జాతి మనోభావాలు దెబ్బతిని ఉంటే.. మీ జాతి బిడ్డగా చింతిస్తున్నా

– వక్రీకరణలే ఎజెండాగా వికృత రాతలు రాస్తున్న ఎల్లో మీడియాను నమ్మొద్దు
– శెట్టి బలిజలను, బలహీనవర్గాలను దగా చేసిన పార్టీ తెలుగుదేశం
– శెట్టి బలిజలను హేళన చేసిన మీరా నీతులు చెప్పేది..?
– బాబులా చీకట్లో చిదంబరం, నేరుగా మోడీ కాళ్ళు పట్టుకోలేదు
– జాతి కాదు.. జాతీయుడిగా అనే చెప్పా..
– శెట్టిబలిజ జాతీయుడు చిట్టబ్బాయ్‌ కుటుంబానికి మేలు చేసిన జగన్ కి కృతజ్ఞత తెలియజేయడమే నేరమా..?
– రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ

మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
గడిచిన వారం రోజులుగా రాష్ట్రంలో ఎల్లో మీడియాకు చెందిన రెండు పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌, టీవీ5, ఈటీవీలు… శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందినవారిపై తమకు అమితమైన ప్రేమ ఏదో ఉన్నట్టు, జరగనిది జరిగినట్లుగా తమదైన వక్ర భాష్యాలతో విష ప్రచారం చేస్తున్నారు. శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని నేనేదో తాకట్టు పెట్టినట్లుగా ఇష్టం వచ్చినట్లు రాతలు రాస్తూ, టీడీపీ, జనసేనలకు చెందిన కొంతమంది నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

మా శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన కుడిపూడి చిట్టబ్బాయ్‌ వర్థంతి సభకు వెళ్ళి, ఆ కుటుంబానికి ఎంతో సాయం చేసిన, శెట్టి బలిజలను గుండెల్లో పెట్టుకుని చూస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతపూర్వకంగా, ఆయన ప్రతినిధిగా ఆ సభకు వచ్చిన పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కి నేను మోకాళ్ళపై వంగి నమస్కారం చేస్తే… దానికి వక్రభాష్యాలు చెబుతూ చిలువలు పలువలుగా మాట్లాడుతున్నారు. ఆ నమస్కారాన్ని నేను సంస్కారంగానే భావించానే తప్ప, ఎవరినీ అవమానించడానికి కానేకాదు.

లేనిదానిని ఉన్నట్టు చూపుతూ, వక్రభాష్యాలు చెబుతూ… ఎల్లో మీడియా చేసిన దుష్ప్రచారాల వల్ల, అది మా జాతీయులకు ఎవరికైనా బాధకలిగించినట్లు అయితే.. దానికి నేను చింతిస్తున్నాను, బాధపడుతున్నాను. మనకు సాయం చేసినవారికి కృతజ్ఞతగా ఉండాలనే భావనే తప్ప, అందులో ఎటువంటి దురుద్దేశాలు లేవు. కృతజ్ఞత తెలియచేయడమే నేరం అన్నట్టుగా మా సామాజికవర్గానికి చెందిన టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కొంతమంది నేతలు మాట్లాడటం చూస్తుంటే విచిత్రంగానూ, వింతగానూ ఉంది. మా సామాజికవర్గంలో చిచ్చు పెట్టి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్నదే టీడీపీ, జనసేన పార్టీల ఉద్దేశం.

జాతి కాదు.. ఒక జాతీయుడిగా అని నేను ఉచ్ఛరించిన పదాన్ని, ఏబీఎన్, ఈటీవీ, టీవీ5లు జాతి తరఫున అన్నట్టుగా, నేనేదో జాతిని తాకట్టు పెట్టినట్టు విష ప్రచారాని తెరతీయడం దారుణం. ఇందుకు సంబంధించి మాట్లాడిన వీడియోను మీడియాకు విడుదల చేశాను కూడా.

నాపై విమర్శలు చేస్తున్న జనసేన నాయకులను ప్రశ్నిస్తున్నా. మరి, మీ జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ వెళ్ళి మాయావతి కాళ్ళు పట్టుకున్నారు. అలానే చంద్రబాబు మాదిరిగా చీకట్లో చిదంబరం, నేరుగా మోడీ కాళ్ళు పట్టుకోలేదు. చీకటి రాజకీయాలు మాకు తెలియవు. మేం చేయం.

ఇదే శెట్టి బలిజ వర్గీయులు.. 2014లో మాకు రెండు సీట్లు ఇవ్వండి అని చంద్రబాబును అడిగితే.. “సీట్లు ఇస్తే మీరు గెలుస్తారా.. మీకు ఆ సామర్థ్యం ఉందా” అని హేళన చేశారు.

శెట్టి బలిజ వర్గానికి చెందిన చెల్లుబోయిన వేణు అనే నాపై జగన్ గారి మనసులో ప్రత్యేకమైన స్థానం ఉండబట్టే.. కొత్త మంత్రివర్గంలో బీసీ సంక్షేమంతోపాటు సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించారు.

శెట్టి బలిజలకు జగన్ ఇస్తున్న ప్రాధాన్యం, పదవులు చూసి, ఆ సామాజిక వర్గం అంతా వైఎస్ఆర్సీపీకి చేరువ అవ్వడంతో ఓర్చుకోలేక టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన వారు ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు.

జాతిని అమ్ముకోవాల్సిన ఖర్మ నాకు పట్టలేదు. జాతిని నమ్ముకుంటాను తప్ప అమ్ముకోను. మా జాతి నాయకులకు మేలు జరుగుతుందంటే.. వారి కోసం ఎంతవరకైనా పోరాడతా. శెట్టి బలిజ సామాజిక వర్గం ఉన్నతికి కృషి చేస్తున్న నాయకుడు జగన్ .

శెట్టి బలిజ సామాజిక వర్గం పడుతున్న కష్టాలను శాసనసభలలో వివరించాను. బీసీల్లోని 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. బీసీ సంక్షేమ శాఖ ద్వారా, రాష్ట్ర బడ్జెట్ లో అధిక శాతం రూ. 32 వేల కోట్ల నిధులు కేటాయించి ఈ వర్గాలను ఆదుకుంటున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి.

కల్లు గీత కార్మికులుగా ఉన్న మేము ఈరోజు ఉన్నతమైన పదవుల్లో ఉన్నాం.. రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడితే… అందులో రెండు స్థానాలను బీసీలకు కేటాయించి, మా జాతికి దేశవ్యాప్తంగా గౌరవం, గుర్తింపు కల్పించిన నాయకుడు జగన్ గారు. రెండు రాజ్యసభ స్థానాల్లో… ఒకటి మా శెట్టిబలిజ వర్గానికే చెందిన పిల్లి సుభాష్ చంద్రబోసు కి, రెండోది మత్స్యకార వర్గానికి చెందిన మోపిదేవి వెంకట రమణ కి ఇచ్చి వారిని రాజ్యసభకు పంపించిన ఘనత జగన్ మోహన్ రెడ్డిగారికే దక్కుతుంది. బీసీలకు 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా బీసీల ఆత్మ గౌరవాన్ని పెంచిన నాయకుడు జగన్ . బీసీలకు ఏనాడూ మంచి చేయని చంద్రబాబు, టీడీపీ నాయకులు మాపై విమర్శలు చేయడం విడ్డూరం.

Leave a Reply