామాల ఆశలు నీరుగారాయి
– స్కిల్ స్కాంలో బాబు దొంగగా దొరికాడన్నది క్లియర్
– అందుకే, శాసనసభలో టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు
– టీడీపీ నేతల జుగుప్సాకర ప్రవర్తనను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి
-ః మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ వెల్లడి

శాసనసభ మర్యాదలను మంటగలిపిన టీడీపీః
– శాసనసభలో టీడీపీ సభ్యులు ఈరోజు అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించారు.
– సభ ప్రారంభం కాగానే వారంతా స్పీకర్‌ గారి ఛైర్‌ను చుట్టిముట్టి పేపర్లు చింపి ఆయనపై విసరడం.. శాసనసభ ఆస్తులైన కంప్యూటర్‌లను, మానిటర్‌ల ను పగులకొట్టే ప్రయత్నం చేయడం.. అద్దాల్ని ధ్వంసం చేసిన తీరు నీచాతినీచంగా ఉంది.
– కనీసం, స్పీకర్‌ గారి ఛైర్‌ను గౌరవించాలనే సభా నియమాల్ని కూడా టీడీపీ సభ్యులు ఉల్లఘించి పైశాచికత్వాన్ని ప్రదర్శించారు.
– ప్రజాస్వామ్యంలో శాసనసభకు ఉన్నటువంటి గౌరవం తెలియని ఈ టీడీపీ నేతలు సభాపతి ముందు వెర్రివేషాలేయడం మర్యాదేనా..? అని అడుగుతున్నాను.
– టీడీపీ సభ్యుడొకరు బల్లల మీద డ్రమ్స్‌ వాయిస్తుంటే. మొన్నటిదాకా వైఎస్‌ఆర్‌సీపీలోనే ఉండి పోయిన మరొక సభ్యుడేమో మరింత ఓవరాక్షన్‌ తో అక్కడున్న కంప్యూటర్‌లను పగులకొట్టే ప్రయత్నం చేస్తాడు.. మరీ ఇంత దిగజారుడుతనంగా వ్రవర్తిస్తారా..?
– సభలో ఆల్రెడీ రెడ్‌మార్కు పెట్టినా.. ఆ మార్క్ దాటిన సభ్యులెవరైనా ఆటోమేటిక్‌గా వారు సస్పెండ్‌ అవుతారనే రూల్‌ ఉంది. అయినా.. ఆ రూల్‌ మాకేం పట్టదన్నట్లు వ్యవహరించడం టీడీపీ నేతలకు అలవాటైంది.

చంద్రబాబు దొంగగా దొరికాడన్నది క్లియర్
– చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో ఒక కుంభకోణానికి సూత్రధారిగా వ్యవహరించాడు. యువతకు ఉద్యోగాలకు సంబంధించి నైపుణ్యాలపై శిక్షణ నిమిత్తం సీమెన్స్‌ సంస్థ ఒప్పందం పేరిట రూ.371 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసినట్లు సీఐడీ పోలీసులు ఆధారాలతో సహా తేల్చారు. అందులో రూ.241 కోట్లు హవాలా మార్గంలో షెల్‌ కంపెనీల ద్వారా తిరిగి చంద్రబాబుకే చేరాయన్నది కేసు. అందుకే, అరెస్టు చేసి చంద్రబాబును కోర్టులో ప్రవేశ పెడితే.. గౌరవ న్యాయమూర్తి వారు ఆయన్ను రిమాండ్‌కు పంపారు.
– మరి, వారిని ఏసీబీ కోర్టు ఎదుటకు తెచ్చినప్పుడు చంద్రబాబు గానీ.. ఆయన తరఫున ఢిల్లీ నుంచి వచ్చిన సీనియర్‌ న్యాయవాది లూథ్రా గానీ ఎక్కడా కూడా స్కిల్‌స్కామ్‌ జరగలేదని చెప్పలేదు. ప్రజాధనం దుర్వినియోగం కాలేదని.. ఇందులో చంద్రబాబు ప్రమేయం ఏమీలేదని కూడా చెప్పలేదు. కేవలం, ఆయన అరెస్టులో పాటించాల్సిన టెక్నికల్‌ అంశాలను మాత్రమే వారు న్యాయమూర్తి ఎదుట చెప్పుకున్నారు. సీఐడీ అప్పటికే సమర్పించిన ఆధారాల్ని బట్టి వాటిని పరిశీలించి, ప్రైమ్ ఆఫ్ ఏసీ ఉందని నమ్మాకే చంద్రబాబును న్యాయస్థానం రిమాండ్‌కు తరలించడం జరిగింది. ఇది వాస్తవం.

టీడీపీ సానుభూతి డ్రామాల ఆశలు నీరుగారాయి..
చంద్రబాబు అరెస్టు, జైలు రిమాండ్‌తో ప్రజల్లో విపరీతంగా సానుభూతి పెరుగుతుందనే టీడీపీ ఆశలు నీరుగారిపోయాయి. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. ఆయన స్కిల్‌స్కామ్‌లో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన దొంగగానే జైలుకెళ్లారనేది ప్రజల్లో స్పష్టత వచ్చింది. అందుకే, ఎవరూ బయటకొచ్చి టీడీపీ కార్యక్రమాలకు మద్ధతివ్వడంలేదు. తాము అనుకున్న సానుభూతి రాలేదనే ఫ్రస్టేషన్‌తోనే టీడీపీ సభ్యులు ఇంత రగడ చేశారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినట్లు ఇన్నాళ్లూ ఏవేవో పచ్చమీడియాలో మాట్లాడిన టీడీపీ నేతలు …. అవే మాటల్ని శాసనసభలో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు.

చర్చకు సిద్ధమన్నా.. టీడీపీ గొడవెందుకు..?
– చంద్రబాబు అరెస్టుకు సంబంధించి ప్రభుత్వం కూడా శాసనసభలో చర్చ ద్వారా ప్రజలకు వివరించేందుకు సిద్ధపడింది. సభాపతితో పాటు శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్ర గారు ఈ వ్యవహారంపై చర్చిద్దామని పదేపదే చెప్పారు. అయితే, ఇది మాత్రం టీడీపీ సభ్యులకు ఇష్టంలేదేమో.. అందుకే, వారంతగా ఈరోజు సభలో గందరగోళం చేశారు.
– ఒకపక్కన చంద్రబాబు అరెస్టుపై ఆధారాలతో సహా చర్చిస్తామయ్యా.. అంటే, అవేమీ పట్టనట్టు.. కేవలం శాసనసభలో ఏదొక అలజడి, అల్లరి సృష్టించాలి. సస్పెండ్‌చేయించుకుని బయటకెళ్లాలనే లక్ష్యంతోనే టీడీపీ సభ్యులు వచ్చారనేది స్పష్టంగా అర్ధమైంది.
– బాలకృష్ణ ప్రవర్తన మరీ ఇంత దిగజారుడుతనంతో ఉంటుందనుకోలేదు. ఆయనేదో మీసం మెలేస్తాడు. తొడగొడతాడు. శాసనసభ అనుకున్నాడా..? లేదంటే, ఆయనేమైనా షూటింగ్‌కొచ్చి నటిస్తున్నాననుకున్నాడా..?
– టీడీపీ నేతలు ఈరోజు శాసనసభలో జరిపిన రాక్షసకాండను ప్రజలంతా గమనించారు. వారిని ప్రజాక్షేత్రంలో ఛీ కొడతారనేది వాస్తవం. శాసనసభలో ఇలాంటి పైశాచికత్వ ప్రదర్శనలను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాల్సిన అవసరముందని మనవి చేస్తున్నాను.

LEAVE A RESPONSE