Suryaa.co.in

Telangana

ప్రజాకర్షక పథకాల కంటే.. అభివృద్ధి, సంక్షేమానికే పెద్దపీట

– అమృతకాలంలో.. వికసిత భారత లక్ష్యాలకు రాచబాట
– 2024 మధ్యంతర బడ్జెట్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ : ఈ బడ్జెట్ గతపదేళ్లలో మోదీ ప్రభుత్వం GYAN నినాదంతో (G-గరీబ్ కల్యాణ్ – పేదల సంక్షేమం, Y- యూత్ – యువత సాధికారత, A- అగ్రికల్చర్ – వ్యవసాయం, N-నారీశక్తి సాధికారత) పనిచేసింది.దీని ఫలితంగానే.. పేదరికం గణనీయంగా తగ్గడంతోపాటుగా.. వివిధ రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధ్యమైంది.

వికసిత భారత సంకల్ప లక్ష్యాలను ఈ బడ్జెట్ ప్రతిబింబించింది. అమృత్ కాల్ (వచ్చే 25 ఏళ్ల సమయం)లో భారతదేశం సాధించాల్సిన ప్రగతిని నిర్దేశించుకుని.. వాటిని చేరుకునేందుకు ఏయే రంగాల్లో దృష్టి సారించాలో తెలియజేసేలా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగింది. ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతో పాపులిస్టిక్ (ప్రజాకర్షక పథకాలు) బడ్జెట్ కాకుండా.. దేశ అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని రూపొందించిన బడ్జెట్ ఇది.

మౌలిక వసతుల రంగానికి భారీ ప్రోత్సాహం
దేశంలో ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పన ద్వారా.. అభివృద్ధికి బాటలు వేయాలనే సంకల్పంతో కేంద్రం పనిచేస్తోంది. ఇందులో భాగంగా.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ.. మౌలిక వసతుల రంగంపై చేయాల్సిన వ్యయాన్ని 11.1% పెంచింది. ఈ మొత్తం 11.11 లక్షల కోట్లు.

పునరుత్పాదక విద్యుత్
సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో.. ఇళ్ల పైకప్పులపై.. సోలార్ ప్యానెళ్లను ఏర్పాటుచేసే ప్రక్రియకు ఈ బడ్జెట్ లో శ్రీకారం చుట్టారు. కోటి ఇళ్లకు సోలార్ ప్యానెళ్లను అమర్చడం ద్వారా.. ప్రతి నెలా ఒక్కో ఇంటినుంచి 300 యూనిట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంతో పనిచేయనున్నారు.

పేదలు, మధ్యతరగతికి మద్దతుగా..
మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కిరాయి ఇళ్లలోనే ఉంటున్నారని గుర్తించి.. వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు రుణసదుపాయం కల్పించనున్నారు.
దీంతోపాటుగా.. ప్రధానమంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజనలో భాగంగా నిర్దేశించుకున్న 3 కోట్ల ఇళ్ల లక్ష్యాన్ని చేరుకున్నందున.. మరో 2 కోట్ల ఇళ్లను వచ్చే ఐదేళ్లలో నిర్మించే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.

మహిళా సాధికారతకు పెద్దపీట
దేశవ్యాప్తంగా 83 లక్షల స్వయం సహాయక బృందాల్లోని 9 కోట్ల మంది మహిళలు.. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక-ఆర్థిక ప్రగతిలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఇలాంటి వారిలో చాలా మంది ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచి కనీసం 2 కోట్ల మందిని లక్షాధికారులుగా చేయాలన్న టార్గెట్‌ను 3 కోట్లకు పెంచారు. తద్వారా మహిళాసాధికారతను మరో మెట్టు పెంచనున్నారు.

పర్యాటకానికి ఊతం
ప్రఖ్యాత పర్యాటక క్షేత్రాలను అభివృద్ధి చేయడంతోపాటుగా.. వాటిని అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్, మార్కెటింగ్ చేయడంపైనా ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత కల్పించారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాల్లో పోటీ తత్వాన్ని పెంచి వారిని ప్రోత్సహించనున్నారు. దీంతోపాటుగా లక్షద్వీప్ వంటి ద్వీపప్రాంతాల్లో పర్యాటక మౌలిక వసతుల కల్పన కు పెద్దపీట వేస్తూ.. ఆయా ప్రాంతాలకు అనుసంధానత (కనెక్టివిటీ) పెరిగేలా చర్యలు తీసుకోనున్నారు. 40వేల సాధారణ రైలు బోగాలను వందేభా రత్ ప్రమాణాలతో ఆధునీకరించనున్నారు.

పన్నుల సంస్కరణలు
2009-10 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్నటువంటి రూ.25వేల వరకు ఔట్‌స్టాండింగ్ డైరెక్ట్ టాక్స్ డిమాండ్స్, 2010-11 నుంచి 2014-15 వరకు ఉన్నటువంటి రూ.10వేల ఔట్‌స్టాండింగ్ డైరెక్ట్ టాక్స్ డిమాండ్స్ ను వెనక్కు తీసుకుంటున్నట్లు నిర్మలా సీతారామన్ గారు వెల్లడించారు. దీని వల్ల కోటి మంది పన్ను చెల్లింపుదారులకు మేలు జరగనుంది.

అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు ఆరోగ్య సంరక్షణ
ఆయుష్మాన్ భారత్ పథకం లబ్ధిని ఆశా వర్కర్లు, అంగన్ వాడీ వర్కర్లకు అందించనున్నారు. దీంతోపాటుగా 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు గల బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా వ్యాక్సినేషన్ అందించనున్నారు.

ఇలాంటి కార్యక్రమాలను ప్రకటించడం ద్వారా.. నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రజాకర్షక పథకాల కంటే.. దేశ సమగ్రాభివృద్ధికి, ప్రజల సంపూర్ణ సంక్షేమానికి బాటలు వేస్తుందని మరోసారి సుస్పష్టమైంది.

LEAVE A RESPONSE