– ప్రోటోకాల్ పాటించకుండా వ్యవహరించారు
– జగన్ కక్ష సాధింపు చర్యలకు ఇది నిరద్శనం
– ఆలయ సంస్కృతి, సంప్రదాయాలకు వైసీపీ తిలోదకాలు
– 400ఏళ్ల చరిత్ర గల ఆలయ ధర్మకర్తను అవమానిస్తారా?
– మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆగ్రహం
విజయవాడ : విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం బోడికొండపై రామాలయ నిర్మాణ శంకుస్థాపన సమయంలో అధికారులు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుపై ప్రవర్తించిన తీరు సరికాదని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ప్రోటోకాల్ పాటించకుండా వైసీపీ నేతలు, అధికారులు ఆలయం వద్ద ఇష్టానుసారంగా వ్యవహరించారని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు చెప్పారు.
అశోక్ గజపతి రాజును వైసీపీ కార్యకర్తలు తోసేయడం దుర్మార్గమని ఆయన చెప్పారు. ఆలయ ధర్మకర్తల మండలితో శంకుస్థాపన గురించి చర్చించకపోవడం సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు నిరద్శనమని ఆయన విమర్శించారు.ఆలయ సంస్కృతి, సంప్రదాయాలకు వైసీపీ తిలోదకాలు ఇచ్చిందని ఆయన మండిపడ్డారు. ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటుండడం దురదృష్టకరమని ఆయన చెప్పారు.
రామతీర్థంలో అశోక్ గజపతి రాజును ఇంతలా అవమానించడాన్ని ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. ఏపీలో దాదాపు 200 హిందూ ఆలయాలపై దాడులు జరిగాయని ఆయన అన్నారు. ఆయా ఘటనల్లో ఇప్పటివరకు దోషులను పట్టుకోలేదని చెప్పారు.
‘రామ తీర్థంలో అశోకగజపతిరాజు గారి పట్ల వైసీపీ నేతల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నా. 400 ఏళ్ల చరిత్ర గల ఆలయ ధర్మకర్తను అవమానిస్తారా? విగ్రహాల విధ్వంసం జరిగి ఏడాది అయినా నిందితులను ఎందుకు పట్టుకోలేక పోయారు? వ్యక్తిగత కక్షతో ఆలయ సంప్రదాయాలను మంటగలిపే హక్కు మీకు ఎవరు ఇచ్చారు వైఎస్ జగన్?’ అని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు.