ఎక్కడికి వెళ్లినా మాతృభూమిని మర్చిపోవద్దు

– స్వాతంత్ర్య సమరయోధులని ఆదర్శంగా తీసుకోవాలి
– ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
– విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఘనంగా స్నాతకోత్సవం

నెల్లూరు : నెల్లూరు జిల్లాలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులకు గవర్నర్ గోల్డ్ మెడల్స్, పట్టాలు అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ యువత ఉన్నత చదువులు చదివి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. దేశవ్యాప్తంగా ఇటీవల ఉన్నతవిద్య అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. యువత నైపుణ్యం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. 2025 నాటికి దేశంలో 1.2 కోట్ల మంది యువత స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ పొందాలని గవర్నర్ బిశ్వభూషణ్ తెలిపారు.

దేశ భవితను కాపాడగల సత్తా యువతకి విద్యతోనే వస్తుందని అన్నారు. యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి దేశ విదేశాలకి వెళ్తారని, ఎక్కడికి వెళ్లినా మాతృభూమిని మర్చిపోవద్దని, సామాజిక బాధ్యతని తప్పకుండా పాటించాలని విద్యార్థులకు సూచనలు చేశారు. దేశం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులని ఆదర్శంగా తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌తో పాటు మల్లారెడ్డి వర్సిటీ ఛాన్సిలర్ డీఎన్ రెడ్డి), వీఎస్ యూ వైస్ ఛాన్సిలర్ సుందరవల్లి, రిజిస్ట్రార్ విజయకృష్ణారెడ్డి హాజరయ్యారు.

Leave a Reply