Suryaa.co.in

Andhra Pradesh

అంబేడ్కర్ ను ఆకాశంలో పెట్టి దళితులను పాతాళానికి తొక్కడం జగన్ రెడ్డి నైజం

– టిడిపి రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు 

జగన్ రెడ్డికి అంబేడ్కర్ పేరు ఉచ్చరించే నైతిక అర్హత లేదని, జగన్ రెడ్డి దళితులకు చేసిన ఆకృత్యాలకు పాపపరిష్కారం ఈ జన్మలో కడుక్కున్నా పోవని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. ఈ నెల 19 న స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ చేస్తున్న నేపద్యంలో పత్రికా ప్రకటన విడుదల చేశారు.

అందులో ఆయన ఇలా పేర్కొన్నారు….. అంబేడ్కర్‌ను ఆకాశంలో పెట్టి దళితులను పాతాళానికి తొక్కడం జగన్ రెడ్డి నైజం. ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో దళితులుపై 6 వేలకు పైగా దాడులు జరిగాయి. 188 మంది దళితుల్ని హత్య చేశారు. దళిత దీనజనోద్ధారకుడిలా నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ ఊదరగొట్టే జగన్ రెడ్డి పాలనలో వారానికి 4 గురు దళితులు హత్యలకు, 6 గురు హత్యాయత్నాలకు, రోజుకు ఇద్దరు దళితులు దాడులకు, వారానికి 3 ముగ్గురు దళిత మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. దళితులకు రాజ్యాంగబద్ధంగా అమలు కావాల్సిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేసిన జగన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని విగ్రహ ఆవిష్కరణ చేస్తారని ఎద్దేవా చేశారు.

జగన్ రెడ్డి 4 లక్షల మంది దళిత సోదరులకు టిడిపి హయాంలో ఉపాధి కల్పించిన ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశాడు. దళిత బిడ్డలు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు తీసుకొచ్చిన అంబేడ్కర్ విదేశీ విద్యాపథకాన్ని నాలుగేళ్లుపాటు అటకెక్కించి, అంబేడ్కర్ పేరు తొలగించి.. జగన్ రెడ్డి విదేశీ విద్యగా మార్చి అంబేడ్కర్‌ను అవమాపరిచాడు. దళితులు ఆత్మగౌరవంతో సగర్వంగా బ్రతికేందుకు తెలుగుదేశం ప్రభుత్వం భూమి కొనుగోలు పథకం (ల్యాండ్ పర్చేజింగ్ స్కీము) తీసుకొస్తే జగన్ రెడ్డి దాన్ని రద్దు చేశాడు.

వివిధ ప్రభుత్వ శాఖాల్లో ఖాళీగా ఉన్న 50 వేల బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయలేదు. దళిత బిడ్డలు సైతం కార్పొరేట్ విద్య అభ్యసించేందుకు చంద్రబాబు నాయుడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసుకొస్తే జగన్ రెడ్డి దాన్ని రద్దు చేశాడు. 7748 మంది దళిత యువకులు ప్రయోజనం పొందిన ఇన్నోవాకార్ల పథకం రద్దు చేసిన దళిత ద్రోహి జగన్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ చెల్లిమ్మల వివాహానికి ‘వైఎస్ఆర్ పెళ్లికానుక’ రూ. లక్ష ఇస్తానని మ్యానిఫెస్టోలో చెప్పి ఒక్కరికీ ఇవ్వలేదు.

15 దళిత నియోజకవర్గాల మధ్యనున్న అమరావతిలో దళిత రాజధానిని నీరుగార్చారు. కోడికత్తి డ్రామాలో దళిత బిడ్డ శ్రీనివాస్‌ను, ఆయేషా మీరా కేసులో దళిత బిడ్డ సత్యంబాబును ఏళ్ల తరబడి జైలుపాలు చేశారు. జంగారెడ్డిగూడెంలో జరిగిన కల్తీ మద్యం మృతుల్లో 12 మంది దళితులే. సలహాదారులుగా దళితులకు తగిన అర్హతలు లేదంటూ అసెంబ్లీ సాక్షిగా అవమానించారు. జగన్ రెడ్డిని పాపాలను క్షమించేందుకు దళితులు సిద్దంగా లేరు. రాబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించేందుకు దళితులు ఎదురు చూస్తున్నారు.

LEAVE A RESPONSE