– డల్లాస్ విశ్వహిందీ సదస్సులో యార్లగడ్డ
డల్లాస్: దేశమైదేతేనేం మట్టి ఒక్కటే..భాష ఏదైతేనేం మాధుర్యం ఒక్కటేనని తాము ఎక్కడి నుండి ఎదిగామనేది గుర్తుపెట్టుకోవాలని, మూలాలను మరిచిపోకూడదని విశ్వహింది పరిషత్ జాతీయ అధ్యక్షుడు డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ హిందీ సమితి ఆధ్వర్యంలో సోమవారం డల్లాస్ లో నిర్వహించిన’ విశ్వ హిందీ దివస్ ‘ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
భాష ఒక్కటే మన ఉనికికి గీటురాయి అని ఆయన అన్నారు. అధ్యయనం, అనువాదం, రచన, పఠనం తదితరాదుల ద్వారా భాషతో ఏదో రూపేణా అనుబంధాన్ని కొనసాగించినప్పుడే తల్లివేరుతో ధృఢమైన బంధం ఏర్పర్చుకోవచ్చునని వెల్లడించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అగ్గి రాజేస్తున్న త్రిభాషా సూత్రంపై యార్లగడ్డ ప్రసంగించారు. ఒక మాతృభాష, ఒక విదేశీ భాష, ఒక అన్య భారతీయ భాషను అధ్యయనం చేయాలని త్రిభాషా సూత్రం స్పష్టంగా సూచిస్తున్నప్పటికీ దాన్ని జాతిజనులపై హిందీ రుద్దే ప్రక్రియగా చిత్రీకరించడం విచారకరమన్నారు.
భాషాధ్యాయనాలపై ప్రతి పౌరిడికి త్రిభాషా సూత్రం పూర్తి స్వేచ్ఛను కల్పించిందని లక్ష్మీప్రసాద్ స్పష్టం చేశారు. గడిచిన 5వేల ఏళ్లలో ఈ భూంపై నడయాడిన అయిదుగురు వ్యక్తులను మానవాళి ప్రేమించి, ఆదరించి, గౌరవించి, పూజించిందని తెలిపారు. శ్రీకృష్ణుడు, యేసుక్రీస్తు, మహమద్ ప్రవక్త, గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ ఈ జాబితాలో ఉన్నారని అన్నారు.
మహాత్ముని కుమారుడు దేవదాస్ గాంధీ దక్షిణ భారత హిందీ ప్రచార సభ ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ భాష్య వ్యాప్తికి ఉత్తర భారతం నుండి వచ్చిన తొలి హిందీ అధ్యాపకుడని తెలిపారు. మద్రాసులో చక్రవర్తి రాజగోపాలాచారి గృహంలో బసచేసి, హిందీ అధ్యాపకులను తయారుచేసిన దేవదాస్ దక్షిణాది రాష్ట్రాల్లో ఆ భాషను వ్యాప్తిచేయడంలో విశేష కృషి చేశారని తెలిపారు.
ఆయన కృషి ఫలితంగానే ఉత్తరాది వారి కన్నా కూడా మంచి రచనలు దక్షిణాది నుండి వచ్చిన హిందీ రచయితలు వచ్చారని వెల్లడించారు. మద్రాసు నుండి ప్రచురితమైన చందమామ హిందీ పత్రిక, ఆలూరి భైరాగి వంటి వారి రచనలను ఆయన ఉటంకించారు. భాష అనే వారధిపై ప్రపంచాలు చుట్టి రావచ్చునని తెలిపారు. హిందీ భాష వ్యాప్తికి, అధ్యయనానికి అంతర్జాతీయ హిందీ సమితి డల్లాస్ విభాగాన్ని అభినందించారు.
అనంతరం అక్కినేనిపై యార్లగడ్డ హిందీలో రచించిన ‘అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ్’ పుస్తకాన్ని అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సహకారంతో ఆవిష్కరించారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షురాలు వీణా శర్మ, అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రతినిధులు డా. తోటకూర ప్రసాద్, వెన్నం మురళీ, కల్వల రావు తదితరులు పాల్గొన్నారు.