Suryaa.co.in

National

హైదరాబాద్‌లో ఎక్లాట్ హెల్త్ కొత్త ఆఫీస్

దావోస్‌: ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలో పేరొందిన ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కంపెనీ రాష్ట్రంలో మరో ఆఫీసు ఏర్పాటు చేయనుంది. దాదాపు 800 మంది ఉద్యోగులకు సదుపాయముండేలా దీన్ని నెలకొల్పుతుంది.

దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు ఎక్లాట్ కంపెనీ సీఈవో కార్తీక్ పోల్సాని తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రకటించారు.విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో అత్యాధునిక 800-సీట్ల సౌకర్యాన్ని ఎక్లాట్ ఏర్పాటు చేస్తుంది. ఏప్రిల్ 2025 నాటికి ఇది పని చేయటం ప్రారంభిస్తుంది.

హెల్త్ కేర్ రంగంలో అమెరికాలోనే అతి పెద్ద యునైటెడ్ వ్యవస్థ ఉన్న కంపెనీ తమ వినియోగదారులకు మరింత సమర్థవంతమైన సేవలను అందించేందుకు అదనంగా ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది. రెవెన్యూ, డేటా అనలిటిక్స్, ఏఐ ఆధారిత క్లినికల్ డాక్యుమెంటేషన్ సొల్యూషన్స్ లో ఈ కంపెనీ కి ప్రత్యేక గుర్తింపు ఉంది.

వాషింగ్టన్, డి.సి.లో ప్రధాన కార్యాలయమున్న ఎక్లాట్ హెల్త్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 3,000 మందికి పైగా నిపుణులను నియమించింది. అమెరికాలోనే 450 మంది ఉద్యోగులున్నారు. హైదరాబాద్‌లోని ఇప్పటికే ఉన్న రెండు ఆఫీసుల్లో 2,000 మందికి పైగా ఉద్యోగులున్నారు. 2011లో ద్వితీయ శ్రేణి నగరమైన కరీంనగర్ లో ఈ కంపెనీ పైలెట్ కార్యకలాపాలు ప్రారంభించింది. అక్కడ దాదాపు 500 మంది పని చేస్తున్నారు. ఎక్లాట్ విస్తరణతో తెలంగాణలో కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నైపుణ్య అభివృద్ధి కి దోహదపడుతుంది.

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రోత్సహకరంగా ఉన్నాయని ఎక్లాట్ హెల్త్ గ్రూప్ సీఈవో కార్తీక్ పోల్సాని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తమ క్లయింట్‌లకు హెల్త్ కేర్ సేవలను అందించేందుకు రాష్ట్రంలో అన్ని అనుకూలతలు ఉన్నాయని చెప్పారు. అత్యాధునిక సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ కంపెనీలను ఆకర్షించడంలో తెలంగాణ ముందంజలో ఉందని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE