– ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో చేనేత జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ. సిసోడియా
– రాష్ట్ర పౌరాణిక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా తిరుమల లేపాక్షి భవనం
– పర్యాటక ప్రదేశాలలో ఆప్కో, లేపాక్షి షోరూంల ఏర్పాటుకు చర్యలు
అమరావతి : వాణిజ్య సంస్థలకు ప్రచారం అత్యంత కీలకమని చేనేత జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ. సిసోడియా పేర్కొన్నారు. మెరుగైన అమ్మకాల కోసం ఆధునిక మార్కెటింగ్ పద్ధతులు అనుసరించి కొత్త తరహా ప్రకటనా వ్యూహాలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
శుక్రవారం చేనేత, జౌళి శాఖ, ఆప్కో, లేపాక్షి మరియు ఆంధ్రప్రదేశ్ ఖాదీ గ్రామీణ పారిశ్రామిక మండలి అధికారులతో మంగళగిరి చేనేత జౌళి శాఖ కమీషనరేట్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ. సిసోడియా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ పర్యాటక కేంద్రాల్లో ఆప్కో , లేపాక్షి షోరూములను ప్రారంభించాలని సూచించారు.
లేపాక్షి బ్రాండ్ ద్వారా పురాతన శైలి కలిగిన కలప (ఆంటిక్ వుడ్) ఫర్నిచర్ విక్రయాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. గ్రామీణ స్థాయిలో స్థానిక ప్రతిభను ప్రోత్సహించి, కొత్త డిజైన్ల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని, ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించి అవార్డులు ఇవ్వాలని సూచించారు. ఉత్పత్తులకు విలువ జోడించే మార్గాలను అన్వేషించాలని పేర్కొన్నారు.
తిరుమలలో కొత్తగా నిర్మించనున్న లేపాక్షి భవనం రాష్ట్ర పౌరాణిక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలన్నారు. ఆప్కోకు ప్రభుత్వ శాఖల వద్ద నుండి రావలసిన బకాయిలను (బ్యాడ్ డెబిట్స్) తక్షణమే వసూలు చేయాల్సిన అవసరముందని, దీని కోసం ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రచార కార్యక్రమాల కోసం ప్రతిష్టాత్మక ప్రచార సంస్థలను నియమించాలని సూచించారు. ప్రభుత్వ శాఖలు తమ అవసరాలన్నింటిని ఆప్కో నుంచే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని, అవసరం అయితే ఇందుకు ప్రభుత్వ సహకారం తీసుకుందామన్నారు.
ఈ సమావేశంలో చేనేత జౌళి శాఖ కమిషనర్ జి. రేఖారాణి తమ శాఖ చేపట్టిన తాజా కార్యక్రమాలు, ప్రగతి అంశాలను వివరించి, సమగ్ర సమాచారం అందించారు. లేపాక్షి , ఆప్కో సంస్థల ఎండీ ఎం. విశ్వ మాట్లాడుతూ ఈ రెండు సంస్థల నేపథ్యం, ప్రస్తుత ఆర్ధిక పరిస్థితులు వివరించారు. ఆప్కో కు ప్రభుత్వ మద్దతు ఆవశ్యకతను ప్రస్తావించారు. కెవిఐబి సీఈఓ వీఆర్. విజయరాఘవ నాయిక్ శాఖ ప్రధాన కార్యక్రమాలు, గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని వివరించారు.
ఈ సమావేశంలో చేనేత, హస్తకళల అదనపు సంచాలకుడు మురళీ కృష్ణ, సంయుక్త సంచాలకులు కన్నబాబు, నాగేశ్వరరావు, రాజారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రతిపాదిత కార్యక్రమాల అమలుకు చర్యల ప్రణాళిక రూపొందించి, విభాగాల మధ్య సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించారు.